ప్రధాన కార్యక్రమానికి ముందు శ్రీ వకుళామాత ఆలయ సమీపంలోని యాగశాలలో వేదపండితులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠ, కుంభారాధనతో పాటు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ వకుళామాతకు చతుర్కలశ స్నపనం, పంచగవ్యాభిషేకం, క్షీరాభిషేకం, జలాభిషేకం, వివిధ హోమాలను మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన జేఈవో డా. ఎ. శరత్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మప్రచార పరిషత్ ఇన్చార్జి కార్యదర్శి డా. మేడసాని మోహన్, డిప్యూటీ ఈవోలు, ఇంజినీరింగ్, విజిలెన్స్, ఆరోగ్య శాఖల అధికారులు పాల్గొన్నారు. చిన్నారుల జీవితంలో తొలి విద్యా అడుగు శ్రీ వకుళామాత, శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్య సాక్షిగా ప్రారంభం కానుండటంతో భక్తుల్లో విశేష ఆసక్తి నెలకొంది.













