Last Updated:
AP News: పెట్టుబడులు, మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పన అంశంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. వైసీపీ హయాంలో అనేక పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని అన్నారు. ఈ క్రమంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
CM Chandrababu: ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి జరిగిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఏపీ లిక్కర్ స్కామ్ దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. మొదట ఈ కుంభకోణం విలువ సుమారు రూ.3,500 కోట్లుగా అంచనా వేశారని, కానీ తాజా వివరాల ప్రకారం అది రూ.10,000 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని సీఎం వెల్లడించారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆయన తెలిపారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఈ విధంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
గత ప్రభుత్వంలో కొన్ని డిస్టిలరీలను ఒకే వర్గం ఆధీనంలోకి తీసుకుని, హోల్ సేల్, రవాణా, రిటైల్ దుకాణాలన్నీ ఒకే నెట్వర్క్ ద్వారా నియంత్రించబడినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. సరైన డిజిటల్ ట్రాకింగ్ లేకుండా లావాదేవీలు జరిగాయని అన్నారు. దీంతో నియంత్రణ లేకుండా వ్యవస్థ నడిచిందని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎక్సైజ్ వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టిందని సీఎం వివరించారు. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి, కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
ప్రజల ఆరోగ్యాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో కొంతమంది తయారు చేసిన “ఓన్ బ్రాండ్స్”కే ప్రాధాన్యం ఇచ్చారని, ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. కొత్త విధానంలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ హోలోగ్రామ్లు, క్యూఆర్ కోడ్లు, బ్యాచ్ స్థాయి తయారీ ట్రాకింగ్ వంటి సాంకేతిక పద్ధతులు అమలు చేస్తున్నామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు పంపారు.
మానవ ప్రాణ నష్టంపై కూడా సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. నాసిరకం మద్యం కారణంగా సుమారు 30 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు. కిడ్నీ, హృదయ, కాలేయ సంబంధిత వ్యాధులు పెరిగినట్లు తెలిపారు. ఎక్సైజ్ రంగంలో సంస్కరణలతో ప్రభుత్వ ఆదాయం పెరుగుతోందని, ప్రజా ఆరోగ్యం రక్షితమవుతోందని సీఎం పేర్కొన్నారు. కొత్త విధానం ద్వారా పారదర్శకత, నియంత్రణ, ప్రజల నమ్మకం పెరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ హయాంలో ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ నిర్వహించలేదని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వంలో యువత పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన పరిస్థితులు తలెత్తాయని, ఎవరికీ నైపుణ్యాలు కల్పించలేకపోయాని అన్నారు. 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి దానిపై ఓ కమిటీని కూడా నియమించామని చెప్పుకొచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే చిరునామా ఏపీ ఉండేదని, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు కేరాఫ్ అడ్రస్ అయ్యిందని హర్షించారు. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే పారిశ్రామిక ప్రోత్సాహకాలను కూడా రూ.210 కోట్లు విడుదల చేశామన్నారు.
ఇటీవల విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం తెలిపారు. వాటి ద్వారా 16 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఎంఎస్ఎంఈలో 2.48 లక్షల మందికి, స్కిల్ డెవలప్ మెట్ ద్వారా 1.46 లక్షల మందికి, పరిశ్రమల్లో 95 వేలు, ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా 64 వేల ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. మెగా డీఎస్సీ, పోలీసు కానిస్టేబుల్స్ కలుపుకుని ప్రభుత్వ ఉద్యోగాలు 30,500 ఇచ్చామన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













