Last Updated:
AP News: శాసనమండలిలో తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షం మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది. ఇరువైపుల వారు స్పీకర్ పోడియం వద్ద చుట్టుముట్టి కొట్టుకున్నంత పని చేశారు.
AP News: శాసనమండలిలో తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షం మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది. ఇరువైపుల వారు స్పీకర్ పోడియం వద్ద చుట్టుముట్టి కొట్టుకున్నంత పని చేశారు. అయితే ఈ చర్చలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర రచ్చకు దారి తీశాయి. లడ్డూ నెయ్యి కల్తీపై జరుగుతున్న చర్చలో జగన్ క్రిస్టియన్ అని, అందుకే ఇవేవీ ఆయనకు పట్టడం లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ క్రమంలో మండలి ఛైర్మన్ మోషేనురాజను కూడా మీరూ క్రిస్టియనే అనడంతో ఆయన ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో తన కులం గురించి మాట్లాడటం సరికాదని మండలి ఛైర్మన్ సీరియస్ అయ్యారు. తాను అసలు క్రిస్టియన్నే కాదని, హిందువునేనని అని క్లారిటీ ఇచ్చారు. తన గురించి ఒక మంత్రి ఇలా అనడం తన వ్యక్తిత్వాన్ని కించపరచడమే అని అన్నారు. తనను క్రిస్టియన్ అనుకుని సంభావించడాన్ని వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. దీంతో మండలిలో అందరి ముందు తాను హిందువునే అని ఛైర్మన్ మోషేనురాజు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఛైర్మన్ మోషేనురాజు హిందువు అని ఒప్పుకున్నారని, ఆయన హిందువేనన్న విషయం తనకు తెలియదని తెలిపారు. ఈ విషయంపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకు ఛైర్మన్ అంగీకరించారు.
అయితే ఇప్పటివరకూ అంతా బాగానే ఉంది. కానీ మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఛైర్మన్ మధ్యలో తలదూర్చుకున్న అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంపై తాను సంతృప్తిగానే ఉన్నట్లు చెప్పారు. అయినాసరే నినాదాలను కొనసాగించడంతో మండలిని ఐదు నిమిషాల పాటు వాయిదా వేశారు. మళ్లీ తిరిగి మండలి ప్రారంభం అయినా వైసీపీ సభ్యులు నినాదాలు మాత్రం అలాగే కొనసాగిస్తూ వచ్చారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
అంతకుముందు మతవిశ్వాసాలపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. వెంకన్న స్వామిపై జగన్కు నమ్మకం లేదని ఆరోపించారు. అయితే ఆ దేవుడిపై అంతగా ఎందుకు ఆయన పగపెట్టుకున్నారో వైసీపీ నేతలే చెప్పాలని అన్నారు. ఎవరి మత విశ్వాసాలు వారికి ఉంటాయని, ఈ విషయంలో తామెలాంటి అభ్యంతరం చెప్పమని తెలిపారు. కానీ ప్రభుత్వం తమ చేతిలో ఉందని తిరుమల లడ్డూను కల్తీ చేసి అపవిత్రం చేయడం ఏంటని విమర్శించారు. ఇలా లడ్డూ కల్తీ నెయ్యిపై చర్చ జరుగుతున్న తరుణంలో మరోవైపు మతాల గురించి చర్చ సాగుతోంది. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నాయకులు ఏంటీ పని జనాలు కసురుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana











