Last Updated:
Ashada Bonalu 2026: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక ఆషాఢ మాస బోనాల జాతర గురువారం అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది.
చరిత్రాత్మక గోల్కొండ కోటపై కొలువైన జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి అమ్మవారికి నిర్వహించే ప్రథమ పూజతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. రాష్ట్ర పండుగగా జరుపుకునే ఈ బోనాల ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించనుంది. గురువారం ఉదయం లంగర్హౌస్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలు ఈ వేడుకలను లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం ప్రభుత్వం తరపున జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు.
అక్కడి నుంచి పోతురాజుల వీరంగం, ఘటాల ఊరేగింపుతో కూడిన భవ్యమైన తొట్టెల ప్రదర్శన కోటపై ఉన్న మహంకాళి ఆలయానికి చేరుకుంటుంది. ఈ సందర్భంగా గోల్కొండ రిసాల బజార్ నుంచి సాంప్రదాయ ‘నజర్ బోనం’ ఊరేగింపును కూడా ఘనంగా నిర్వహించనున్నారు. అమ్మవారి దర్శనానికి మరియు బోనాలు సమర్పించడానికి వేలాది సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరియు ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. లంగర్హౌస్ చౌరస్తాలో ప్రారంభమయ్యే పూజా కార్యక్రమాల నుండి కోటపై తొట్టెల సమర్పణ పూర్తి అయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తును మోహరించినట్లు గోల్కొండ జోన్ డీసీపీ జె. రాఘవేందర్ రెడ్డి వెల్లడించారు.
భద్రతా చర్యల్లో భాగంగా అదనపు పోలీసు బలగాలతో పాటు టాస్క్ఫోర్స్, బాంబ్ స్క్వాడ్, ఆశ్విక దళాలు మరియు సీఆర్పీఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. బోనాల జాతరను విజయవంతం చేయడానికి భక్తులు, స్థానిక ప్రజలు పోలీసు సిబ్బందికి పూర్తి స్థాయిలో సహకరించాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు.
Hyderabad,Telangana














