స్టార్టప్లు, పరిశోధకులు, విశ్వవిద్యాలయాలు, పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ ప్రముఖులను ఒకచోట చేర్చే ‘భారత్ ఇన్నోవేట్స్’,.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, అంతరిక్ష సాంకేతికత, సుస్థిరత వంటి రంగాలలో భారత్, ఫ్రాన్స్ మధ్య కొత్త భాగస్వామ్యాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశానికి, తన డీప్-టెక్ సామర్థ్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించడానికి, పెట్టుబడులనూ, సహకారాన్నీ ఆకర్షించడానికి ఇది ఒక అవకాశం కూడా.
భారత్ ఇన్నోవేట్స్ 2026 అనేది ఫ్రాన్స్లోని నైస్లో జూన్ 14 నుంచి జూన్ 16 వరకు 3 రోజుల పాటు జరిగే ఒక ఆవిష్కరణల సదస్సు. ఈ కార్యక్రమం ‘ఇండియా-ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్’లో ఒక భాగం. భారతీయ ఆవిష్కర్తలను ప్రపంచ పెట్టుబడిదారులు, పారిశ్రామిక నాయకులు, విద్యా సంస్థలతో అనుసంధానించడమే దీని ముఖ్య ఉద్దేశం. 120కి పైగా భారతీయ డీప్-టెక్ స్టార్టప్లు, 15కు పైగా ప్రముఖ ఉన్నత విద్యా సంస్థలు ఇందులో పాల్గొంటాయని అంచనా. ఈ సదస్సు పరిశోధనా భాగస్వామ్యాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, పెట్టుబడి అవకాశాలు, వర్ధమాన సాంకేతికతలకు మార్కెట్ అవకాశాలు వంటి అంశాలపై దృష్టి సారిస్తుందని ఇండియా టుడే రిపోర్ట్ చేసింది.
ప్రధాని మోదీ దీనిని ఎందుకు ప్రారంభిస్తున్నారు?
మోదీ, మాక్రాన్ల సంయుక్త ప్రారంభోత్సవం, భారత్-ఫ్రాన్స్ సంబంధాలలో సాంకేతికత, ఆవిష్కరణల ప్రాముఖ్యం పెరుగుతోందనడానికి ఒక సంకేతం. గత కొన్ని సంవత్సరాలుగా, ఈ రెండు దేశాలూ రక్షణ, అంతరిక్షం నుంచి డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వివిధ రంగాలలో సహకారాన్ని విస్తరించుకున్నాయి. భారత్ ఇన్నోవేట్స్ 2026ను సంయుక్తంగా ప్రారంభించడం ద్వారా, రెండు దేశాల నాయకులూ.. ద్వైపాక్షిక సంబంధాలలో ఆవిష్కరణ (ఇన్నోవేషన్) ఒక కీలకమైన స్తంభంగా మారుతోందనే సందేశాన్ని పంపుతున్నారు.
ఈ కార్యక్రమం భారతీయ స్టార్టప్లకూ, పరిశోధకులకూ.. ప్రపంచ పెట్టుబడిదారులు, టెక్నాలజీ కంపెనీలు, పాలసీ రూపకర్తలను నేరుగా కలిసే అవకాశాన్ని కల్పిస్తుంది. దీని ద్వారా
అంతర్జాతీయ నిధుల కోసం అవకాశాలు లభిస్తాయి. యూరోపియన్ పరిశోధనా సంస్థలతో సహకారం లభిస్తుంది. భారత స్టార్టప్లు ప్రపంచ మార్కెట్లకు పరిచయం అవుతాయి. వర్ధమాన సాంకేతికతలలో భాగస్వామ్యాలు లభిస్తాయి. భారతీయ ఆవిష్కరణలకు అధిక గుర్తింపు లభిస్తుంది.
ఏ రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు?
ఈ కార్యక్రమంలో భవిష్యత్తుపై దృష్టి సారించిన కొన్ని రంగాలలోని ఆవిష్కరణలను ప్రదర్శిస్తారు, వాటిలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), సెమీకండక్టర్లు, అధునాతన కంప్యూటింగ్, అంతరిక్ష సాంకేతికత, రక్షణ ఆవిష్కరణలు, బయోటెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, వాతావరణ, సుస్థిరత పరిష్కారాలు, స్మార్ట్ మొబిలిటీ, తయారీ రంగం వంటివి ఉన్నాయి. ఐఐటీలు, ఇతర పరిశోధనా సంస్థలు సహా ప్రముఖ సంస్థలు కూడా తమ ప్రాజెక్టులు, సాంకేతికతలను ప్రదర్శిస్తాయని భావిస్తున్నారు.
భారత్-ఫ్రాన్స్ సంబంధాలకు ఇది ఎందుకు ముఖ్యం
భారత్ ఇన్నోవేట్స్ 2026 కేవలం ఒక స్టార్టప్ ప్రదర్శన మాత్రమే కాదు. ఆవిష్కరణ, పరిశోధన, సాంకేతికత ఆధారిత వృద్ధిలో సహకారాన్ని మరింతగా పెంపొందించడానికి భారతదేశం, ఫ్రాన్స్ చేస్తున్న విస్తృత ప్రయత్నంలో ఇది ఒక భాగం. కృత్రిమ మేధ (AI), సెమీకండక్టర్లు, అధునాతన తయారీ వంటి రంగాలలో దేశాలు అగ్రగామిగా నిలవడానికి పోటీ పడుతున్న తరుణంలో,.. ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, స్టార్టప్ల మధ్య భాగస్వామ్యాలు మరింత ముఖ్యమవుతున్నాయి. అలాంటి సంబంధాలు రూపుదిద్దుకోవడానికి భారత్ ఇన్నోవేట్స్ ఒక వేదికను అందిస్తుంది.
మోదీ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా భారత్ ఇన్నోవేట్స్ 2026ను ప్రారంభించడం ఒక ప్రధాన కార్యక్రమం. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ప్రపంచ నాయకులతో చర్చల్లో పాల్గొనడంతో పాటు, టెక్నాలజీ సంబంధిత కార్యక్రమాలకు కూడా హాజరు కానున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధికి స్టార్టప్లు, ఆవిష్కరణలు, వర్ధమాన సాంకేతికతలు కీలకంగా మారుతున్న తరుణంలో, భారత్ ఇన్నోవేట్స్ 2026 భారతదేశ ఆవిష్కరణల వ్యవస్థను అంతర్జాతీయ దృష్టికి తీసుకువస్తుందని భావిస్తున్నారు.












