Last Updated:
పుట్టిన బిడ్డ ఏడుపు ఎక్కడ బయటపడుతుందోననే భయంతో ముక్కు, నోరు మూసి ఊపిరి ఆడకుండా చేసి ప్రాణాలు తీసింది.
Hyderabad: నగరంలోని గోల్కొండ పరిధిలో గుండెల్ని పిండేసే అత్యంత దారుణమైన సంఘటన వెలుగుచూసింది. సమాజానికి, అవమానానికి భయపడి ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని తను జన్మనిచ్చిన పసికందును చేజేతులా చంపేసింది. పుట్టిన బిడ్డ ఏడుపు ఎక్కడ బయటపడుతుందోననే భయంతో ముక్కు, నోరు మూసి ఊపిరి ఆడకుండా చేసి ప్రాణాలు తీసింది. అనంతరం ఆ మృతదేహాన్ని హాస్టల్ బిల్డింగ్ పైనుంచి విసిరేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
పోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని జగద్గిరిగుట్టకు చెందిన 18 ఏళ్ల యువతి గోల్కొండలోని ఒక మైనారిటీ వసతిగృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. లారీ డ్రైవర్గా పనిచేసే తన మేనబావతో గత మూడేళ్లుగా ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే శారీరకంగా దగ్గరైన సదరు విద్యార్థిని గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఆమె తన మేనబావకు తెలపగా.. బొప్పాయి పండు తింటే గర్భస్రావం (అబార్షన్) అవుతుందని అతను సలహా ఇచ్చాడు. ఆమె అలాగే చేసినప్పటికీ గర్భం పోలేదు. కాగా, సదరు వసతిగృహంలో విద్యార్థినులకు రెగ్యులర్గా వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన ‘మెడికల్ అసిస్టెంట్’ పోస్టు ఖాళీగా ఉండటంతో, ఆమె గర్భవతి అనే విషయం హాస్టల్ సిబ్బందికి గానీ, ఇతరులకు గానీ ఎవరికీ తెలియకుండా గుట్టుగా ఉండిపోయింది.
సోమవారం వేకువజామున సదరు విద్యార్థినికి అకస్మాత్తుగా ప్రసవ నొప్పులు ప్రారంభమయ్యాయి. నొప్పులు తీవ్రం కావడంతో ఆమె వసతిగృహంలోని బాత్రూమ్లోకి వెళ్లింది. అక్కడే ఆమె ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే, పుట్టిన బిడ్డ గట్టిగా ఏడిస్తే ఎక్కడ హాస్టల్లో అందరికీ తెలిసిపోతుందోననే తీవ్ర భయాందోళనకు గురైన ఆ యువతి.. ఏమాత్రం మానవత్వం లేకుండా పసికందు ముక్కు, నోరు గట్టిగా మూసేసింది. దీంతో ఊపిరాడక ఆ నవజాత శిశువు బాత్రూమ్లోనే ప్రాణాలు విడిచాడు.
బిడ్డ చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత, ఆ విద్యార్థిని మృతదేహాన్ని వసతిగృహం మూడో అంతస్తు నుంచి పక్కనే ఉన్న ఈఎస్ఐ డిస్పెన్సరీ (ఆసుపత్రి) ఆవరణలోకి విసిరివేసింది. మంగళవారం ఉదయం డిస్పెన్సరీ ఆవరణలో పడి ఉన్న పసికందు మృతదేహాన్ని గమనించిన వసతిగృహం ప్రిన్సిపల్ వెంటనే గోల్కొండ పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనపై సమాచారం అందుకున్న ఆసిఫ్నగర్ ఏసీపీ నయీమ్పాషా, గోల్కొండ ఇన్స్పెక్టర్ సైదులు తమ సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నవజాత శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం వసతిగృహంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. తనిఖీల్లో భాగంగా హాస్టల్ మూడో అంతస్తు గోడలపై రక్తపు మరకలను, అలాగే బాత్రూమ్లో మాయ (ప్లాసెంటా), రక్తపు చారికలను పోలీసులు గుర్తించారు.
దీనిపై సదరు విద్యార్థినిని అదుపులోకి తీసుకుని గట్టిగా ప్రశ్నించడంతో ఆమె చేసిన దారుణాన్ని అంగీకరించింది. ప్రస్తుతం ప్రసవం వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన ఆ విద్యార్థినిని పోలీసులు చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. యువతి గర్భానికి కారణమైన, అబార్షన్ చేసుకోమని తప్పుడు సలహాలు ఇచ్చిన మేనబావపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Hyderabad,Telangana













