Last Updated:
ఇండోనేషియాలోని మదురా దీవికి సమీపంలో సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ ఫెర్రీ (షిప్)లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 41 మంది ఆచూకీ గల్లంతైంది. రెస్క్యూ టీమ్లు 225 మందిని సురక్షితంగా రక్షించాయి.
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం మదురా దీవికి సమీపంలో సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ ఫెర్రీ (ఓడ)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. ఈ భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మరణించగా.. మరో 41 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో ‘ముటియారా సెంటోసా 2’ అనే పేరుగల ఈ ఫెర్రీలో ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 271 మంది ఉన్నారని ఇండోనేషియా నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ అధికారులు అధికారికంగా ఒక ప్రకటనలో వెల్లడించారు. మంటలు వ్యాపించిన వెంటనే ప్రయాణికులలో హాహాకారాలు చెలరేగాయి, కొందరు ప్రాణభయంతో సముద్రంలోకి దూకేశారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఆదివారం మధ్యాహ్నం వరకు అందిన సమాచారం ప్రకారం 225 మంది ప్రయాణికులను సురక్షితంగా రక్షించినట్లు సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ప్రకటించింది. తూర్పు జావా ప్రావిన్స్లోని సురబయా నగరం నుంచి దక్షిణ సులవేసిలోని మకాస్సార్ నగరానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ఘటన జరిగింది.
మదురా దీవికి కొద్ది దూరంలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని ఫెర్రీ కెప్టెన్ అధికారులకు సమాచారం అందించాడు. అయితే ఈ అగ్నిప్రమాదానికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం గల్లంతైన 41 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సముద్రంలో అనేక నావలు గాలింపు ఆపరేషన్లో పాల్గొన్నట్లు స్థానిక మీడియా నివేదించింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














