Last Updated:
IRCTC Tourism | ఐఆర్సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి అనేక టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ పాపులర్ టూర్ ప్యాకేజీలో మరో 60 బెర్తుల్ని కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి సాగే ఈ ఆధ్యాత్మిక యాత్ర గురించి తెలుసుకోండి.
ఐఆర్సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి మాతా వైష్ణోదేవి విత్ హరిద్వార్-రిషికేష్ యాత్ర టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టూర్ ప్యాకేజీ ద్వారా 702 బెర్తుల్ని కేటాయించింది. అందులో స్లీపర్ 160, థర్డ్ ఏసీ 490, సెకండ్ ఏసీ 52 బెర్తులు ఉన్నాయి. అయితే ప్రజల నుండి భారీ స్పందన, బుకింగ్ డిమాండ్ కారణంగా అదనంగా ఒక స్లీపర్ క్లాస్ కోచ్ ఏర్పాటు చేసినట్టు ఐఆర్సీటీసీ టూరిజం తాజాగా ప్రకటించింది. దీంతో స్లీపర్ క్లాస్లో మరో 60 బెర్తులు అందుబాటులోకి వచ్చాయి. స్లీపర్ క్లాస్ సీట్లు ఇప్పుడు బుకింగ్కు అందుబాటులో ఉన్నాయని, వాటిని ప్రయాణికులు బుక్ చేసుకోవాలని ఐఆర్సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్ కోరుతోంది. ఈ యాత్ర మే 12న హైదరాబాద్లో ప్రారంభం అవుతుంది. మొత్తం 9 రాత్రులు, 10 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర ఒకరికి రూ.16,500. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న యాత్రికులు మథుర, వృందావన్, మాత వైష్ణోదేవి, హరిద్వార్, ఋషికేశ్ సందర్శించవచ్చు.
ఐఆర్సీటీసీ టూరిజం మాతా వైష్ణోదేవి విత్ హరిద్వార్-రిషికేష్ యాత్ర ఎలా సాగుతుందో చూస్తే మొదటి రోజు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్లో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు బయల్దేరుతుంది. దారిలో యాత్రికులు భువనగిరి, జనగాం, కాజీపేట్, పెద్దపల్లి జంక్షన్, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్, బల్లార్షా, వార్ధా, నాగ్పూర్ స్టేషన్లలో టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు. రెండో రోజంతా ప్రయాణమే ఉంటుంది. మూడో రోజు ఉదయం 6 గంటలకు మథుర చేరుకుంటారు. హోటల్లో చెకిన్ అయిన తర్వాత కృష్ణ జన్మభూమి ఆలయం చూస్తారు. రాత్రికి మథురలో బస చేయాలి. నాలుగో రోజు వృందావన్కి బయల్దేరతారు. అక్కడ బాంకే బిహారీ దేవాలయం, ప్రేమ్ మందిర్ చూడొచ్చు. ఆ తర్వాత శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా బయల్దేరాలి.
ఐదో రోజు శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా లేదా జమ్మూ తావి రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. చెక్-ఇన్ తర్వాత మాతా వైష్ణో దేవి దర్శన రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. వైష్ణో దేవి యాత్రను కాలినడకన, గుర్రంపై, డోలీలో సొంత ఖర్చుతో చేయాల్సి ఉంటుంది. కాట్రా-వైష్ణోదేవి-కాట్రా ట్రెక్ ద్వారా సుమారు 26 కిలోమీటర్లు ప్రయాణించాలన్న విషయం గుర్తుంచుకోవాలి. దర్శన టిక్కెట్, హెలికాప్టర్, బ్యాటరీ కారును https://online.maavaishnodevi.org/ ఈ లింక్ ద్వారా స్వయంగా బుక్ చేసుకోవాలి. ఆరో రోజు శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా నుంచి హరిద్వార్ బయల్దేరాలి. ఏడో రోజు ఉదయం హరిద్వార్ చేరుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత మానస దేవి ఆలయ దర్శనం ఉంటుంది. సాయంత్రం గంగా హారతి చూడొచ్చు. రాత్రికి హరిద్వార్లో బస చేయాలి. ఎనిమిదో రోజు ఉదయం గంగా స్నానం తర్వాత రిషికేష్ బయల్దేరాలి. రామ్ ఝూలా లక్ష్మణ్ ఝూలా సందర్శన ఉంటుంది. ఆ తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. తొమ్మిదో రోజంతా ప్రయాణం ఉంటుంది. పదో రోజు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
ఇక ఈ ప్యాకేజీ ధరలు చూస్తే ఒకరికి స్లీపర్ క్లాస్కు రూ.16,500, థర్డ్ ఏసీకి రూ.25,700, సెకండ్ ఏసీకి రూ.33,400 చెల్లించాలి. ‘భారత్ గౌరవ్ రైలు’ పథకం కింద రైలు పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు, భారతీయ రైల్వేలు సుమారు 33% రాయితీని అందిస్తున్నాయి. పైన ఇచ్చిన ధరలు రాయితీ తర్వాతే అని గుర్తుంచుకోవాలి. టూర్ ప్యాకేజీలో రైలు ప్రయాణం, హోటల్లో బస, సైట్ సీయింగ్, మార్నింగ్ టీ, మూడు పూటలా శాకాహార భోజనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana











