Last Updated:
Jeevan Reddy: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “రెండేళ్ల పాలనలోనే సీఎం రేవంత్ రెడ్డి వెళ్లాలి.. మార్పు రావాలి” అనే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గతంలో కూడా కేసీఆర్ వెళ్లిపోవాలి, మార్పు రావాలనే ఆశతోనే ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారని గుర్తు చేశారు. అయితే ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని పేర్కొన్నారు.
Jeevan Reddy: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “రెండేళ్ల పాలనలోనే సీఎం రేవంత్ రెడ్డి పోవాలి.. మార్పు రావాలి” అనే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గతంలో కూడా కేసీఆర్ వెళ్లిపోవాలి, మార్పు రావాలనే ఆశతోనే ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారని గుర్తు చేశారు. అయితే ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని పేర్కొన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శుక్రవారం జగిత్యాలలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీలో తన ప్రాభవాన్ని తగ్గించేందుకు ఉద్దేశపూర్వకంగానే నామినేటెడ్ పదవులు ఇచ్చి ఆలస్యం చేశారని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్పై వస్తున్న విమర్శలు ఎక్కువగా రాజకీయ కోణంలోనే ఉన్నాయని, కానీ అసలు సమస్య పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యమేనని జీవన్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి సీ.ఆర్. పాటిల్ వ్యాఖ్యలను ఖండిస్తూ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు మొత్తం ప్రాజెక్ట్లో చిన్న భాగమేనని చెప్పారు. ఈ మూడు బ్యారేజీల పునరుద్ధరణకు సుమారు రూ.500 కోట్లలోపే ఖర్చవుతుందన్నారు. అయినా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక వచ్చినప్పటికీ దాన్ని అమలు చేయలేదని గుర్తుచేశారు. ప్రాణహిత నది జలాల వినియోగంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కనీసం సరైన డిజైన్ కూడా సిద్ధం చేయలేదని విమర్శలు చేశారు.
ఇందుకు బడ్జెట్లో కేవలం రూ.152 కోట్లు మాత్రమే కేటాయించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని జీవన్ రెడ్డి విమర్శించారు. కడెం, ఎస్ఆర్ఎస్పీ ద్వారా 100 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ దానిపై దృష్టి పెట్టడం లేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు జీవనాధారమని స్పష్టం చేశారు. హైదరాబాద్ తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, మూసి శుద్ధీకరణ అన్నీ దీనిపైనే ఆధారపడుతున్నాయని వివరించారు. మేడిగడ్డ పునరుద్ధరణ జరగకపోతే సుమారు 18 లక్షల ఎకరాల సాగుభూమి.. హైదరాబాద్ అవసరాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని హెచ్చరించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని అన్నారు. వెంటనే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల పునరుద్ధరణ చేపట్టాలని లేకపోతే ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు క్షమించరని హెచ్చరించారు.
ప్రజాసేవ కోసం ఏదో ఒక పార్టీలో ఉండాల్సిన అవసరం ఉందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తన భవిష్యత్ రాజకీయ నిర్ణయాలను అభిమానులు, అనుచరుల అభిప్రాయాల మేరకు తీసుకుంటానని చెప్పారు. తనపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు చూపుతున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే రెండు వారాల్లో తాను ఏ పార్టీలో చేరతానో మీడియా ద్వారా ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్పై విమర్శలు చేసిన జీవన్ రెడ్డి, ఇప్పుడు సీ.ఆర్. పాటిల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం ఆయన బీఆర్ఎస్ వైపు వెళ్లే సూచనలుగా కనిపిస్తున్నాయి. అయితే ఈనెల 13వ తేదీన ఆయన పార్టీ మారతారనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
Hyderabad,Telangana













