Last Updated:
Karnataka: కర్ణాటకలో ఓ కిడ్నాప్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. కదులుతున్న క్యాబ్ నుండి ఓ యువతి ప్రాణాలతో తప్పించుకున్న కొద్ది క్షణాల్లోనే, ఆ కారులో భారీ పేలుడు సంభవించింది.
ఈ ప్రమాదంలో కిడ్నాప్నకు పాల్పడిన వ్యక్తి హైవేపైనే కారులో సజీవ దహనమయ్యాడు. తుమకూరు జిల్లాలో జరిగిన ఈ హైడ్రామాకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరులో ఆపరేషన్ థియేటర్ (OT) టెక్నీషియన్గా పనిచేస్తున్న ఓ యువతిని, నాగేంద్ర అనే వ్యక్తి శనివారం ఉదయం ఆమె నివసిస్తున్న జయనగర్లోని అద్దె ఇల్లా వద్ద బెదిరించి బలవంతంగా కిడ్నాప్ చేశాడు. గతంలో వీరిద్దరి మధ్య పరిచయం ఉండేదని, అయితే ఇటీవలే మనస్పర్థల కారణంగా విడిపోయారని దర్యాప్తులో తేలింది. వ్యక్తిగత విభేదాల వల్ల ఆ యువతి నాగేంద్ర ఫోన్ నంబర్ను కూడా బ్లాక్ చేసింది.
ఈ క్రమంలో శనివారం ఉదయం నాగేంద్ర ఆమెతో గొడవ పడి, బలవంతంగా ఒక ఉబెర్ (Uber) క్యాబ్లోకి నెట్టి అంకోలా వైపు తీసుకెళ్లాడు. యువతి కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు జయనగర్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ ఫిర్యాదు చేశారు.
ప్రయాణం మధ్యలో నాగేంద్ర ఆ యువతిని తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేశాడు. నిన్ను చంపేసి నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అంతేకాదు, తన వద్ద ఉన్న ఒక పేలుడు పదార్థాన్ని (బాంబు లాంటి పరికరాన్ని) ఆమెకు చూపించి భయపెట్టాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ క్రమంలో జోగిహళ్లి సమీపానికి రాగానే, కదులుతున్న కారులోనే నాగేంద్ర సదరు యువతిపై అకస్మాత్తుగా కత్తితో దాడికి తెగబడ్డాడు. దీన్ని గమనించిన క్యాబ్ డ్రైవర్ అప్రమత్తమై వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశాడు. ఇదే అదనుగా భావించిన యువతి, కారు డోర్ లాక్ తెరిచి ప్రాణభయంతో బయటకు దూకేసింది. ఆమెతో పాటు డ్రైవర్ కూడా కారు నుండి కిందకు దిగాడు.
BREAKUP. KIDNAP. KNIFE ATTACK. CRUDE BOMB BLAST.
Police say a man allegedly abducted his former partner, stabbed her inside an Uber & was killed when the crude bomb he was carrying exploded on Tumakuru highway. Girl warned the driver he was carrying a crude bomb. They escaped. pic.twitter.com/JZQg2W24qb— Harish Upadhya (@harishupadhya) June 27, 2026
యువతి కారులోంచి బయటపడ్డ కొద్ది క్షణాల్లోనే, ఆ వాహనంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. కారు లోపలే చిక్కుకుపోయిన నాగేంద్ర, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకునే లోపే మంటల్లో కాలి బూడిదయ్యాడు. ఈ పేలుడు తీవ్రతకు జాతీయ రహదారిపై దాదాపు ఒక కిలోమీటరు మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
“ప్రాథమిక దర్యాప్తు ప్రకారం నాగేంద్ర తన వెంట ఒక పేలుడు పదార్థాన్ని తెచ్చుకున్నాడని, అతడే కావాలని ఆ బాంబును పేల్చి ఉండవచ్చని భావిస్తున్నాం. కాలిపోయిన వాహనం నుండి పేలుడు పదార్థాల అవశేషాలను స్వాధీనం చేసుకున్నాం. ఆ డివైజ్ ఎలాంటిది? దాన్ని ఎక్కడి నుండి తెచ్చాడు? ఎలా పేలింది? అనే కోణంలో లోతైన విచారణ జరుపుతున్నాం” అని తుమకూరు ఎస్పీ అశోక్ కేవీ తెలిపారు.
ప్రస్తుతం కల్లంబెల్లా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, కిడ్నాప్ నుండి పేలుడు వరకు జరిగిన పూర్తి ఉదంతంపై దర్యాప్తును ముమ్మరం చేశారు. గాయపడిన యువతి, క్యాబ్ డ్రైవర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













