Last Updated:
రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వ మార్పు లేదా అధికార పంపిణీ అంశంపై చర్చలు జరగలేదని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ హై-స్టేక్స్ సమావేశంలో చర్చలన్నీ కేవలం త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల వ్యూహాలు మరియు అభ్యర్థుల ఎంపికపైనే కేంద్రీకృతమయ్యాయని హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది.
Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మార్పుపై గత కొన్ని రోజులుగా సాగుతున్న రాజకీయ ఊహాగానాలకు కాంగ్రెస్ హైకమాండ్ తెరదించింది. దేశ రాజధాని ఢిల్లీలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ (DKS) లతో పార్టీ అగ్రనాయకత్వం సుదీర్ఘంగా నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం అధిష్టానం కీలక ప్రకటన చేసింది.
6 గంటలపాటు సాగిన సమావేశం ముగిసిన అనంతరం, కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్.. సిద్ధరామయ్య, డి.కె. శివకుమార్ల సమక్షంలోనే మీడియాతో మాట్లాడారు. ఈ భేటీలో కేవలం జూన్ 18న జరగబోయే రాజ్యసభ ఎన్నికలపై మాత్రమే చర్చలు జరిగాయని ఆయన స్పష్టం చేశారు.
కేసీ వేణుగోపాల్ విలేకరులతో మాట్లాడుతూ.. “మేము కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో కలిసి సుదీర్ఘంగా సమావేశమయ్యాము. ఈ చర్చల్లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మరియు నేను కూడా పాల్గొన్నాము. మా చర్చలన్నీ పూర్తిగా కర్ణాటకలో త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలు, అలాగే శాసనమండలి (MLC) ఎన్నికల వ్యూహాలపైనే కేంద్రీకృతమయ్యాయి. నాయకత్వ మార్పు గురించి మీ (మీడియా) వాళ్లు చేసుకుంటున్న ప్రచారమంతా కేవలం ఊహాగానాలు మాత్రమే. అందులో ఎంతమాత్రం వాస్తవం లేదు” అని తేల్చి చెప్పారు. ఈ ప్రకటనతో కర్ణాటక కాంగ్రెస్లో నెలకొన్న రాజకీయ సస్పెన్స్కు ప్రస్తుతానికి తెరపడినట్లయింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













