Last Updated:
ఐపీఎల్ రూపశిల్పి లలిత్ మోదీ దావుద్ ఇబ్రహీంపై సంచలన కామెంట్స్ చేశారు. తనను చాలాసార్లు చంపాలనుకున్నాడని.. తన కొడుకును కిడ్నాప్ చేశాడంటూ కామెంట్స్ చేశాడు.
Lalit Modi: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాజీ కమిషనర్ లలిత్ మోదీ దశాబ్ద కాలం తర్వాత సరికొత్త సంచలన నిజాలను వెల్లడించారు. అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని నేరపూరిత నెట్వర్క్ (D-Company) నుండి వచ్చిన ప్రాణభీతి వల్లే తాను క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ నుండి శాశ్వతంగా తప్పుకోవాల్సి వచ్చిందని ఆయన మొదటిసారి బహిరంగంగా ప్రకటించారు.
ప్రముఖ వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ (ANI) కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో లలిత్ మోదీ మాట్లాడుతూ.. ఐపీఎల్ ప్రారంభ సంవత్సరాల్లో మ్యాచ్ ఫిక్సింగ్కు వ్యతిరేకంగా తాను తీసుకున్న కఠినమైన నిర్ణయాలు, దావూద్ ఇబ్రహీం నియంత్రణలో ఉన్న భారీ అండర్గ్రౌండ్ బెట్టింగ్ మాఫియాతో నేరుగా ఘర్షణకు దారితీశాయని పేర్కొన్నారు.
ఐపీఎల్లో ప్రతి బంతికి బెట్టింగ్ రేట్లు మారేలా ఈ మాఫియా సామ్రాజ్యం ఒక విస్తృతమైన ‘సట్టా బజార్’ను నడుపుతోందని లలిత్ మోదీ తెలిపారు. “దావూద్ ఇబ్రహీం ఒక గుర్తింపు పొందిన బుక్మేకర్. ఆ రోజుల్లో అండర్గ్రౌండ్ బెట్టింగ్ విలువ ప్రతి మ్యాచ్కు 2 బిలియన్ డాలర్లు (సుమారు ₹16,000 కోట్లు) ఉంటే, నేడది మ్యాచ్కు 4 బిలియన్ డాలర్లకు (సుమారు ₹33,000 కోట్లు) చేరింది. ఇది ఊహకందని భారీ నెట్వర్క్. ఇప్పుడు ఎవరూ మ్యాచ్లను ఫిక్స్ చేయడం లేదు.. కేవలం ఓవర్లను, బంతిని (స్పాట్ ఫిక్సింగ్) మాత్రమే ఫిక్స్ చేస్తున్నారు” అని లలిత్ మోదీ సంచలన విషయాలను బయటపెట్టారు.
#WATCH | On being asked if he retired from cricket because of Dawood Ibrahim, IPL founder and first chairman Lalit Modi says, “It is one of the biggest reasons.”
He says, “He took three hits at me… Dawood himself said this… He missed three times… The reason was that I… pic.twitter.com/HKYlhdL2o6
— ANI (@ANI) June 4, 2026
మైదానంలో ఉండే ఆటగాళ్లు రుమాలు బయటకు తీయడం, లేదా ఒక వైపుగా రుద్దడం వంటి రహస్య సంకేతాల (Signals) ద్వారా ఈ స్పాట్ ఫిక్సింగ్ నడుస్తుందని, తాను ఈ సంకేతాలను నిశితంగా గమనిస్తూ మాఫియాకు సహకరించకపోవడంతో వారి ప్రధాన టార్గెట్గా మారానని ఆయన చెప్పారు. “నేను ఐపీఎల్ నడిపిన మొదటి మూడేళ్లలో ఎలాంటి ఫిక్సింగ్ జరగలేదు. చాలా మందిని స్టేడియంల నుండి వెళ్లగొట్టాను, కొందరిపై నిషేధం విధించాను. ఇది మాఫియాకు నచ్చలేదు. నన్ను వేరే వైపు చూస్తూ ఊరుకోవాలని (సహకరించాలని) వారు వందల మిలియన్ డాలర్ల ఆఫర్ ఇచ్చారు” అని మోదీ పేర్కొన్నారు.
2012 నాటి ఒక భీకర సంఘటనను గుర్తు చేసుకుంటూ.. లండన్కు చెందిన ఒక ఫిక్సర్ అర్ధరాత్రి 3:30 గంటల సమయంలో ‘బాబా’ అనే ఒక ప్రముఖ మధ్యవర్తి పెంట్హౌస్కు తనను పిలిపించాడని లలిత్ మోదీ వెల్లడించారు. “నేను అక్కడికి వెళ్ళినప్పుడు, వారు మాఫియా కోసం ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీని (టీమ్) దక్కించుకోవడానికి నా సహాయం కోరారు. నేను ఇండియాలో లేనని, అక్కడ దావూద్ సమస్య ఉందని చెప్పగా.. ‘నేను ఒక్క నిమిషంలో దాన్ని సెట్ చేస్తా’ అని బాబా అన్నాడు” అని లలిత్ చెప్పారు.
ఆ తర్వాత సదరు మధ్యవర్తి పెంట్హౌస్ టెర్రస్ పైకి వెళ్లి, నేరుగా సాటిలైట్ ఫోన్ ద్వారా దావూద్ ఇబ్రహీంకు ఫోన్ చేశాడని మోదీ తెలిపారు. “ఫోన్ ఎత్తి.. ‘దావూద్ భాయ్, లలిత్ భాయ్ వచ్చారు, మాట్లాడండి’ అని బాబా అన్నాడు. నేను మాట్లాడనని చెప్పడంతో కాల్ను స్పీకర్లో పెట్టాడు. అప్పుడు దావూద్ కేవలం.. ‘నువ్వు అతని స్నేహితుడివి, అంతా మర్చిపో, అంతా అయిపోయింది’ అని అన్నాడు” అని లలిత్ మోదీ సంచలన విషయాన్ని బయటపెట్టారు.
మాఫియా ఆఫర్లను తిరస్కరించినందుకు దావూద్ ఇబ్రహీం ఆదేశాల మేరకు తనపై మూడు సార్లు హత్యాయత్నాలు జరిగాయని, వాటి నుండి తాను తృటిలో తప్పించుకున్నానని లలిత్ మోదీ తెలిపారు. “ముంబై పోలీసులు నా అభ్యర్థన లేకుండానే నాకు ‘జెడ్ కేటగిరీ’ (Z-Security) భద్రత కల్పించారు. ముంబైలో నా ఇంటి వెలుపల కాల్పులు జరిగాయి. జోహన్నెస్బర్గ్లో నన్ను చంపడానికి ప్లాన్ చేయగా సౌతాఫ్రికా ప్రభుత్వం అలర్ట్ చేసింది. మాంటినెగ్రోలోనూ నాపై దాడికి స్కెచ్ వేశారు. అంతటితో ఆగకుండా, లండన్లోని స్లోన్ స్ట్రీట్లో ‘బాబా అవినాష్’ అనే వ్యక్తి నా కొడుకును కిడ్నాప్ చేశాడు” అని లలిత్ మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.
చివరికి, డీ-కంపెనీకి చెందిన కీలక నేత ఛోటా షకీల్ ఒక లైవ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మోదీతో ఉన్న విభేదాలన్నీ ముగిసిపోయాయని ప్రకటించిన తర్వాతే ఈ సుదీర్ఘ ఉద్రిక్తత కాస్త సల్లాబడిందని లలిత్ మోదీ ఈ ఇంటర్వ్యూలో ముగించారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana











