Last Updated:
భారత్తో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో బలమైందని, పాకిస్తాన్తో జరిపే సాధారణ చర్చల వల్ల దిల్లీతో ఉన్న కూటమికి ఎలాంటి నష్టం వాటిల్లదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనలో భాగంగా ఆదివారం న్యూఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్తో కలిసి ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత్తో అమెరికాకు ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో ప్రత్యేకమైందని స్పష్టం చేశారు. ప్రపంచంలోని ఏ ఇతర దేశంతో వాషింగ్టన్ జరిపే సంప్రదింపులైనా, దిల్లీతో ఉన్న బలమైన కూటమిని దెబ్బతీయలేవని రూబియో నొక్కిచెప్పారు. ఉగ్రవాద సంస్థలకు సైనిక మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు, పాక్-అమెరికా సంబంధాలపై ఒక పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. బాధ్యతాయుతమైన దేశాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలతో ప్రాథమిక స్థాయి సంబంధాలు కొనసాగిస్తాయని, భారత్ కూడా అలాగే చేస్తుందని గుర్తుచేశారు. సైనిక విషయాలపై నేరుగా మాట్లాడటానికి నిరాకరిస్తూ, ఆ సుదీర్ఘ ప్రశ్నలో తనకు సమ్మతం కాని అంశాలు చాలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఎక్కడా వేగాన్ని కోల్పోలేదని మార్కో రూబియో స్పష్టం చేశారు. రాబోయే సంవత్సరాల్లో ఈ బంధం సరికొత్త పుంతలు తొక్కడమే కాకుండా మరింత పటిష్టం కానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఒక కొలిక్కి వస్తుందని వాషింగ్టన్ ఆశిస్తున్నట్లు తెలిపారు. దాదాపు అన్ని రకాల అంతర్జాతీయ సవాళ్లపై భారత్, అమెరికాలు ఒకే వ్యూహాత్మక ఆలోచనతో, ఒకే తాటిపై ముందుకు సాగుతున్నాయని ఆయన వివరించారు. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలు, ఒకే రకమైన లక్ష్యాలు ఈ బంధాన్ని నడిపిస్తున్నాయని వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద నెట్వర్క్ల వల్ల భారత్, అమెరికా దేశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో నష్టపోయాయని రూబియో గుర్తుచేశారు. ఉగ్రవాదాన్ని సమూలంగా అంతమొందించే విషయంలో ఇరు దేశాల మధ్య బలమైన అవగాహన, రక్షణ వ్యూహాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా ఇండో-పాసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుతమైన, నిరంతరాయమైన నౌకాయానం, అంతర్జాతీయ విమానయాన రాకపోకలు సాగడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని వివరించారు.
21వ శతాబ్దంలో సరికొత్తగా పుట్టుకొస్తున్న సాంకేతిక రంగాలు, అంతర్జాతీయ వాణిజ్య మార్గాలలో ఎదురయ్యే ముప్పులను కలిసికట్టుగా ఎదుర్కొంటామని ప్రకటించారు. పశ్చిమ ఆసియా, భారత ఉపఖండం, తూర్పు ఆసియా ప్రాంతాల్లోని తాజా పరిస్థితులపై ఇరుపక్షాలు చర్చించాయి.
శనివారం రాత్రి న్యూఢిల్లీ చేరుకున్న రూబియో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ఎంతో కాలంగా సాగుతున్న సివిల్ అణు సహకారం, ఇంధన భాగస్వామ్య పురోగతిపై జైశంకర్తో కలిసి సుదీర్ఘంగా సమీక్షించారు. గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్ల తయారీ రంగంలో పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన భాగస్వామ్యాలలో భారత్-అమెరికా బంధం ఒకటని, దీనిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని రూబియో అభివర్ణించారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













