Last Updated:
ఆలూరు రాజకీయ ఉద్రిక్తత కేసులో వైసీపీ ఎమ్మెల్యే బి. విరూపాక్షి అరెస్ట్ కలకలం రేపింది. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా, అధికార–ప్రతిపక్షాల మధ్య విమర్శలు మరింత ముదిరాయి.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బి. విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్తో పాటు పలువురు అనుచరులను పోలీసులు అర్ధరాత్రి వేళ అదుపులోకి తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. న్యాయస్థానంలో హాజరుపరచగా ఆలూరు జూనియర్ సివిల్ కోర్టు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది.
పోలీసుల వివరాల ప్రకారం కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త గురునాథ్, వైకాపా కార్యకర్త గిరి శనివారం ఫోన్లో మాట్లాడుకునే క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో గిరి ఇంటికి గురునాథ్తో పాటు తెదేపాకే చెందిన సుధాకర్, చంద్రశేఖర్, నేమకల్లు గ్రామానికి చెందిన నాగరాజు, శివ వెళ్లారు. అక్కడ తోపులాట జరగడంతో గ్రామస్థులు నచ్చజెప్పి పంపేశారు.
తదనంతరం తనను తెదేపా కార్యకర్త దూషించాడని ఎమ్మెల్యే విరూపాక్షికి గిరి ఫిర్యాదు చేశాడు. దీంతో విరూపాక్షి తన కుమారుడు చంద్రశేఖర్, సోదరుడు శ్రీరాములు, ఆయన కుమారుడు మధు తదితరులు సుమారు 50 మందితో కలిసి కర్రలు, రాళ్లు, రాడ్లతో వాహనాల్లో మొదట సంగాల వెళ్లారు. అక్కడ తెదేపా కార్యకర్త చంద్రశేఖర్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
ఆ తర్వాత వారంతా నేమకల్లు వెళ్లగా, అక్కడ రాళ్లు రువ్వుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములు కింద పడిపోవడంతో అతని చేయి విరిగింది. దీనికి తెదేపాకు చెందిన నాగరాజు కారణమని భావించిన ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులు అతని ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన భార్య సుచిత్రతో అభ్యంతరకరంగా ప్రవర్తించి, ఆమె దుస్తులను చించివేసి, ఇంట్లోకి దూసుకెళ్లి టీవీ, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. అంతేకాకుండా, నాగరాజును చంపేస్తామని హెచ్చరించారు. నాగరాజు బయటకు వచ్చి అడ్డుకునే యత్నం చేయగా ఆయనపైనా దాడికి దిగగా, కుటుంబసభ్యులు ప్రతిఘటించడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే విరూపాక్షి దాడికి వెళ్లబోతున్నారని ఆలూరు సీఐ రవిశంకర్ రెడ్డి ముందే వారించినా వినలేదని తెలిసింది.
ఎమ్మెల్యే వర్గం దళిత కుటుంబంపై దౌర్జన్యానికి పాల్పడటమే కాకుండా, అడ్డుకోబోయిన మహిళపై దాడి చేసి, తెదేపా మండల కన్వీనర్ పురుషోత్తం కారును, ఇతర వాహనాలను ధ్వంసం చేసినట్లు కేసులు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో చిప్పగిరిలోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని పోలీసు బలగాలు విరూపాక్షిని, ఆయన కుమారుడిని అర్ధరాత్రి అరెస్ట్ చేశాయి.
ఈ అరెస్టును వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కార్యకర్త సాయం కోరితే పరామర్శకు వెళ్లిన ప్రజాప్రతినిధి నివాసంలో అర్ధరాత్రి సీసీటీవీ హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేయడం కక్షసాధింపు చర్య అని మండిపడ్డారు.
చట్టానికి ఎవరూ అతీతులు కారని, దళిత కుటుంబంపై దాడి చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకే చట్టప్రకారమే చర్యలు తీసుకున్నామని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. ముందు జాగ్రత్త చర్యగా నియోజకవర్గంలో భారీగా పోలీసులను మోహరించారు.
Hyderabad,Telangana
Aug 03, 2026 10:47 AM IST














