Last Updated:
రీసెంట్ గా విజయ్ దేవరకొండను పెళ్లాడిన రష్మిక మందన్న, పెళ్లి తర్వాత కూడా కెరీర్ కంటిన్యూ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తన కొత్త సినిమా మైసా కోసం డేరింగ్ స్టెప్ తీసుకుంది రష్మిక.
పుష్ప: ది రైజ్’, ‘యానిమల్’ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ విజయాలతో జోష్ లో ఉన్న రష్మిక మందన్న (Rashmika Mandanna).. ప్రస్తుతం తన పాత్రల ఎంపికలో వైవిధ్యాన్ని కనబరుస్తున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ఆస్కారం ఉన్న, ఛాలెంజింగ్ రోల్స్ను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ (Maisa). యువ దర్శకుడు రావింద్ర పుల్లే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో అత్యంత కీలకమైన, సాహసోపేతమైన అండర్వాటర్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణను చిత్రబృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్గా నిలవనుందని సమాచారం. ఈ అప్డేట్ను నిర్మాత అజయ్ సాయిరెడ్డి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “రష్మిక మందన్నతో అద్భుతమైన, ఉత్కంఠభరితమైన అండర్వాటర్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తయింది” అని ఆయన పేర్కొన్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, పది రోజుల క్రితమే ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ నేతృత్వంలో రష్మికపై ఒక అద్భుతమైన పాటను కూడా చిత్రీకరించినట్లు దర్శకుడు సోషల్ మీడియాలో తెలిపారు.
అంతకుముందు దర్శకుడు రావింద్ర పుల్లే తన షర్ట్పై రష్మిక చేతి ముద్రలు ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ, “రక్తపు మరకలు రాబోతున్నాయి” అని క్యాప్షన్ ఇవ్వడం సినిమాలోని యాక్షన్ డోస్ను సూచిస్తోంది. దీనికి రష్మిక స్పందిస్తూ.. “ఈ అందమైన కళకు కొంచెం రక్తం కూడా జోడిస్తే ఇంకా బాగుండేది!” అని సరదాగా కామెంట్ చేయడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
‘మైసా’ చిత్రంలో రష్మిక ఒక గోండు గిరిజన యువతిగా డీ గ్లామరస్, పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు. ఈ గిరిజన పాత్ర కోసం ఆమె శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించేందుకు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకున్నారు. అంతర్జాతీయ స్టంట్ డైరెక్టర్ల పర్యవేక్షణలో ఆమె రోజూ 8 గంటల పాటు కఠినమైన యాక్షన్ కసరత్తులు చేయడం విశేషం. ఈ ఏడాది మే నెలలో కేరళలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఒక భారీ షెడ్యూల్ను కూడా చిత్రయూనిట్ పూర్తి చేసింది.
అన్ఫార్ములా ఫిల్మ్స్ (Unformula Films) బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ఈశ్వరీ రావు, కోలీవుడ్ నటుడు గురు సోమసుందరం, టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ రావు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రేయాస్ పి కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మలయాళ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సంగీతం సమకూరుస్తున్నారు. నటిగా రష్మికను మరో మెట్టు పైకి ఎక్కించేలా రూపొందుతున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













