Nagole Nayeem Murder: 12 మంది కలిసి హైదరాబాద్‌లో నయీమ్‌ను ఎలా మట్టుబెట్టారంటే.. పూసగుచ్చినట్లు వెల్లడించిన పోలీసులు! | తెలంగాణ వార్తలు | ACTPnews

Nagole Nayeem Murder: 12 మంది కలిసి హైదరాబాద్‌లో నయీమ్‌ను ఎలా మట్టుబెట్టారంటే.. పూసగుచ్చినట్లు వెల్లడించిన పోలీసులు! | తెలంగాణ వార్తలు


ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన నయీమ్ నాగోలు పరిధిలోని బండ్లగూడలో నివాసం ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. స్వతహాగా బాడీబిల్డర్ అయిన ఇతనికి తోటి స్నేహితులైన ఓట్ల దినకర్, రియల్టర్ కనకం ఉమామహేశ్‌లతో ఎప్పటినుంచో పరిచయం ఉంది. గతంలో ఇల్లెందులో కొన్ని కేసుల్లో జైలుకు వెళ్లిన సమయంలో ఉమామహేశ్‌కు యానాంకు చెందిన జిమ్ ట్రైనర్ సయ్యద్ రబ్బానీతో పరిచయం ఏర్పడింది. నయీమ్ బాడీబిల్డర్ కావడంతో ఆ ఆకర్షణతో రబ్బానీ అతనికి సహాయకుడిగా చేరాడు. అయితే రోజులు గడిచేకొద్దీ నయీమ్ ప్రవర్తనలో క్రూరత్వం బయటపడింది. రోజూ పీకలదాకా మద్యం తాగి రబ్బానీని, అతడి ఇంటి సభ్యులను బూతులు తిట్టడం ప్రారంభించాడు. విసిగిపోయిన రబ్బానీ మకాం మార్చినా కూడా నయీమ్ వేధింపులు ఏమాత్రం ఆగలేదు. అటు దినకర్, ఉమామహేశ్‌లకు ఫోన్లు చేసి నయీమ్ వేధిస్తుండటంతో వీరంతా కలిసి అతడిని శాశ్వతంగా మట్టుపెట్టాలని గట్టి నిర్ణయానికి వచ్చారు.

ఇది కూడా చదవండి: Tirumala Darshan: కేవలం 2 గంటల్లోనే దర్శనం.. తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, ఎలాగో తెలుసా?

హత్య చేయాలని నిర్ణయించుకున్న రబ్బానీ తమకు అండగా ఉండే వ్యక్తుల కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. గతంలో జైలులో పరిచయమైన ఛత్రినాక వాసి రసుమల్ల సాకేత్‌ను సంప్రదించాడు. గతంలో జైలులో ఉన్నప్పుడు నయీమ్ చేతిలో తీవ్ర వేధింపులకు గురైన సాకేత్ వెంటనే ఈ హత్యకు సహకరించేందుకు అంగీకరించాడు. పక్కా స్కెచ్ వేసేందుకు సాకేత్ తన స్నేహితులైన వల్లిపోల మహేశ్, ఆలకుంట్ల వెంకట్, కొడిగంటి రాఘవేందర్, వల్లపుదాసు చరణ్‌గౌడ్, మహ్మద్ బద్రుల్లా హుస్సేన్‌లను ఈ క్రైమ్ సిండికేట్‌లోకి చేర్చుకున్నాడు. నయీమ్ హత్యకు ఎక్కడ, ఎలా ప్రణాళిక వేయాలో చర్చించేందుకు ఈ నెల 13న రబ్బానీ, మహేశ్, రాఘవేందర్, వెంకట్ కలిసి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో రహస్యంగా ఖమ్మం వెళ్లారు. అక్కడ దినకర్, బద్రుల్లా, ఉమామహేశ్‌లతో కలిసి హత్య అమలుకు తుది రూపురేఖలు ఖరారు చేశారు.

ఇది కూడా చదవండి: TDP MLA: కూర్చోరా.. కూర్చో.. మధ్యలో మాట్లాడకు! ఒక్కొక్కరికి తాట తీస్తా.. సొంత పార్టీ నేతలకు ఎమ్మెల్యే మాస్ వార్నింగ్ !

ఖమ్మంలో వేసిన ప్లాన్ ప్రకారం 14వ తేదీన దినకర్ ఒక కారును సిద్ధం చేసి దానికి ‘ప్రభుత్వ వాహనం’ అనే బోర్డు తగిలించాడు. ఆ కారులోనే నిందితులైన దినకర్, రబ్బానీ, వెంకట్, రాఘవేందర్, ఉమామహేశ్ నాగోలు చేరుకున్నారు. ముందుగా మాట్లాడుకున్న పథకం ప్రకారం భోళే, కార్తీక్ అనే ఇద్దరు వ్యక్తులు నయీమ్‌ను మద్యం తాగుదామని నమ్మించి నాగోలులోని సుప్రీం వైన్స్‌కు తీసుకొచ్చారు. అప్పటికే అక్కడ మాటు వేసిన సాకేత్, చరణ్‌గౌడ్, ఇస్మాయిల్ జబీ తమ గ్యాంగ్‌తో కలిసి వైన్స్ వద్దకు చేరుకున్నారు. నయీమ్ వైన్స్ లోపలికి వెళ్లగానే ఈ గ్యాంగ్ ఒక్కసారిగా అతడిపైకి దూసుకెళ్లింది. తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా నయీమ్ కళ్లలో కారం చల్లి వేట కొడవలితో అత్యంత దారుణంగా దాడి చేశారు. ఇనుప కడాయితో తలపై విచక్షణారహితంగా బాదడంతో నయీమ్ రక్తపు మడుగులో కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

హత్య అనంతరం ఆధారాలు దొరక్కుండా నిందితులంతా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఖమ్మం పారిపోయారు. దారుణ హత్య సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన ఎల్బీనగర్ ఎస్‌వోటీ, మల్కాజిగిరి పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో విచారణ వేగవంతం చేశారు. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే పక్కా సమాచారంతో రబ్బానీ, దినకర్, మహేశ్, సాకేత్, వెంకట్, రాఘవేందర్, చరణ్‌గౌడ్, బద్రుల్లాను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నిందితులు వాడిన వేట కొడవలి, కడాయి, ఒక కారు, రెండు బైక్‌లు, ఒక సుత్తి, ఎనిమిది మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మర్డర్ ప్లాన్‌లో కీలక పాత్ర పోషించి ప్రస్తుతం పరారీలో ఉన్న ఉమామహేశ్, ఇస్మాయిల్ జబీ, భోళే, కార్తీక్‌ల కోసం పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. 8 మందిని అరెస్ట్ చేశారు. ఉన్నతాధికారులు డీసీపీలు అనురాధ, మనోహర్, ఇతర సిబ్బంది కృషితో ఈ కేసును అత్యంత వేగంగా కొలిక్కితెచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports