Naresh Pal Gangwar: నీట్ వివాదంపై రంగంలోకి దిగిన కేంద్రం.. విద్యా శాఖ కొత్త బాస్‌గా ఐఐటీ గ్రాడ్యుయేట్! | | ACTPnews

News18


Last Updated:

దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల లీకేజీ వివాదం కొనసాగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా ఐఐటీ గ్రాడ్యుయేట్, సీనియర్ ఐఏఎస్ అధికారి నరేష్ పాల్ గాంగ్వార్‌ను నియమించింది. వినీత్ జోషిని బదిలీ చేసింది.

News18
News18

దేశవ్యాప్తంగా నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం పాలనాపరమైన ప్రక్షాళన చేపట్టింది. ఈ అంశంపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటుందని ఇప్పటికే స్వయంగా ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిని మారుస్తూ ఉన్నత స్థాయి కేబినెట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1994 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి నరేష్ పాల్ గాంగ్వార్‌ను ఉన్నత విద్యా శాఖ కొత్త కార్యదర్శిగా నియమించింది. ఇప్పటివరకు ఆ కీలక బాధ్యతలు నిర్వర్తించిన 1992 బ్యాచ్ మణిపూర్ కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి వినీత్ జోషిని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖకు బదిలీ చేసింది.

ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. నీట్ పరీక్షల నిర్వహణలో ఘోరంగా వైఫల్యం చెందారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని తీవ్రంగా పట్టుబడుతున్న సమయంలో ఈ మార్పు జరగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. వ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చేందుకే ఈ మార్పులు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఎవరీ నరేష్ పాల్ గాంగ్వార్..

ఇండియా టుడే కథనం ప్రకారం.. కొత్త కార్యదర్శి నరేష్ పాల్ గాంగ్వార్‌ విద్యాపరంగా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆయన ఐఐటీ ఢిల్లీ నుంచి కమ్యూనికేషన్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. దానికి ముందు రూర్కీ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్ విభాగంలో బీటెక్ డిగ్రీ పొందారు. రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్‌లో ఎంఏ కూడా చదివారు. ఇలాంటి ఉన్నత విద్యా నేపథ్యం ఉన్న అధికారిని విద్యా శాఖకు తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఉన్నత విద్యా శాఖకు రాకముందు ఆయన పశుసంవర్ధక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి స్థాయి నుంచి కేంద్ర పర్యావరణ శాఖ సంయుక్త కార్యదర్శి స్థాయి వరకు వివిధ కీలక బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించారు. పరిపాలనా వ్యవహారాల్లో ఆయనకున్న అపార అనుభవం విద్యా శాఖలోని ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు వినీత్ జోషి స్థానచలనం ఆశ్చర్యం కలిగించింది. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్న వివేక్ భరద్వాజ్ జూలై 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆ స్థానంలో వినీత్ జోషి బాధ్యతలు స్వీకరించనున్నారు. నీట్ ఆందోళనల నడుమ విద్యా శాఖలో జరిగిన ఈ కీలక మార్పులు పరీక్షా వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకురావాలన్న విద్యార్థుల డిమాండ్లకు ప్రభుత్వ సమాధానంగా కనిపిస్తున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports