Last Updated:
జూన్ 21న జరగబోయే నీట్ రీ-ఎగ్జామ్ (NEET Re-test) కోసం అతడు హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోగా.. ఏకంగా 2,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూఏఈ రాజధాని ‘అబుదాబి’లోని ఒక పాఠశాలను పరీక్షా కేంద్రంగా కేటాయించింది.
NEET Re-test: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తప్పిదాలు రోజురోజుకూ సరికొత్త వివాదాలకు దారితీస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన 18 ఏళ్ల నీట్ (NEET-UG) అభ్యర్థి అబ్దుల్లా మహమ్మద్ తాలిబ్కు ఎన్టీఏ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. జూన్ 21న జరగబోయే నీట్ రీ-ఎగ్జామ్ (NEET Re-test) కోసం అతడు హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోగా.. ఏకంగా 2,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూఏఈ రాజధాని ‘అబుదాబి’లోని ఒక పాఠశాలను పరీక్షా కేంద్రంగా కేటాయించింది.
సాధారణంగా ఎన్టీఏ విదేశాల్లోని పరీక్షా కేంద్రాలను ఎన్ఆర్ఐ (NRI) లేదా అంతర్జాతీయ విద్యార్థుల కోసం కేటాయిస్తుంది. అయితే ఈ విద్యార్థి తన అప్లికేషన్లో మొదటి ప్రాధాన్యతగా నాగ్పూర్, ఆ తర్వాత వార్ధా, భండారా జిల్లాలను ఆప్షన్లుగా ఎంచుకున్నాడు. అసలు విదేశీ ఆప్షన్ ఇవ్వకపోయినప్పటికీ అబుదాబి ఇండియన్ స్కూల్ను సెంటర్గా కేటాయించడంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. “మా అబ్బాయికి అసలు పాస్పోర్ట్ కూడా లేదు. ఇంత తక్కువ సమయంలో విదేశాలకు వెళ్లడానికి ప్రయాణ ఏర్పాట్లు ఎలా చేయగలం?” అని విద్యార్థి తండ్రి మహమ్మద్ తాలిబ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే నీట్ పేపర్ లీక్ వివాదాలు, పరీక్షల రద్దుతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న సదరు విద్యార్థి.. తాజా హాల్టికెట్ గందరగోళంతో మరింత మానసిక ఆందోళనకు గురయ్యాడు. తీవ్ర మనస్తాపానికి గురై ఎగ్జామ్ రాయనంటూ కన్నీరు పెట్టుకున్నాడని, తల్లి నచ్చజెప్పడంతో పరీక్షకు సిద్ధమయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
బాధిత కుటుంబం వెంటనే ఎన్టీఏ హెల్ప్లైన్ను సంప్రదించగా.. సాంకేతిక లోపం (Technical Glitch) కారణంగానే ఇలా జరిగిందని అధికారులు అంగీకరించారు. దరఖాస్తును పరిశీలించి శనివారం సాయంత్రంలోగా నాగ్పూర్లోనే కొత్త హాల్టికెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
ఒక్క అబ్దుల్లా మాత్రమే కాకుండా.. నాగ్పూర్ పరిధిలోనే పరీక్షా కేంద్రాలను కోరుకున్న మరెంతో మంది విద్యార్థులకు కూడా ఎన్టీఏ సుదూర ప్రాంతాల్లో, ఇతర జిల్లాల్లో సెంటర్లను మార్చిందని స్థానిక పీఎంలు, లెక్చరర్లు ఆరోపిస్తున్నారు. పాత సెంటర్లనే కొనసాగించాలా లేదా కొత్తవి కావాలా అని ఎన్టీఏ మొబైల్కు పంపిన మెసేజ్కు ‘పాత సెంటర్లే’ అని రిప్లై ఇచ్చినప్పటికీ.. హాల్టికెట్లలో మాత్రం సెంటర్లు మారిపోయాయని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. డేటాబేస్ అప్డేట్ చేయడంలో జరిగిన పొరపాట్లే దీనికి కారణమని తెలుస్తోంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jun 20, 2026 11:25 AM IST













