Nipah Virus: కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో హైఅలర్ట్.. మరోసారి విజృంభించిన వైరస్ | | ACTPnews

నిఫా వైరస్


Last Updated:

కేరళలో నిఫా కేసు నమోదు కావడంతో పొరుగు రాష్ట్రమైన తమిళనాడు ప్రభుత్వం తక్షణమే అప్రమత్తమైంది. కేరళతో సరిహద్దులు పంచుకునే పొరుగు జిల్లాలైన నీలగిరి, కోయంబత్తూరు, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాల అధికారులు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద హైఅలర్ట్ ప్రకటించారు.

నిఫా వైరస్
నిఫా వైరస్

Nipah Virus: కేరళలో మరోసారి ప్రమాదకరమైన ‘నిఫా’ (Nipah Virus) వైరస్ కలకలం రేపింది. కోజికోడ్ జిల్లా రమణట్టుకర మున్సిపాలిటీ పరిధికి చెందిన 43 ఏళ్ల వ్యాపారికి నిఫా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ తీవ్ర అప్రమత్తమైంది. ప్రస్తుతం బాధితుడు కోజికోడ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ ఐసీయూలో వెంటిలేటర్‌పై అత్యంత క్లిష్ట పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యుల సిఫార్సుల మేరకు అతనికి ఐసీఎమ్‌ఆర్ (ICMR) ప్రోటోకాల్ ప్రకారం ‘మోనోక్లోనల్ యాంటీబాడీ’ చికిత్స మొదటి డోసును అందించారు.

పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థ (NIV) ఈ పాజిటివ్ కేసును అధికారికంగా ధృవీకరించిన వెంటనే, కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన నిపుణుల బృందం (NCDC) సహాయక చర్యల కోసం శనివారం కోజికోడ్ చేరుకుంది. బాధితుడు ఇటీవల ఒక గోదామును శుభ్రం చేశాడని, ఆ పరిసరాల్లో గల గబ్బిలాల (Fruit Bats) ద్వారానే ఈ వైరస్ సోకి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

కాంటాక్ట్ లిస్ట్‌లో 87 మంది.. హై అలర్ట్‌లో కేరళ

కేరళ ఆరోగ్య శాఖ మంత్రి తాజా పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. బాధితుడి ట్రావెల్ రూట్ మ్యాప్ ఆధారంగా అతనితో ప్రాథమిక, ద్వితీయ సంబంధాలు కలిగి ఉన్న దాదాపు 87 మందిని గుర్తించి హోమ్ క్వారంటైన్‌కు తరలించారు. వీరిలో 16 మంది హై-రిస్క్ కేటగిరీలో ఉండగా, బాధితుడి భార్య సహా ముగ్గురు అత్యంత సన్నిహిత బంధువులకు చేసిన పరీక్షల్లో నెగటివ్ రావడం కాస్త ఊరటనిచ్చే అంశం. రమణట్టుకర పరిధిలోని 286 ఇళ్లలో వైద్య బృందాలు ఇప్పటికే ముమ్మర సర్వే చేపట్టాయి.

తమిళనాడు సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు: ప్రత్యేక మెడికల్ క్యాంపులు

కేరళలో నిఫా కేసు నమోదు కావడంతో పొరుగు రాష్ట్రమైన తమిళనాడు ప్రభుత్వం తక్షణమే అప్రమత్తమైంది. కేరళతో సరిహద్దులు పంచుకునే పొరుగు జిల్లాలైన నీలగిరి, కోయంబత్తూరు, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాల అధికారులు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద హైఅలర్ట్ ప్రకటించారు.

సరిహద్దుల్లో స్క్రీనింగ్: నీలగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాళూర్, నాడుగని, నంబియార్‌కున్ను, సోలాడి, పట్టవాయల్ వంటి కీలక సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక వైద్య బృందాలను మోహరించారు.

మెడికల్ క్యాంపుల ఏర్పాటు: కేరళ నుండి తమిళనాడులోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని, ప్రయాణికులను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రయాణికులలో జ్వరం, తీవ్రమైన తలనొప్పి, శ్వాసకోశ సమస్యలు వంటి నిఫా లక్షణాలు ఉన్నాయా లేదా అని నిర్ధారించడానికి సరిహద్దుల్లోనే ప్రత్యేక వైద్య శిబిరాలు (Medical Camps) ఏర్పాటు చేసి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.

ఆసుపత్రులకు ఆదేశాలు: సరిహద్దు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (PHCs) ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలని, ఎలాంటి అనుమానిత కేసు వచ్చినా వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఆందోళన వద్దు – అధికారుల విజ్ఞప్తి

తమిళనాడులో ఇప్పటివరకు ఎలాంటి నిఫా వైరస్ ముప్పు నమోదు కాలేదని, ఈ చర్యలన్నీ కేవలం ముందస్తు జాగ్రత్తలు మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలను నమ్మి భయాందోళనలకు గురికావద్దని, కేరళ నుండి వచ్చే వారికి జ్వరం లక్షణాలు ఉంటే స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports