Last Updated:
Operation Tiger Successful: ఒక పార్టీ తరపున గెలిచి.. మరో పార్టీలోకి జంప్ అవుతూ.. ప్రజా ప్రతినిధులు.. రాజ్యాంగ విలువల్ని గాలికి వదిలేస్తున్నారు. గుంపుగా, మూడింట రెండొంతుల మంది పార్టీ మారితే తప్పేమీ లేదు అంటున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం జరగబోతోంది. ‘ఆపరేషన్ టైగర్’ పేరుతో జరుగుతున్న రాజకీయ ఆపరేషన్ విజయవంతమైందనీ, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT) పార్టీకి చెందిన ఆరుగురు లోక్సభ సభ్యులు ఏకనాథ్ షిండే అధ్వర్యంలోని శివసేన వర్గంలో చేరనున్నారని న్యూస్18 సహా ప్రముఖ వార్తా సంస్థలు వెల్లడించాయి. నేటి మధ్యాహ్నం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వీరు లాంఛనంగా షిండే వర్గంలో విలీనం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి లోక్సభలో ప్రస్తుతం మొత్తం 9 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో ఆరుగురు ఎంపీలు ఒకేసారి పార్టీని వీడుతుండటం ఉద్ధవ్ ఠాక్రేకు కోలుకోలేని భారీ దెబ్బ. జూన్ 17న ఢిల్లీలో జరిగిన శివసేన (UBT) పార్లమెంటరీ పార్టీ సమావేశానికి సంజయ్ దిన పాటిల్, సంజయ్ దేశ్ముఖ్, సంజయ్ జాదవ్, భావుసాహెబ్ వాక్చౌరే, నాగేష్ పాటిల్ అష్టికర్, ఓంప్రకాష్ రాజే నింబాల్కర్ హాజరుకాలేదు. ఈ ఆరుగురు ఎంపీలూ.. ఫిరాయింపుల నిరోధక చట్టం (Anti-defection law) కింద తమపై అనర్హత వేటు పడకుండా ఉండేందుకు అవసరమైన మూడింట రెండొంతుల (2/3) బలాన్ని సాధించి, స్వతంత్ర గ్రూపుగా గుర్తింపు కోరుతూ లోక్సభ స్పీకర్ను ఆశ్రయించారు.
వీరిలో నాగేష్ పాటిల్ అష్టికర్ (హింగోలి), ఓంప్రకాష్ రాజే నింబాల్కర్ (ధారాశివ్) ఇద్దరూ ఆదివారం తమ నిర్ణయాన్ని బహిరంగంగా ధృవీకరించారు. విపక్షంలో ఉండటం వల్ల తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధుల కొరత తీవ్రంగా ఉందనీ, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోతున్నామని అష్టికర్ స్పష్టం చేశారు. అలాగే, జూన్ 18 తర్వాత పార్టీలోని కొందరు ముఖ్య నేతలు తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా కలచివేశాయని, అందుకే పార్టీ వీడక తప్పలేదని ఆయన వివరించారు.
మరోవైపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండేలు ‘ఆపరేషన్ టైగర్’ పూర్తిగా విజయవంతమైందని ప్రకటించారు. “ఆపరేషన్ సక్సెస్ అయింది, దేహం కూడా పూర్తి ఆరోగ్యంగా ఉంది” అని ఫడ్నవిస్ వ్యాఖ్యానించగా, తాము ఏ ఆపరేషన్ చేపట్టినా దాన్ని నూటికి నూరు శాతం పూర్తి చేస్తామని షిండే స్పష్టం చేశారు. ఎంపీలను తీవ్ర పదజాలంతో దూషించి, మళ్లీ వారు వెనక్కి రావాలని కోరుకోవడం విడ్డూరంగా ఉందని ఉద్ధవ్ వర్గాన్ని ఉద్దేశించి షిండే సెటైర్లు వేశారు.
ఈ వరుస ఫిరాయింపులతో పార్టీ కేడర్ను కాపాడుకునేందుకు ఉద్ధవ్ ఠాక్రే అప్రమత్తమయ్యారు. సోమవారం మధ్యాహ్నం నారిమన్ పాయింట్లోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భాండూప్లో జరిగిన సభలో ఉద్ధవ్ మాట్లాడుతూ.. ఈ పరిణామాలతో తాను ఏమాత్రం అధైర్యపడలేదనీ, ఇదంతా శివసేనను అంతం చేయాలని చూస్తున్న బీజేపీ కుట్ర అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎంపీలు భౌతికంగా వెళ్లిపోయినా, నిజమైన శివసైనికులు, పార్టీ కార్యకర్తలు తమ వెంటే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
10వ షెడ్యూల్ (ఫిరాయింపుల నిరోధక చట్టం): 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ను చేర్చారు. పదవుల కోసం, స్వలాభం కోసం తరచూ పార్టీలు మారే (ఆయారామ్-గయారామ్) సంస్కృతికి చెక్ పెట్టడానికి, అలా పార్టీలు మారిన వారిపై అనర్హత వేటు వేయడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.
మూడింట రెండొంతుల (2/3) మినహాయింపు (విలీనం): ఇదే చట్టంలో ఒక మినహాయింపు (Loophole) కూడా ఉంది. 10వ షెడ్యూల్ లోని పారాగ్రాఫ్ 4 ప్రకారం.. ఒక రాజకీయ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుల్లో (Legislature Party) కనీసం మూడింట రెండొంతుల (2/3rd) మంది సభ్యులు మూకుమ్మడిగా వెళ్లి వేరే పార్టీలో “విలీనం” (Merger) అయితే, వారిపై అనర్హత వేటు పడదు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jun 22, 2026 10:27 AM IST













