సంజన (దీప్షిక చంద్రన్) చిన్నతనంలో జరిగిన ఒక ప్రమాదంలో కంటిచూపు కోల్పోతుంది. అయినా సరే ఎవరిపైనా ఆధారపడకుండా తన పనులు తనే చేసుకుంటుంది. కిషోర్ (శ్రీనివాస రెడ్డి) నడుపుతున్న పబ్లో సింగర్గా పని చేస్తూ నలుగురు పిల్లలు, ఒక బామ్మతో కలిసి జీవిస్తుంటుంది. తనకు చూపు లేదనే విషయాన్ని సానుభూతి కోసం వాడుకోవడానికి ఆమె అస్సలు ఇష్టపడదు. ఆ లోపం తన జీవితానికి సమస్యే కాదనే ధీమాతో బతుకుతుంటుంది. అదే సమయంలో పబ్ యజమాని కిషోర్ స్నేహితుడు రాజ్ (సూర్య వసిష్ఠ) పరిచయం అవుతాడు. ఒక ప్రమాదం కారణంగా రాజ్ నడవలేని స్థితికి చేరుకుని, పూర్తిగా వీల్ చైర్కే పరిమితం అవుతాడు.
సంజన, రాజ్ మధ్య మొదట్లో చిన్న గొడవ జరుగుతుంది. ఆ పరిచయం కాస్తా క్రమంగా బలపడి ప్రేమగా మారుతుంది. గతంలో జరిగిన సంఘటనలు, తన ఆశయాలు నెరవేరలేదనే బాధతో కుంగిపోతున్న రాజ్కు సంజన ప్రేమ కొత్త జీవితాన్ని ఇస్తుంది. ఆమెతో పరిచయం తర్వాత అతని ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. మరోవైపు సంజన పార్ట్ టైమ్ ఆర్జేగా కూడా రాణిస్తుంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకున్న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కాలని నిశ్చయించుకుంటారు. అయితే శారీరక లోపాలున్న వీరిద్దరి పెళ్లి సజావుగా సాగిందా? రాజ్ వీల్ చైర్కే పరిమితం కావడానికి అసలు కారణం ఏంటి? సంజనకు చూపు పోయిన ప్రమాదం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఆమెతో ఉండే ఆ నలుగురు పిల్లలు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే.
చూపులేని అమ్మాయి, నడవలేని అబ్బాయి మధ్య సాగే వైవిధ్యమైన ప్రేమకథ కావడంతో సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. దర్శకుడు మొదటి భాగం అంతా సంజన, రాజ్ పాత్రల స్వభావాలు, వారి మధ్య ప్రేమ చిగురించడం లాంటి అంశాలతో నడిపించారు. ఇంటర్వెల్ సమయంలో ఒక బలమైన ఎమోషనల్ ట్విస్ట్ ఇచ్చి, ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచడంలో విజయం సాధించారు.
రెండో భాగం పూర్తిగా ఎమోషనల్ డ్రామాగా సాగుతుంది. వీరిద్దరూ ఒకటవుతారా లేదా అనే ఉత్కంఠను తెరపై బాగానే చూపించారు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే మలుపులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. క్లైమాక్స్ సన్నివేశాలను మరింత బరువైన భావోద్వేగాలతో ముగించారు. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది, ఆ లోపాన్ని చూసి జీవితంలో ఆగిపోకూడదు, ధైర్యంగా ముందుకు సాగాలనే మంచి సందేశాన్ని ఈ చిత్రం అందిస్తుంది. శారీరక వైకల్యం ఉన్నవారికి కూడా ఒక అందమైన ప్రేమకథ ఉంటుందని దర్శకుడు హృద్యంగా చూపించారు.
అయితే కథలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. మొదటి భాగంలో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. హీరోయిన్తో ఉండే నలుగురు పిల్లలు, బామ్మ నేపథ్యం గురించి స్పష్టత ఇవ్వకపోవడం పెద్ద మైనస్. హీరో అనారోగ్యం గురించి చెప్పిన తర్వాత స్క్రీన్ ప్లే చాలా రొటీన్ ఫార్మాట్లోకి వెళ్ళిపోతుంది. ముగింపులో వచ్చే ఎమోషన్స్ కూడా పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. ‘రమణి కళ్యాణం’ అనే టైటిల్కు, ఈ కథకు ఉన్న సంబంధాన్ని దర్శకుడు సరిగ్గా స్థాపించలేకపోయారు.
నటీనటుల పనితీరు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. కళ్లు లేని అమ్మాయిగా దీప్షిక చంద్రన్ అద్భుతమైన నటన కనబరిచింది. ఆమె హావభావాలు చూస్తే నిజంగానే చూపు లేదేమో అనేంతగా పాత్రలో లీనమైపోయింది. హీరో సూర్య వసిష్ఠ సైతం వీల్ ఛైర్కే పరిమితమైన వికలాంగుడి పాత్రలో చక్కటి పరిణతి చూపించాడు. హాస్యనటుడు శ్రీనివాస రెడ్డికి చాలా కాలం తర్వాత ఒక మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది. ఎప్పుడూ నవ్వించే ఆయన, ఇందులో ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా మెప్పించారు. యాంకర్ శ్యామల, లోహిత్ కుమార్, చైతన్య జొన్నలగడ్డ, ప్రభావతి తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక విభాగంలో సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా కలర్ఫుల్గా, రిచ్గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ను అందంగా తీర్చిదిద్దారు. నేపథ్య సంగీతం కథలోని ఎమోషన్స్ను బాగా ఎలివేట్ చేసింది. అయితే పాటలు అంతగా గుర్తుంచుకునేలా లేవు, యావరేజ్గా అనిపిస్తాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి, కొన్ని సాగదీత సీన్లను కత్తిరిస్తే సినిమా వేగం పెరిగేది. ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలతో కూడిన ప్రేమకథను తెరపై ఆవిష్కరించడం అంత సులువు కాదు. ఈ విషయంలో దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి పడిన కష్టం కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి, నిర్మాతలు కథకు తగినట్లుగానే ఖర్చు పెట్టారు.
మొత్తంగా చూస్తే.. ‘రమణి కళ్యాణం’ శారీరక లోపాలను అధిగమించిన ఇద్దరు మనసుల ఎమోషనల్ లవ్ స్టోరీ. కొన్ని రొటీన్ సీన్లు పక్కన పెడితే, హృదయాన్ని కదిలించే మంచి ప్రయత్నం ఇది.
రేటింగ్: 2.75 / 5












