Ranabali Movie: 130 రోజుల షూటింగ్‌కు గుమ్మడికాయ.. విజయ్ ‘రణబాలి’ నుంచి బిగ్ అప్డేట్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ షూటింగ్ పూర్తయింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ గత 130 రోజులుగా నిర్విరామంగా కొనసాగింది.

News18
News18

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ షూటింగ్ పూర్తయింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ గత 130 రోజులుగా నిర్విరామంగా కొనసాగింది. తాజాగా షూటింగ్ మొత్తం పూర్తవడంతో చిత్రబృందం గుమ్మడికాయ కొట్టింది. ఈ విషయాన్ని దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తన ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా తన చిత్రబృందాన్ని ‘అలుపెరుగని సైన్యం’గా అభివర్ణిస్తూ ఓ ప్రత్యేక వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

‘రణబాలి’ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. టి-సిరీస్ సమర్పణలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 16న ‘రణబాలి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో విడుదలకు ముందే సినిమాకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసేలా చిత్రబృందం వేగంగా ముందుకు సాగుతోంది.

షూటింగ్ పూర్తవడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై మేకర్స్ మరింత ఫోకస్ పెట్టనున్నారు. సినిమాకు సంబంధించిన మొదటి భాగం నేపథ్య సంగీతం కూడా ఇప్పటికే పూర్తయినట్లు చిత్రబృందం వెల్లడించింది. దీంతో ప్రకటించిన తేదీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమాను సిద్ధం చేసే దిశగా పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, పీరియాడిక్ నేపథ్యం, విజువల్ ఎలిమెంట్స్‌కు ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులకు గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఇక ‘రణబాలి’లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి జోడీగా కనిపించనున్నారు. గతంలో వీరిద్దరూ ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో కలిసి నటించారు. ఈ రెండు సినిమాల తర్వాత మళ్లీ ఈ జంట తెరపై కనిపించనుండటంతో ‘రణబాలి’పై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అయితే ఈసారి వీరిద్దరూ పూర్తిగా భిన్నమైన పీరియాడిక్ నేపథ్యంలోని పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమాలో రష్మిక పోషిస్తున్న పాత్రకు ‘జయమ్మ’ అనే పేరు పెట్టారు. ఇటీవల దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ పాత్ర గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన తల్లి పేరు ఆధారంగానే రష్మిక పాత్రకు జయమ్మ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. రణబాలి జీవితంలో జయమ్మకు ఎంతో కీలకమైన స్థానం ఉంటుందని దర్శకుడు వివరించారు. రష్మిక తన నటనతో ఈ పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారని, ఆ పాత్ర ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోయేలా చేశారని ఆయన ప్రశంసించారు.

‘రణబాలి’ కథ 19వ శతాబ్దం నేపథ్యంలో సాగుతుంది. ముఖ్యంగా 1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం చెబుతోంది. అప్పటి చరిత్రలోని కొన్ని సంఘటనలు, బ్రిటిష్ పాలనకు సంబంధించిన అంశాలు, అణచివేతకు గురైన కథనాలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఇది ఏ ఒక్క వ్యక్తి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ కాదని మేకర్స్ స్పష్టం చేస్తున్నారు. చారిత్రక ఆధారాలు, మౌఖిక కథనాలు, అందుబాటులో ఉన్న రికార్డులను ఆధారంగా చేసుకుని ఆ కాలాన్ని పునర్నిర్మించే ప్రయత్నమే ‘రణబాలి’ అని చెబుతున్నారు.

ఇక సినిమాలో విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పాత్రలో కనిపించనుండగా, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ‘ది మమ్మీ’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ‘సర్ థియోడర్ హెక్టర్’గా కనిపించనున్నారు. భారీ తారాగణం, చారిత్రక నేపథ్యం, యాక్షన్ అంశాలతో రూపొందుతున్న ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports