Last Updated:
ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలో రష్యా డ్రోన్ దాడులు పెను విషాదాన్ని నింపాయి. ఓ గోదాముపై జరిగిన ఈ దాడిలో భారీ పేలుడు సంభవించి 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విచారణకు ఆదేశించారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగర శివార్లలో రష్యా సైన్యం దారుణ మారణహోమానికి పాల్పడింది. రష్యా ప్రయోగించిన డ్రోన్లు కీవ్ సమీపంలోని ఓ భారీ గోదామును ఢీకొట్టడంతో భయంకరమైన పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో కనీసం 27 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి జరిగిన ఈ దాడితో ఆ ప్రాంతమంతా అగ్నిగుండంగా మారింది. ఆకాశాన్ని తాకేలా మంటలు చెలరేగడంతో స్థానికులు ప్రాణభయంతో వణికిపోయారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కీవ్ సైనిక పరిపాలన విభాగం అధిపతి తైమూర్ తకచెంకో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.














