Last Updated:
Summer Camps: తెలంగాణ ప్రభుత్వం మే 2 నుంచి జూన్ 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా స్నేహా సమ్మర్ క్యాంప్స్ నిర్వహించనుంది, 15-18 ఏళ్ల బాలికల నైపుణ్యాలు, భద్రత, విద్య, నాయకత్వంపై దృష్టి.
రాష్ట్రంలోని కిషోర బాలికల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. మే 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న “స్నేహా సమ్మర్ క్యాంప్స్” గురించి పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. ఈ వేసవి శిబిరాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా, బాలికలను అన్ని రంగాల్లో మేటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించాయి. ఈ నేపథ్యంలో, స్నేహా సమ్మర్ క్యాంప్స్ నిర్వహణ, దాని ప్రాముఖ్యత, బాలికల సాధికారతకు ఇది ఎలా దోహదపడుతుందో తెలుసుకుందాం..
ప్రస్తుత సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి వారికి సరైన దిశానిర్దేశం అవసరమని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. 15 నుంచి 18 ఏళ్ల వయస్సు గల కిషోర బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ శిబిరాల ద్వారా వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడం, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. మే 2 నుంచి జూన్ 10 వరకు జరిగే ఈ శిబిరాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
శిబిరాల్లోని ప్రధానాంశాలు: బాలికల వ్యక్తిత్వ వికాసం నుంచి వారి భద్రత వరకు అనేక అంశాలను ఈ శిబిరాల్లో పొందుపరిచారు. ఈ కార్యక్రమాల్లో నేర్పించే ముఖ్యమైన అంశాలు ఇవే..
చదువు కొనసాగింపు: చదువు మధ్యలో ఆపేసిన (Dropouts) బాలికలను గుర్తించి, వారు తిరిగి విద్యాభ్యాసం కొనసాగించేలా ప్రోత్సహించడం. ముఖ్యంగా కిషోర బాలికల్లో ప్రధాన సమస్యగా ఉన్న రక్తహీనత (అనీమియా) నివారణపై అవగాహన కల్పించి, పౌష్టికాహారం ప్రాముఖ్యతను వివరించడం.
జీవన నైపుణ్యాల పెంపు (Life Skills): దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి అవసరమైన నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి నేర్పడం. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, వాటిని అడ్డుకునే ధైర్యాన్ని బాలికల్లో నింపడం. బాలికలు శారీరకంగా ధృడంగా ఉండటానికి వీలుగా వివిధ రకాల క్రీడలను ఈ శిబిరాల్లో భాగంగా చేర్చారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ భద్రత, పొదుపు-ఆర్థిక నిర్వహణ, సరైన కెరీర్ మార్గదర్శనం వంటి అంశాలపై నిపుణులతో అవగాహన కల్పిస్తారు. ఈ స్నేహా సమ్మర్ క్యాంప్స్లో అత్యంత ఆకర్షణీయమైన వినూత్నమైన అంశం “రాష్ట్ర స్థాయి మాక్ అసెంబ్లీ”. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక ప్రతిభావంతురాలైన కిషోర బాలికను ఎంపిక చేసి, వారితో రాష్ట్ర స్థాయిలో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తారు. ఇది వారికి ప్రజాస్వామ్య వ్యవస్థపై, చట్టాల తయారీపై అవగాహన కల్పిస్తుంది. అలాగే, క్యాంప్స్ ముగింపు దశలో గ్రామ స్థాయిలో “బాలికల గ్రామసభలు” నిర్వహించి, బాలికల భద్రత బాల్య వివాహాల నిరోధంపై కీలక తీర్మానాలు చేయనున్నారు. ఇది స్థానిక స్థాయిలో బాలికల గొంతును బలోపేతం చేస్తుంది.
ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతం కావడానికి వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క సూచించారు. సెర్ప్ (SERP) సీఈఓ దివ్యా దేవరాజన్ ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాలను మార్గదర్శకాలను జారీ చేశారు. మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేసి, ప్రతి బాలిక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని మంత్రి స్పష్టం చేశారు.
Hyderabad,Telangana











