Last Updated:
కోయంబత్తూరు సమీపంలో పది సంవత్సరాల బాలిక అపహరణ, హత్య ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం, వేగంగా విచారణ జరిపి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చింది.
తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోయంబత్తూరు సమీపంలోని సూలూర్ కన్నంపాలయం ప్రాంతంలో 10 సంవత్సరాల బాలిక అపహరణ, హత్య ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నాగపట్నంకు చెందిన కార్తీక్ (33) గా, అతనికి సహకరించిన మరో నిందితుడిని మోహన్ రాజ్గా గుర్తించారు. గురువారం సాయంత్రం ఇంటి సమీపంలో కిరాణా సామాగ్రి కొనేందుకు వెళ్లిన చిన్నారిని నిందితుడు చాక్లెట్లు ఇస్తానని నమ్మించి బైక్పై అపహరించాడు.
ఆపై కన్నంపాలయం చెరువు సమీపంలోని కొబ్బరి తోటలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించగా, బాలిక గట్టిగా కేకలు వేసి ప్రతిఘటించడంతో గొంతు నులిమి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేశారు. సిసిటివి దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
ఈ దారుణ ఉదంతం వెలుగులోకి రావడంతో స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ సూలూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై దాదాపు ఎనిమిది గంటల పాటు రాత్రి నుండి ఉదయం వరకు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. దీంతో పశ్చిమ మండల ఐజీ ఆర్.వి. రమ్య భారతి, ఎస్పీ పవన్ కుమార్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులతో శాంతి చర్చలు జరిపారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, వేగంగా విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో స్థానికులు శాంతించారు. ప్రస్తుతం బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల కోసం ప్రభుత్వ ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. కాగా, పోలీసులను చూసి తప్పించుకునే క్రమంలో భవనంపై నుండి దూకిన ప్రధాన నిందితుడు కార్తీక్ కుడి చేయి, కాలు విరగడంతో భారీ పోలీసు భద్రత నడుమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
கோயம்புத்தூரில் நேற்று 10 வயது சிறுமிக்கு நிகழ்ந்த கொடூர சம்பவம் மிகுந்த வேதனையையும், அதிர்ச்சியையும் அளிக்கிறது. இத்தகைய மனிதநேயமற்ற மற்றும் மன்னிக்க முடியாத குற்றச் செயல்கள் நமது சமூகத்தில் ஒருபோதும் ஏற்றுக்கொள்ளப்பட முடியாது.
தங்கள் உயிருக்குயிரான குழந்தையைப் பிரிந்து வாடும்…— CMOTamilNadu (@CMOTamilnadu) May 23, 2026
ఈ ఘోర ఉదంతంపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దారుణమైన చర్య అమానుషమైనదని, సమాజంలో ఇలాంటి నేరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. మహిళలు, చిన్న పిల్లలపై జరిగే ఘోరాలకు పాల్పడేవారికి చట్టం ప్రకారం కఠినమైన శిక్షలు పడేలా చూస్తామని, తక్షణమే చార్జ్షీట్ దాఖలు చేయాలని పోలీసులను సీఎం విజయ్ ఆదేశించారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













