Tirumala: తిరుమలలో జరిగిన ఘర్షణపై సంచలన వివరాలు.. ఇద్దరు వర్గాల మధ్య అసలు ఏమైంది? | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

News18


Last Updated:

తిరుమలలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణ ఘటనపై సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న ప్రచారాల నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీస్ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

+

News18

తిరుమలలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణ ఘటనపై సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న ప్రచారాల నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీస్ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తిరుమల టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్ ప్రాంతంలో జరిగిన ఘర్షణకు సంబంధించి కొన్ని సోషల్ మీడియా వేదికలు, వార్తా మాధ్యమాల్లో అసత్యాలు, అతిశయోక్తి కథనాలు ప్రచారంలోకి వచ్చాయని, వాటిలో వాస్తవం లేదని పోలీసులు స్పష్టం చేశారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, జూన్ 5వ తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయంలో తిరుమలలో అనధికారికంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న రెండు వర్గాలకు చెందిన వ్యక్తుల మధ్య పాత వ్యక్తిగత విభేదాలు, ఆధిపత్య పోరు కారణంగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారి తీసి ఇరు వర్గాల వారు పరస్పరం దాడులకు పాల్పడ్డారు.

ఈ ఘటనలో కొందరికి స్వల్ప గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే తిరుమల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఘర్షణకు పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

ఇరు వర్గాల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘర్షణలో పాల్గొన్న నిందితులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న మరో ముఖ్య అంశంపై కూడా పోలీసులు స్పష్టత ఇచ్చారు. ఘర్షణకు గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల వినియోగమే కారణమని ప్రచారం జరుగుతున్నప్పటికీ, అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. ఘటనలో పాల్గొన్న వ్యక్తులకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అందరికీ నెగటివ్ ఫలితాలు వచ్చినట్లు వెల్లడించారు. ఎవరైనా మత్తు పదార్థాలు సేవించినట్లు అనుమానం వచ్చిన వెంటనే పరీక్షలు నిర్వహించి, నిర్ధారణ అనంతరం చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

తిరుమల డీఎస్పీ మాట్లాడుతూ, తిరుమలలో శాంతిభద్రతలకు భంగం కలిగించే ఏ చర్యనైనా తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. భక్తుల భద్రత, తిరుమల పవిత్రతను కాపాడడం పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని తెలిపారు. ఈ నేపథ్యంలో తిరుమలలో పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

సీసీ కెమెరాలు, ప్రత్యేక పహారా బృందాలు, ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా 24 గంటల పాటు తిరుమల ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్పందించి ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్ఓ మురళీధర్, తిరుమల అదనపు ఎస్పీ ఐ. రామకృష్ణ అభినందించారు.

ప్రజలు, భక్తులు సోషల్ మీడియాలో వచ్చే నిరాధార ప్రచారాలు, వదంతులను నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అధికారిక వర్గాలు విడుదల చేసే సమాచారాన్నే విశ్వసించాలని సూచించారు. తిరుమలలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసే చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భద్రతకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే వెంటనే 112 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed