Tirumala Temple: పద్మశ్రీ పురస్కారం తర్వాత తొలిసారి తిరుమలలో మురళీ మోహన్.. కుటుంబసమేతంగా శ్రీవారి సేవలో! | | ACTPnews

News18


Last Updated:

పద్మశ్రీ పురస్కారం అందుకున్న తర్వాత తొలిసారిగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

+

News18

పద్మశ్రీ పురస్కారం అందుకున్న అనంతరం తొలిసారిగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీ మోహన్ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలను అందించి ఘనంగా సత్కరించారు.

దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన మురళీ మోహన్ తనకు ఇటీవల లభించిన పద్మశ్రీ పురస్కారం శ్రీవారి అనుగ్రహం వల్లే సాధ్యమైందని అన్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అందుకున్న తర్వాత శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం రావడం తన జీవితంలో ఎంతో ఆనందకరమైన, ఆధ్యాత్మికమైన క్షణమని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ తనకు, తన కుటుంబానికి ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

“అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం లభించడం పూర్వజన్మ సుకృతం. స్వామివారి కృప లేకుండా జీవితంలో ఏ విజయమూ సాధ్యం కాదు. ఈ పద్మశ్రీ పురస్కారం కూడా శ్రీవారి ఆశీస్సుల ఫలితమే” అని మురళీ మోహన్ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.

టీటీడీ భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను కూడా ఆయన ప్రశంసించారు. ప్రస్తుత టీటీడీ పాలకమండలి ఆలయంలో పవిత్రత, సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ముఖ్యంగా లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీలో నాణ్యతను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. భక్తులకు స్వచ్ఛమైన, కల్తీ లేని ప్రసాదాలు అందించడం ద్వారా టీటీడీ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తోందని కొనియాడారు.

దేశం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కూడా ప్రత్యేకంగా శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధాని నిర్మాణం విజయవంతంగా పూర్తవ్వాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, గత కొన్ని రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొంత మేర తగ్గుముఖం పట్టినట్లు టీటీడీ వెల్లడించింది. ప్రస్తుతం ఉచిత సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 17 వెయిటింగ్ కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి సుమారు 10 నుంచి 12 గంటల సమయం పడుతుండగా, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా వచ్చే భక్తులు 2 నుంచి 3 గంటల్లో, ఎస్‌ఎస్‌డీ టోకెన్లు పొందిన భక్తులు 3 నుంచి 5 గంటల్లో స్వామివారిని దర్శించుకుంటున్నారు.

టీటీడీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఆదివారం ఒక్కరోజే 84,645 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో 29,700 మంది తలనీలాలు సమర్పించారు. అదే రోజు హుండీ ద్వారా రూ.4.50 కోట్ల ఆదాయం లభించింది. అదనంగా 3.95 లక్షల శ్రీవారి లడ్డూలు విక్రయించగా, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో 2.28 లక్షల మంది భక్తులు ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

ప్రస్తుతం భక్తుల రద్దీ కొంత తగ్గడంతో స్వామివారి దర్శనం గతంతో పోలిస్తే తక్కువ సమయంలో పూర్తవుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, సజావుగా దర్శనం జరిగేలా చర్యలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నామని అధికారులు పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports