Last Updated:
తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేయడానికి పాకిస్తాన్ పదే పదే ఐరాస వేదికలను దుర్వినియోగం చేస్తోందని భారత్ తీవ్రంగా మండిపడింది.
United Nations: ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ (UNGA) వేదికగా పాకిస్తాన్కు భారత్ మరోసారి ఘాటైన కౌంటర్ ఇచ్చింది. జమ్మూ కశ్మీర్ అంశాన్ని ఐరాసలో అనవసరంగా ప్రస్తావించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేయడానికి పాకిస్తాన్ పదే పదే ఐరాస వేదికలను దుర్వినియోగం చేస్తోందని భారత్ తీవ్రంగా మండిపడింది. కశ్మీర్ అంశం పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేసింది.
ఐరాస భద్రతా మండలి వార్షిక నివేదికపై జరిగిన ఐరాస సాధారణ అసెంబ్లీ ప్లీనరీ సమావేశంలో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
“భారతదేశ అంతర్గత విషయమైన జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం గురించి పాకిస్తాన్ అనవసరంగా ప్రస్తావించడం వల్లే నేను ఇక్కడ స్పందించాల్సి వస్తోంది” అని పర్వతనేని హరీష్ పేర్కొన్నారు.
ఐరాస భద్రతా మండలి వార్షిక నివేదికపై చర్చ జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ రాయబారి ఆసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. ఐరాస తీర్మానాల ప్రకారమే ఈ వివాదాన్ని పరిష్కరించాలంటూ పాత రాగాన్ని అందుకున్నారు. దీనిపై భారత రాయబారి హరీష్ తీవ్రంగా స్పందిస్తూ.. “విభజన రాజకీయ ప్రయోజనాల కోసం ఐరాస వంటి ఉన్నతమైన వేదికలను దుర్వినియోగం చేసే తన వండ్ర బుద్ధిని పాకిస్తాన్ ఈ వేదికపై కూడా వదులుకోలేదు. ఐరాస భద్రతా మండలిలో సభ్యత్వాన్ని కలిగి ఉండటం అనేది ఒక పెద్ద బాధ్యత అని నేను పాకిస్తాన్కు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఇది పక్షపాత, అబద్ధపు కథనాలను ప్రచారం చేసే వేదిక కాదు” అని హరీష్ హెచ్చరించారు. అంతేకాకుండా, భద్రతా మండలిలో ఉన్న సమయంలో పాకిస్తాన్ తప్పుడు మరియు తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేసిందని భారత్ ఆరోపించింది.
జమ్మూ కశ్మీర్ హోదాపై భారతదేశానికి ఎటువంటి సందిగ్ధత లేదని హరీష్ స్పష్టం చేశారు. “జమ్మూ కశ్మీర్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగం మరియు విడదీయరాని భాగం. దీనికి విరుద్ధంగా చేసే ఎలాంటి వాదనలైనా ఆధార రహితమైనవి మరియు చారిత్రక వాస్తవాలకు విరుద్ధమైనవి” అని ఆయన పునరుద్ఘాటించారు. పాకిస్తాన్ చేసే ఖాళీ నినాదాలు, అబద్ధపు వాదనలు గ్రౌండ్ రియాలిటీని (వాస్తవాన్ని) మార్చలేవని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఐరాస భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని భారత్ మరోసారి డిమాండ్ చేసింది. ప్రస్తుతమున్న భద్రతా మండలి నిర్మాణం ప్రస్తుత ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించడం లేదని హరీష్ అభిప్రాయపడ్డారు. భద్రతా మండలి వార్షిక నివేదికను ఏడాదిలోగా ముందే సమర్పించాలని, ఈ వ్యవస్థను మరింత ప్రభావవంతంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. “యథాతథ స్థితిని (Status quo) కొనసాగించడం వల్ల భద్రతా మండలి సమర్థవంతంగా పనిచేయలేదు, భవిష్యత్తులో కూడా చేయలేదు” అని ఆయన అన్నారు. ఐరాస సంస్కరణల్లో భాగంగా భద్రతా మండలిలోని శాశ్వత, తాత్కాలిక సభ్యత్వాల విభాగాలను విస్తరించాలని భారత్ కోరింది.
ఈ చర్చల సందర్భంగా 2027-28 కాలానికి ఐరాస భద్రతా మండలికి కొత్తగా ఎన్నికైన ఆస్ట్రియా, కిర్గిజిస్తాన్, పోర్చుగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జింబాబ్వే దేశాలకు భారత రాయబారి అభినందనలు తెలియజేశారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













