అమెరికా అధికారుల ప్రకారం, ఈ వన్-వే అటాక్ డ్రోన్లు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న వాణిజ్య నౌకలు లేదా ఆ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా సైనిక వనరులను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపించిందని న్యూస్ 18 ఇంగ్లీస్ కథనం రాసింది.
డ్రోన్లను అడ్డుకున్న అనంతరం, భవిష్యత్తులో మరిన్ని దాడులను నిరోధించేందుకు మరియు సముద్ర రవాణా భద్రతను కాపాడేందుకు ఇరాన్ తీరప్రాంత నిఘా రాడార్ కేంద్రాలపై అమెరికా ప్రతిదాడులు చేసింది. ఇందులో గోరుక్ ప్రాంతంలోని రాడార్ కేంద్రం, ఖెష్మ్ ద్వీపంలోని నిఘా వ్యవస్థలు లక్ష్యాలుగా మారాయి.
“కొద్ది సేపటి క్రితమే హోర్ముజ్ జలసంధి వైపు ప్రయోగించిన నాలుగు ఇరానీ వన్-వే అటాక్ డ్రోన్లను CENTCOM బలగాలు కూల్చివేశాయి. ఈ డ్రోన్లు ప్రాంతీయ సముద్ర రవాణాకు తక్షణ ముప్పుగా మారాయి” అని CENTCOM ఒక ప్రకటనలో తెలిపింది.
“అనంతరం మరిన్ని దాడులను అడ్డుకోవడానికి గోరుక్ మరియు ఖెష్మ్ ద్వీపంలోని ఇరాన్ తీరప్రాంత నిఘా రాడార్ కేంద్రాలపై అమెరికా బలగాలు దాడులు చేశాయి. స్వీయ రక్షణ కోసం ఇరాన్ నుంచి వచ్చే అన్యాయమైన దాడులకు ప్రతిస్పందించేందుకు అమెరికా బలగాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నాయి” అని ఆ ప్రకటనలో పేర్కొంది.
అమెరికా–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ (సీజ్ఫైర్) అమల్లో ఉన్నప్పటికీ, అలాగే వివాదాన్ని ముగించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, ఈ ఘటన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగినట్లు సూచిస్తోంది.
మధ్యప్రాచ్యంలో అనేక వారాలుగా కొనసాగుతున్న ఘర్షణలను నిలిపివేయడానికి ఉద్దేశించిన సీజ్ఫైర్ను ఒకరిపై మరొకరు ఉల్లంఘించారని అమెరికా, ఇరాన్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నాయి.
ఈ వారం ప్రారంభంలో ఇరాన్ బహ్రెయిన్, కువైట్లలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. అయితే వచ్చిన క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నామని, గణనీయమైన నష్టం ఏదీ జరగలేదని అమెరికా సైన్యం తెలిపింది. కువైట్ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఒక భారతీయుడు మరణించినట్లు సమాచారం.
ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద భాగం ఈ మార్గం గుండా సాగుతుండటంతో, హోర్ముజ్ జలసంధి సమీపంలో జరిగిన తాజా డ్రోన్ ఘటన ప్రాంతీయ స్థిరత్వం, సముద్ర భద్రతపై కొత్త ఆందోళనలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ, అమెరికా దాడుల కారణంగా ఇరాన్ సైనిక సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అయితే ఇరాన్ వద్ద ఇంకా కొంత దాడి సామర్థ్యం మిగిలి ఉందని కూడా ఆయన అంగీకరించారు. “మేము వారి సైన్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశాం” అని ట్రంప్ NBC Newsకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. “అధిక భాగం డ్రోన్ తయారీ కేంద్రాలు, ప్రయోగ వేదికలు, క్షిపణి తయారీ సదుపాయాలు నిర్వీర్యమయ్యాయి. అయినప్పటికీ వారి వద్ద ఇంకా కొంత సామర్థ్యం ఉంది. వారికి కొన్ని క్షిపణులు, కొన్ని డ్రోన్లు ఇంకా ఉన్నాయి” అని ఆయన చెప్పారు.
ఇరాన్ వద్ద ప్రస్తుతం దాని మొత్తం క్షిపణి నిల్వల్లో సుమారు 21% నుంచి 22% వరకు మాత్రమే మిగిలి ఉందని ట్రంప్ అంచనా వేశారు.
“అది కూడా పెద్ద మొత్తమే. కానీ మేము మొదట దాడి చేసినప్పుడు ఉన్న స్థాయితో పోలిస్తే అది చాలా తక్కువ” అని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా, ఘర్షణలను ముగించి ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో రెండు దేశాల ప్రతినిధులు విస్తృత స్థాయి ఒప్పందం కోసం చర్చలు కొనసాగిస్తున్నారు.
అయితే చర్చలు పురోగమిస్తున్నాయని ట్రంప్ ఇటీవల ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ, ఇరాన్ అధికారులు మాత్రం చర్చలు ఇంకా ప్రతిష్ఠంభనలోనే ఉన్నాయని పేర్కొంటున్నారు. అంతేకాకుండా, నిలిపివేసిన ఇరాన్ ఆస్తుల విడుదల వంటి కీలక డిమాండ్లను అమెరికా నెరవేర్చడం లేదని వారు ఆరోపిస్తున్నారు.












