West Bengal: టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై గుడ్ల దాడి.. వీడియోలు వైరల్.. హైకోర్టు కీలక ఆదేశాలు | | ACTPnews

West Bengal: టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై గుడ్ల దాడి.. వీడియోలు వైరల్.. హైకోర్టు కీలక ఆదేశాలు |


ఈ ఘటనకు సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక వీడియోలో హోటల్ వెలుపల నిలబడ్డ కొందరు మహిళలు, పురుషులు నినాదాలు చేస్తూ హోటల్ వైపు గుడ్లు విసురుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆ సమయంలో పక్కనే రహదారిపై వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి.

మరో వీడియోను మహువా మోయిత్రా స్వయంగా హోటల్ లోపల నుంచి తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించారు. స్థానిక టీఎంసీ నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి కూర్చున్న సమయంలో హోటల్ అద్దాలపై గుడ్లు తాకుతున్న దృశ్యాలు అందులో కనిపించాయి. వీడియోలో గుడ్లు అద్దాలకు తాకుతుండగా, ఈ దాడి వెనుక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలు ఉన్నారని మహువా మోయిత్రా ఆరోపించారు.

ఈ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో టీఎంసీ కూడా ఈ ఘటనకు బీజేపీ మద్దతుదారులే కారణమని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలపై బీజేపీ నుంచి వెంటనే ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.

ఘటన అనంతరం విడుదల చేసిన మరో వీడియోలో మహువా మోయిత్రా మాట్లాడుతూ, హోటల్ బయట గుమిగూడిన వారి గురించి ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తనపై గుడ్లు, కూరగాయల ముక్కలు విసిరారని చూపిస్తూ, దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు.

ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ నేతలపై గుడ్లు విసిరిన ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. జూన్ 7న మిడ్నాపూర్‌లో టీఎంసీ నేత సుజయ్ హజ్రా ప్రయాణిస్తున్న పోలీసు వాహనంపై స్థానికులు గుడ్లు విసిరారు. ఇళ్ల నిర్మాణం కోసం డబ్బులు తీసుకుని హామీ నెరవేర్చలేదన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిరసన జరిగినట్లు సమాచారం.

అదే రోజు కోల్‌కతా కౌన్సిలర్లు బప్పాదిత్య దాస్‌గుప్తా, మొహమ్మద్ జసిముద్దీన్పై కూడా పోలీసులు తీసుకెళ్తుండగా గుడ్లు విసిరారు. అనంతరం జూన్ 18న టీఎంసీ నేత ఉదయన్ గుహా, జూన్ 19న అసన్సోల్ కోర్టు వెలుపల టీఎంసీ నాయకుడు విజయ్ సింగ్ కూడా గుడ్ల దాడికి గురయ్యారు. ఆ సమయంలో నిరసనకారులు “చోర్.. చోర్” అంటూ నినాదాలు చేశారు.

ఈ వరుస ఘటనల నేపథ్యంలో టీఎంసీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలపై సమన్వయంతో దాడులు జరుగుతున్నాయని పేర్కొంటూ న్యాయ జోక్యం కోరింది.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు, గుడ్లు విసిరిన ప్రతి ఘటనలో తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధితుడు నిందితుడైనా, ప్రత్యర్థి రాజకీయ పార్టీకి చెందిన వారైనా చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది.

తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి తపబ్రత చక్రవర్తి, జస్టిస్ పార్థ సారథి చటర్జీలతో కూడిన ధర్మాసనం, కేవలం ప్రత్యర్థి రాజకీయ పార్టీకి చెందినవారనే కారణంతో లేదా నిందితులనే కారణంతో ఎవరి ప్రాథమిక హక్కులను హరించలేమని వ్యాఖ్యానించింది. కొందరిని అరెస్ట్ చేయడం మాత్రమే సమస్యకు పరిష్కారం కాదని, ఇలాంటి దాడులను అరికట్టే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.

అలాగే గుడ్ల దాడి జరిగిన ప్రతి కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మరోసారి ఆదేశించిన హైకోర్టు, ఇప్పటివరకు నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల సంఖ్య, తీసుకున్న చర్యల వివరాలతో జూలై 20లోగా అఫిడవిట్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మార్గదర్శకాలను రూపొందించాలని కూడా సూచించింది.

విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని సమర్థించబోమని, ఇప్పటికే కొన్ని గుడ్ల దాడి ఘటనల్లో అరెస్టులు జరిగాయని హైకోర్టుకు తెలిపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports