Last Updated:
ఒక కఠినమైన గ్రూప్లో ఉన్నప్పటికీ.. ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా, లభించిన ఈ మెగా వేదికను ఆస్వాదిస్తూ తమ సహజమైన నైపుణ్యాలను ప్రదర్శించడానికే ప్రాధాన్యత ఇవ్వాలని జట్టుకు సూచించినట్లు ఆయన తెలిపారు.
Women’s T20 World Cup 2026: ఇంగ్లాండ్ వేదికగా జూన్ 12న మహిళల టి20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. ఈ టోర్నీలో తమ జట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయదని, దూకుడే మంత్రంగా సాగుతుందని పాకిస్తాన్ మహిళల జట్టు కోచ్ వహాబ్ రియాజ్ స్పష్టం చేశారు. ఒక కఠినమైన గ్రూప్లో ఉన్నప్పటికీ.. ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా, లభించిన ఈ మెగా వేదికను ఆస్వాదిస్తూ తమ సహజమైన నైపుణ్యాలను ప్రదర్శించడానికే ప్రాధాన్యత ఇవ్వాలని జట్టుకు సూచించినట్లు ఆయన తెలిపారు.
“ప్రపంచకప్లో ఆడటం అనేది ప్రతి ఆటగాడి కల. ఫలితం ఎలా ఉన్నా సరే.. మైదానంలోకి వెళ్లి మ్యాచ్ను ఆస్వాదించండి, మీ ప్రతిభను స్వేచ్ఛగా ప్రదర్శిస్తూ దూకుడుగా క్రికెట్ ఆడండి అని నా ఆటగాళ్లకు చెప్పాను” అని వహాబ్ రియాజ్ పేర్కొన్నారు.
ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్ జట్టు.. సాంప్రదాయ ప్రత్యర్థి భారత్, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ మరియు బంగ్లాదేశ్లతో కలిసి ఒకే పూల్లో ఉంది. గ్రూప్ దశ ఎంత కఠినంగా ఉన్నప్పటికీ, తమ ప్రాథమిక లక్ష్యం సెమీఫైనల్స్ బెర్తును ఖరారు చేసుకోవడమేనని వహాబ్ స్పష్టం చేశారు.
ఇటీవలి కాలంలో పాకిస్తాన్ మహిళల జట్టు వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతోంది. అయితే, ఈ ఓటములు తమకు ప్రపంచకప్ ముందస్తు సన్నాహకంగా బాగా ఉపయోగపడ్డాయని కోచ్ అభిప్రాయపడ్డారు.
“ఇటీవలి ఫలితాలు మాకు అనుకూలంగా రాకపోయినప్పటికీ.. ఐర్లాండ్ పర్యటన, అలాగే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్లు ఆడటం వల్ల మా ప్లేయర్లకు మంచి ఎక్స్పోజర్ లభించింది. ఇక్కడి వాతావరణం, పిచ్లు పాకిస్తాన్తో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి. కానీ, ఆ వ్యత్యాసాల గురించి ఆందోళన చెందకుండా తమ సహజమైన ఆటను ఆడాలని జట్టుకు స్పష్టం చేశాం” అని వహాబ్ వివరించారు.
ట్వంటీ-20 ఫార్మాట్లో ముందే ఏదీ అంచనా వేయలేమని, మ్యాచ్ ఏ క్షణంలోనైనా మలుపు తిరగొచ్చని ఆయన గుర్తుచేశారు. “టీ20 క్రికెట్లో ఏ ఫలితమైనా సాధ్యమే. మేము గెలవగలమనే బలమైన నమ్మకంతోనే ప్రతి గ్రూప్ మ్యాచ్లో బరిలోకి దిగుతాం. మా జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు ప్రతిభావంతులైన యువ ఆటగాళ్ల మంచి కాంబినేషన్ ఉంది. వరల్డ్ కప్లో రాణించాలంటే ప్రత్యర్థి ఎవరనేది పక్కనబెట్టి, మన సామర్థ్యంపై మనకు నమ్మకం ఉండాలి” అని వహాబ్ ధీమా వ్యక్తం చేశారు.
పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ చేరుకున్నప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు. ఐర్లాండ్లో జరిగిన త్రైపాక్షిక సిరీస్లో ఐర్లాండ్, వెస్టిండీస్ చేతిలో ఓడిపోగా.. ఆ తర్వాత జరిగిన అధికారిక వార్మప్ మ్యాచ్లలో శ్రీలంక, స్కాట్లాండ్ చేతుల్లోనూ పరాజయం పాలైంది. అయినప్పటికీ, ఇంగ్లాండ్లోని పిచ్లు తమ బలానికి సరిపోతాయని వహాబ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్ వాతావరణంలో ఇక్కడి పిచ్లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయని, తమ జట్టులోని ప్రధాన బలం స్పిన్ బౌలింగేనని ఆయన ముగించారు. పాకిస్తాన్ మహిళల జట్టు తన తొలి మ్యాచ్లో జూన్ 14 (ఆదివారం) న బర్మింగ్హామ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి భారత్తో తలపడనుంది.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
Jun 12, 2026 12:23 PM IST













