Last Updated:
హైదరాబాద్లో ఉంటున్నారా? అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఇక ఉదయం 6 గంటలకే ప్రారంభం అవుతుంది.
భాగ్యనగర అందాలను తనివితీరా ఆస్వాదించాలంటే తెల్లవారుజామునే వెళ్లాలి. ఈ మాటను నిజం చేస్తూ పురావస్తు శాఖ (ASI) ఒక అద్భుతమైన శుభవార్త చెప్పింది. ఇప్పటిదాకా ట్రాఫిక్ తో, ఎండలతో ఇబ్బంది పడుతూ చార్మినార్, గోల్కొండ కోటను సందర్శించిన వారికి ఇకపై ఆ కష్టాలు తీరనున్నాయి. దేశంలోని ఇతర చారిత్రక కట్టడాల తరహాలోనే హైదరాబాద్లోని ఈ రెండు ప్రసిద్ధ కట్టడాలు రోజూ ఉదయం 6 గంటలకే సందర్శకులకు స్వాగతం పలకనున్నాయి. ముందుగా 9 గంటలకు తెరిచే ఈ కట్టడాలను ఇకపై త్వరగా తెరవనున్నారు.
సియాసాత్ డెలీ కథనం ప్రకారం.. సాధారణంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడిచే తాజ్ మహల్ లాంటి కట్టడాలు సూర్యోదయంతో పాటే తెరుచుకుంటాయి. కానీ, హైదరాబాద్ లోని చార్మినార్, గోల్కొండ కోట మాత్రం ఉదయం 9 గంటలకు తెరుచుకునేవి. కోవిడ్ సమయంలో గోల్కొండ కోటను ఉదయం 7 గంటలకే తెరిచినా, తర్వాత ఆ విధానాన్ని నిలిపివేశారు. ఇప్పుడు పర్యాటకుల రద్దీని తగ్గించే ఉద్దేశంతో, దేశవ్యాప్త నిబంధనలను అమలు చేస్తూ ఉదయం 6 గంటలకే గేట్లు తెరుస్తున్నారు. ఎండల తీవ్రత పెరిగేలోపే ప్రశాంతంగా ఈ కట్టడాలను చూసి రావడానికి ఇది అద్భుతమైన అవకాశం.
అయితే, చార్మినార్ కు వెళ్లే సందర్శకులు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కేవలం గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రమే సందర్శనకు అనుమతిస్తారు. భద్రతా కారణాలు, సిబ్బంది కొరత కారణంగా పై అంతస్తులోకి వెళ్లే గేట్లను 9 గంటల తర్వాతే తెరుస్తారు. ఉదయం పూట తక్కువ మంది సిబ్బంది ఉంటారు కాబట్టి, పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పైకి అనుమతించడం లేదని అధికారులు స్పష్టం చేశారు. 9 గంటల తర్వాత టికెట్ తీసుకుని యథావిధిగా మొదటి అంతస్తుకు వెళ్లవచ్చు.
హైదరాబాద్ లో కేవలం చార్మినార్, గోల్కొండ కోట మాత్రమే ఏఎస్ఐ పరిధిలో ఉన్నాయి. చౌమొహల్లా ప్యాలెస్, నిజాం మ్యూజియం ప్రైవేట్ యాజమాన్యంలో ఉండగా, కుతుబ్ షాహీ టూంబ్స్, బ్రిటిష్ రెసిడెన్సీ తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఇవన్నీ ఉదయం 10 గంటల తర్వాతే పర్యాటకులకు అందుబాటులో ఉంటున్నాయి. వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ కట్టడాలను కూడా ఉదయం పూట త్వరగా తెరిస్తే బాగుంటుందని చరిత్రకారులు, పర్యాటకులు ఎప్పటినుంచో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి ఇలాంటి నిర్ణయాలు మేలు చేస్తాయి.
ఇక ఉదయాన్నే పాతబస్తీ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం 11 గంటల వరకు దుకాణాలు మూసి ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ రద్దీ అస్సలు ఉండదు. ఉదయం 4:30 గంటలకే తెరుచుకునే ప్రసిద్ధ నిమ్రా కేఫ్ లో ఛాయ్ తాగుతూ చార్మినార్ అందాలను వీక్షించడం ఒక మధురానుభూతి. వారాంతాల్లో ఉదయాన్నే పాతబస్తీకి వెళ్లి సంప్రదాయ బ్రేక్ ఫాస్ట్ ఆస్వాదించే వారందరికీ తాజా నిర్ణయం ఎంతో సంతోషాన్నిస్తుంది. గోల్కొండ కోటను సైతం ఉదయాన్నే సందర్శిస్తే ట్రాఫిక్ కష్టాలు లేకుండా, చల్లని వాతావరణంలో కుటుంబంతో ఆనందంగా గడపవచ్చు.
Hyderabad,Hyderabad,Telangana













