Last Updated:
టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ రాజీనామా నిర్ణయం వెనుక రోహిత్ శర్మ వ్యవహారమే ప్రధాన కారణమని తెలుస్తోంది. రోహిత్ను తప్పించాలన్న అగార్కర్ నిర్ణయాన్ని బీసీసీఐ పెద్దలు అడ్డుకోవడం, వీవీఎస్ లక్ష్మణ్తో విభేదాలు ఆయన నిష్క్రమణకు దారితీశాయని సమాచారం.
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి అజిత్ అగార్కర్ తప్పుకోవడానికి గల సంచలన కారణాలు వెలుగులోకి వచ్చాయి. 2027 వన్డే ప్రపంచకప్ సమయానికి రోహిత్ శర్మ వయసు 40 ఏళ్లకు చేరుకుంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇంగ్లండ్తో వన్డే సిరీస్ తర్వాత రోహిత్ను పక్కనబెట్టి, యశస్వి జైస్వాల్ను భవిష్యత్తు కోసం సిద్ధం చేయాలని అగార్కర్ భావించాడు. ఈ విషయాన్ని రోహిత్కు చెప్పే బాధ్యతను ప్రజ్ఞాన్ ఓజాకు అప్పగించాడు. అయితే ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రోహిత్, ఒక అగ్రశ్రేణి బీసీసీఐ అధికారిని ఆశ్రయించాడు.
దీంతో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అనూహ్యంగా స్పందిస్తూ రోహిత్ శర్మ వన్డే జట్టులో రెగ్యులర్ సభ్యుడని బహిరంగంగా ప్రకటించాడు. లార్డ్స్ వన్డే అతనికి ఆఖరిది కాదని తేల్చిచెప్పాడు. బోర్డు పెద్దల తీరుతో అగార్కర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. స్టార్ ఆటగాళ్లపై నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తనకు లేదని గ్రహించే ఆయన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.
రోహిత్ వివాదంతో పాటు ఎన్సీఏ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్తో తలెత్తిన విభేదాలు కూడా అగార్కర్ నిర్ణయంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆసియా క్రీడలకు ప్రధాన జట్టును పంపే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గాయపడిన ఆటగాళ్ల ఫిట్నెస్ నివేదికల విషయంలో సెలెక్షన్ కమిటీకి లక్ష్మణ్ సహకరించలేదని వార్తలు వస్తున్నాయి.
ఇండియా-ఎ టూర్లు, ఇరానీ కప్ లాంటి దేశవాళీ టోర్నీల షెడ్యూలింగ్ విషయంలోనూ అగార్కర్, లక్ష్మణ్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. బోర్డు నుంచి సరైన మద్దతు లేకపోవడం, ఎన్సీఏతో సమన్వయ లోపం కారణంగానే అగార్కర్ రాజీనామాకు మొగ్గుచూపినట్లు క్రీడా వర్గాల్లో బలమైన చర్చ నడుస్తోంది.














