Last Updated:
అమెరికాలో భారతీయులపై దాడులు, హత్యలు జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్న వేళ మరో విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణకు చెందిన యువ విద్యార్థి కుంచ అన్షుల్ (28) అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు.
అమెరికాలో భారతీయులపై దాడులు, హత్యలు జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్న వేళ మరో విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణకు చెందిన యువ విద్యార్థి కుంచ అన్షుల్ (28) అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన అతడు తన చదువు ఖర్చులను భరించేందుకు పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది.
మెడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి మండలానికి చెందిన అన్షుల్ అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియాలో ఉన్న టెంపుల్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నాడు. చదువుతో పాటు ఆర్థిక అవసరాల కోసం పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, జూన్ 6 అర్ధరాత్రి సమయంలో అన్షుల్కు ఉత్తర ఫిలడెల్ఫియాలోని ఎడ్జ్లీ స్ట్రీట్ ప్రాంతంలో ఉన్న రేమండ్ రోసెన్ హోమ్స్ సముదాయానికి పిజ్జా డెలివరీ చేయాల్సి వచ్చింది. ఆర్డర్ ప్రకారం మూడు పిజ్జా బాక్సులను అందజేసి బయటకు వచ్చిన కొద్ది క్షణాల్లోనే గుర్తుతెలియని దుండగులు అతడిపై కాల్పులు జరిపారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మూడు తూటాల ఖాళీ గుళ్లను స్వాధీనం చేసుకున్నారు. అన్షుల్ తల వెనుక భాగంలో తుపాకీ గాయం ఉండటంతో అతడిని అత్యంత సమీపం నుంచి కాల్చి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన అన్షుల్ను వెంటనే టెంపుల్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. అందులో అన్షుల్ను ఇద్దరు వ్యక్తులు వెంబడిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. వారిలో ఒకరు బ్యాక్ప్యాక్ ధరించి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. డెలివరీ కోసం ఉపయోగించిన ఫోన్ నంబర్, ఆర్డర్ వివరాల ఆధారంగా కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
అన్షుల్ మృతివార్త అతని కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలనే కలలతో అమెరికా వెళ్లిన కుమారుడు ఇలా దారుణంగా హత్యకు గురికావడం కుటుంబ సభ్యులను కుంగదీసింది. ఈ ఘటనపై స్పందించిన అన్షుల్ సోదరి, గతంలో కూడా తన సోదరుడు దోపిడీకి గురయ్యాడని గుర్తుచేశారు. ఈ హత్య వెనుక ముందస్తు ప్రణాళిక ఉండి ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
నిందితులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆమె అమెరికా అధికారులను కోరారు. అలాగే అన్షుల్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అవసరమైన సహాయాన్ని అందించాలని అమెరికాలోని భారత కాన్సులేట్ను విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటన అమెరికాలో భారతీయ విద్యార్థుల భద్రతపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. గత కొంతకాలంగా అమెరికాలో భారతీయ విద్యార్థులు, యువకులపై దాడులు, అనుమానాస్పద మరణాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో తాజా ఘటన ఆందోళనలను మరింత పెంచుతోంది. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
Hyderabad,Telangana













