తిరుమలలో భక్తుల పోటెత్తిన రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఏకంగా 24 గంటల నిరీక్షణ..! Tirumala temple crowd | | ACTPnews

News18


Last Updated:

తిరుమలలో భక్తుల భారీ రద్దీ, సర్వదర్శనానికి దాదాపు 24 గంటల వేచి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోగా టీటీడీ ఆహారం, నీరు, ఉచిత బస్సులు, భద్రతా ఏర్పాట్లు బలోపేతం చేసింది

+

News18

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వారాంతపు సెలవులు, వేసవి సెలవుల చివరి దశ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటుండటంతో శ్రీవారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోగా, క్యూ లైన్లు ఔటర్ రింగ్ రోడ్డులోని అక్టోపస్ భవనం వరకు విస్తరించాయి. దీంతో సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోందని సమాచారం.

శ్రీ‌వారి మెట్టు, అలిపిరి న‌డ‌క మార్గాల ద్వారా కూడా భారీ సంఖ్యలో భక్తులు కొండపైకి చేరుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాకపోకలు కొనసాగుతుండటంతో తిరుమల అంతా భక్తి సంద్రంలా మారింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపల ఉన్న అన్ని క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం సర్వదర్శనం భక్తులను క్యూ లైన్లలోకి పరిమితంగా అనుమతిస్తున్నామని, భక్తులు ముందస్తు ప్రణాళికతో రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయం, తిరుమలలోని అన్నప్రసాద కేంద్రాలు, నారాయణగిరి ఉద్యానవనాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో భక్తులకు నిరంతరం ఆహారం, తాగునీరు, పాలు అందజేస్తున్నారు. క్యూ లైన్లలో వేచి ఉన్న చిన్నారులు, వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

శ్రీవారి సేవకులు, అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాల సిబ్బంది సమన్వయంతో సేవలు అందిస్తున్నారు. శిలాతోరణం, బాటగంగమ్మ ఆలయం పరిసరాలు, క్యూ లైన్ల వెంట భక్తులకు అన్నప్రసాదాలు, మంచినీరు అందుబాటులో ఉంచారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తుల రవాణా సౌకర్యం కోసం అక్టోపస్ భవనం నుంచి శిలాతోరణం వరకు ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. ప్రతి కొన్ని నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంతో క్యూ లైన్లలో ఉన్న భక్తులు కొంత ఉపశమనం పొందుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని కూడా మోహరించారు.

ఇక భద్రతా పరంగా కూడా టీటీడీ అప్రమత్తమైంది. క్యూ లైన్లలో ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా విజిలెన్స్, పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఒక్క వెంగమాంబ అన్నప్రసాద సముదాయం నుంచే వేలాదిమంది భక్తులకు భోజన సదుపాయం కల్పించగా, క్యూ లైన్లలో వేచి ఉన్న దాదాపు 50 వేల మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తుల రద్దీ మరికొన్ని రోజులు కొనసాగనున్న నేపథ్యంలో తిరుమలకు వచ్చే వారు దర్శన సమయాలను ముందుగానే తెలుసుకుని ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports