Last Updated:
US-Iran War: ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తనను గనుక హతమార్చేందుకు టెహ్రాన్ (ఇరాన్ ప్రభుత్వం) ప్రయత్నిస్తే, ఆ దేశాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు ‘1000 క్షిపణులు లక్ష్యంగా గురిపెట్టి సిద్ధంగా ఉన్నాయి’ అని హెచ్చరించారు. అంతేకాదు అవసరమైతే వాటి వెనుకే వేల క్షిపణులు దూసుకెళ్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిని.. అంటే నన్ను.. ప్రపంచంలో ఎక్కడైనా సరే హతమార్చడానికి లేదా ఆ ప్రయత్నం చేయడానికి ఇరాన్ ప్రభుత్వం పూనుకుంటే, దానికి తగిన శాస్తి జరుగుతుంది. ప్రస్తుతం 1000 క్షిపణులు ఇరాన్ వైపు గురిపెట్టి, ప్రయోగానికి సిద్ధంగా ఉంచాం. అవసరమైతే వెనువెంటనే మరికొన్ని వేల క్షిపణులు రంగంలోకి దిగుతాయి,” అని పేర్కొన్నారు.
ఒకవేళ తనపై దాడి లేదా హత్యాయత్నం జరిగితే ఇరాన్పై వెంటనే ప్రతీకార చర్యలు చేపట్టాలని అమెరికా సైన్యానికి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. “నేను ఇప్పటికే ఆర్డర్స్ ఇచ్చేశాను. ఒక సంవత్సరం పాటు (అవసరమైతే పొడిగించేలా) ఇరాన్లోని అన్ని ప్రాంతాలను పూర్తిగా నాశనం చేయడానికి, నామరూపాలు లేకుండా చేయడానికి యూఎస్ మిలిటరీ పూర్తి సంసిద్ధతతో ఉంది,” అని ట్రంప్ స్పష్టం చేశారు.
ట్రంప్ను హతమార్చేందుకు ఇరాన్ సరికొత్త కుట్ర పన్నుతోందంటూ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాలు వాషింగ్టన్ను అప్రమత్తం చేసిన మరుసటి రోజే ట్రంప్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనం ప్రకారం.. ఇరాన్ ప్లాన్ చేస్తున్న ఈ రహస్య హత్యాయత్నం తాలూకు నివేదికను ఇజ్రాయెల్ అమెరికాకు షేర్ చేసింది. గత కొన్ని వారాలుగా ట్రంప్కు ఉన్న ముప్పుపై అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సమాచారం అందుతున్నప్పటికీ, నిర్దిష్టమైన ప్లాన్ను ఎత్తిచూపుతూ హెచ్చరించడం మాత్రం ఇదే మొదటిసారి అని సీఎన్ఎన్ (CNN) నివేదించింది.
ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కోరిక మేరకు చర్చలు కొనసాగించడానికి అమెరికా అంగీకరించిందని ట్రంప్ తెలిపారు. అయితే, ఇరు పక్షాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ (Cease Fire) మాత్రం ముగిసిపోయిందని ఆయన స్పష్టం చేశారు. “మళ్లీ చర్చలు జరుపుదామని ఇరాన్ కోరింది. అందుకు మేము ఓకే చెప్పాం. కానీ ‘కాల్పుల విరమణ’ ముగిసిపోయిందనే విషయాన్ని ఎలాంటి సందేహాలు లేకుండా అమెరికా వారికి స్పష్టంగా తేల్చి చెప్పింది,” అని శుక్రవారం నాటి పోస్ట్లో పేర్కొన్నారు.
గత మూడు వారాల క్రితమే వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ, రెండు రోజులుగా మళ్లీ పరస్పర దాడులు జరగడంతో ప్రాంతీయంగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తతల మధ్యే వచ్చే వారం స్విట్జర్లాండ్లో అమెరికా-ఇరాన్ మధ్య సరికొత్త అణు చర్చలు జరిగే అవకాశం ఉందని ‘ఆక్సియోస్’ (Axios) నివేదిక వెల్లడించింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














