Last Updated:
Vietnam Boat Accident: వియత్నాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన టూరిస్టులతో ప్రయాణిస్తున్న ఒక బోటు ప్రమాదానికి గురైంది. అక్కడి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ‘ఫు క్వాక్’ (Phu Quoc) ద్వీపం సమీపంలో మునిగిపోయింది.
వియత్నాం పర్యటనకు వెళ్లిన భారతీయ పర్యాటకులకు ఊహించని విషాదం ఎదురైంది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ‘ఫూ క్వాక్’ ద్వీపం సమీపంలో టూరిస్టులతో ప్రయాణిస్తున్న ఒక స్పీడ్ బోటు సముద్రంలో ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది.
ఒక ప్రముఖ మొబైల్ కంపెనీ భారతదేశం నలుమూలల నుంచి తమ డిస్ట్రిబ్యూటర్లను, వారి కుటుంబ సభ్యులను వియత్నాం ట్రిప్కు తీసుకెళ్లింది. మొత్తం 250 మంది ఈ విహార యాత్రకు వెళ్లగా.. వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 35 మంది, తెలంగాణ నుంచి 40 మంది ఉన్నారు. ట్రిప్లో భాగంగా వీరంతా మూడు పడవల్లో సముద్ర విహారానికి వెళ్లారు.
మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ‘హాన్ మే రుట్’ నుంచి ‘అన్థోయ్ పోర్టు’కు 32 మంది భారతీయులు, నలుగురు సిబ్బందితో ఒక స్పీడ్ బోట్ బయలుదేరింది. అయితే, ఆ పడవ తీరానికి కేవలం 400 మీటర్ల దూరంలో ఉండగా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా సముద్రంలో ఒక్కసారిగా తలకిందులైంది.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్, మచిలీపట్నంకు చెందిన జయశ్రీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కాగా, కడపకే చెందిన మరో డిస్ట్రిబ్యూటర్ నయీం ప్రమాద సమయంలో ఒడ్డునే ఉండటంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
🚨 BREAKING: TOURIST SPEEDBOAT SINKS OFF PHU QUOC
A speedboat carrying 32 Indian tourists sank near Hon May Rut Ngoai, Phu Quoc, at around 10:30 a.m. on July 11.
🛟 18 people had been rescued by early afternoon.
⚠️ Authorities say fatalities are feared, but the official death… pic.twitter.com/rTkrbZ6GQp
— NGO-SUGAR (@ngosugartp) July 11, 2026
ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలో ఉన్న ఇతర పర్యాటక బోట్ల నిర్వాహకులు స్పందించి రెస్క్యూ చర్యలు చేపట్టారు. అయితే బోటు పూర్తిగా తలకిందులు కావడం, సముద్రంలో అలల ఉధృతి అత్యంత తీవ్రంగా ఉండటంతో టూరిస్టులను కాపాడటం రెస్క్యూ సిబ్బందికి చాలా కష్టంగా మారింది. ప్రమాదంలో చిక్కుకున్న కొందరిని సురక్షితంగా రక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరికొందరు నీటిలో గల్లంతవడంతో వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఈ ఘోర ప్రమాదంపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) అత్యవసరంగా స్పందించింది. స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం, తగిన సహాయం అందించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.
బాధితుల కుటుంబ సభ్యులు లేదా సమాచారం తెలుసుకోవాలనుకునే వారు కింద పేర్కొన్న నంబర్లలో సంప్రదించవచ్చు:
హో చి మిన్ సిటీ కంట్రోల్ రూమ్: +84 36 281 7930, +84 91 552 37 14, +84 33 452 0414
హనోయి కంట్రోల్ రూమ్: +84 91 308 9165
భారతీయ పర్యాటకులకు ఎలాంటి సహాయం కావాలన్నా, లేదా వారి పరిస్థితి గురించి ఏవైనా ప్రశ్నలు ఉన్నా తాము పూర్తి అందుబాటులో ఉంటామని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఘటన స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ వేగంగా కొనసాగుతోంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














