విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అభిషేక్ బెనర్జీపై దాడికి సంబంధించి అరెస్టు అయిన నిందితులలో కనీసం నలుగురు ఒకప్పుడు మాజీ టీఎంసీ ఎమ్మెల్యే అరుంధతి మైత్రా (లవ్లీ మైత్రా)కు సన్నిహితులుగా ఉండేవారని తెలిసింది. వీరిని తపన్ మైతి, నిర్మల్య సేన్గుప్తా అలియాస్ జాయ్, కాజల్ దాస్, దేబాశిష్ దత్తా గా గుర్తించారు. అభిషేక్ బెనర్జీపై దాడికి సంబంధించి పోలీసులు ఈ నలుగురినీ అరెస్టు చేశారు.
ఇదిలా ఉండగా, ఈ ఘటనకు సంబంధించి అరెస్టు అయిన మరో నిందితుడు ఆకాష్ గయెన్, ఆ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తగా ఫేమస్ అయ్యాడు. అతని తల్లి, అతను పార్టీతో అనుబంధం కలిగి ఉన్నాడని అంగీకరించింది. ఎన్నికల సమయంలో అతను క్రమం తప్పకుండా టీఎంసీ బూత్లలో కూర్చునేవాడని తెలిపింది. అభిషేక్ బెనర్జీపై తన కుమారుడికి పగ పెంచుకోవడానికి ఎలాంటి కారణం లేదని ఆమె చెప్పింది.
ఆకాష్ తల్లి చెప్పిన ప్రకారం, శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సంఘటన తర్వాత ఆకాష్ యధావిధిగా ఇంటికి తిరిగి వచ్చి, ఆ తర్వాత సమీపంలోని మైదానంలో ఫుట్బాల్ ఆడటానికి వెళ్ళాడు. అదే రోజు రాత్రి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని ఆమె చెప్పింది. అతని అరెస్టు వెనుక ఉన్న కచ్చితమైన కారణాన్ని తమ కుటుంబానికి తెలియజేయలేదని ఆకాష్ తల్లి తెలిపింది. ఆకాష్ తండ్రి.. రిక్షా వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తుండగా, ఆకాష్ స్వయంగా నిరుద్యోగి.
బెంగాల్లో ఎన్నికల తర్వాత హింసాకాండ బాధితులను పరామర్శించడానికి అభిషేక్ బెనర్జీ వెళ్లిన దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సోనార్పూర్లో శనివారం ఈ సంఘటన జరిగింది. రిపోర్టుల ప్రకారం, ఈ పర్యటన సందర్భంగా అభిషేక్ బెనర్జీపై ఒక మూక.. దాడి చేయడంతో, రాష్ట్రంలో ఇది ఒక పెద్ద రాజకీయ వివాదానికి దారితీసింది. తృణమూల్ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఈ దాడికి రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించాయి.
ఈ రాజకీయ సంబంధాలకు, దాడితో ప్రత్యక్ష సంబంధం ఉందా లేదా ఇది కేవలం యాదృచ్ఛికమా అని దర్యాప్తు సంస్థలు ఇప్పుడు విచారిస్తున్నాయి. పోలీసులు ప్రస్తుతం ఎలాంటి నిర్ధారణలకూ రాకుండా, ఈ మొత్తం ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
ఈలోగా, అభిషేక్ బెనర్జీ ‘X’ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక సుదీర్ఘ పోస్టులో స్పందించారు. ఆయన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. తన పోస్టులో, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, దేశ సంస్థలను పరిరక్షించడానికి తన పోరాటాన్ని కొనసాగిస్తానని అభిషేక్ బెనర్జీ అన్నారు. గత సంవత్సరం ఆపరేషన్ సింధూర్ కింద అఖిలపక్ష ప్రతినిధి బృందంలో భాగంగా తాను ఐదు దేశాల్లో పర్యటించి, భారతదేశ వైఖరిని బలంగా వినిపించానని అభిషేక్ రాశారు. నేడు తాను రాజకీయ హింసకు, ‘ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదానికి’ బాధితుడినయ్యానని ఆయన అన్నారు.
బీజేపీపై ప్రత్యక్ష లక్ష్యం:
టీఎంసీ ఎంపీ తన పోస్ట్లో భారతీయ జనతా పార్టీని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. బీజేపీకి మద్దతు ఇచ్చేవారిని దేశభక్తులుగా ముద్ర వేస్తుండగా, ప్రశ్నలు లేవనెత్తేవారిని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తన సూత్రాలతో రాజీపడటం కంటే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఒత్తిడి, బెదిరింపులను ఎదుర్కోవడానికే తాను ఇష్టపడతానని ఆయన అన్నారు. తన సందేశంలో అభిషేక్ బెనర్జీ, అధికారం తాత్కాలికమైనదనీ, ప్రజల సంకల్పం శాశ్వతమైనదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచి, సమాజాన్ని విభజించే శక్తులకు వ్యతిరేకంగా తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా, దాడి వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. పోలీసులు అరెస్టు చేసిన అనుమానితులను ప్రశ్నిస్తూ, వారి రాజకీయ, సామాజిక, వ్యక్తిగత సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కొత్త విషయం వెలుగులోకి రావడంతో కేసు మరింత సున్నితంగా మారింది, రాబోయే రోజుల్లో ఈ దర్యాప్తు మరిన్ని ముఖ్యమైన వాస్తవాలను వెల్లడించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో, సీనియర్ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై దాడి ఆరోపణలతో ఒక కేసు వెలుగులోకి వచ్చింది. నివేదికల ప్రకారం, తన పార్టీ కార్యకర్తలను విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించేందుకు కళ్యాణ్ బెనర్జీ పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఈ సమయంలో అక్కడున్న జనం ఆయనను తోయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది.
ఈ దాడికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కారణమని కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. తనపై జరిగిన దాడిని బీజేపీ మద్దతుదారులే చేయించారని ఆయన ఆరోపించారు. ఈ విషయం ప్రస్తుతం దర్యాప్తులో ఉంది, పోలీసులు సంఘటనా స్థలంలోని వీడియో ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు.










