Last Updated:
Hyderabad: ‘అమ్మ’ అనే పదం ప్రేమానురాగాలకు నిలువెత్తు రూపం. నవమాసాలు మోసి, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతల్లే ఆమె పాలిట మృత్యువైంది.
తల్లి ఏం చేస్తోందో, ఎందుకు చేస్తోందో కూడా తెలియని ముక్కుపచ్చలారని తొమ్మిది నెలల పసిపాపను చెరువు నీటిలో ముంచి దారుణంగా హత్య చేసిన హృదయవిదారక సంఘటన రాజధాని నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్నపాపను బలితీసుకున్న ఆ కసాయి తల్లి నిర్వాకం స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలను, కలకలాన్ని రేపింది. ఈనాడు కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా చింతపల్లి మండలానికి చెందిన లోకసాని రవీందర్రెడ్డికి, కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన రాజేశ్వరితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వీరిద్దరూ ఎల్బీనగర్ సమీపంలోని ఇంజాపూర్ ప్రాంతంలో నివాసముంటున్నారు. రవీందర్రెడ్డి బాటసింగారంలోని పండ్ల మార్కెట్లో హమాలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ దంపతులకు తొమ్మిది నెలల వయసున్న ‘అనురాధ’ అనే పసిపాప ఉంది.
ఇంటి బాధ్యతలను నిర్వహించడంలో రాజేశ్వరి నిరంతరం అలసత్వం వహించేదని తెలుస్తోంది. తరచూ తొమ్మిది నెలల పాపను తీసుకుని ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయి, రెండు మూడు రోజుల వరకు తిరిగి వచ్చేది కాదు. ఈ విషయంలో దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో ఆదివారం నాడు రాజేశ్వరి పూటుగా కల్లు తాగి మత్తులో తూగుతూ తన తొమ్మిది నెలల కుమార్తె అనురాధను తీసుకుని బయటకు వచ్చింది. బైరామల్గూడ వద్ద ఉన్న చెరువు వద్దకు చేరుకున్న ఆమె, ఏమాత్రం కనికరం లేకుండా పసిపాపను నీటిలోకి తీసుకెళ్లి ముంచివేసింది. తల్లి చేతుల్లోనే ఆ పసికందు నీటిలో ఊపిరాడక విలవిలలాడుతూ ప్రాణాలు విడిచింది.
తల్లి విపరీత చేష్టలను, పాపను నీటిలో ముంచుతున్న దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే పరుగులు తీస్తూ వచ్చి ఆమెను అడ్డుకున్నారు. నిష్కారణంగా అమాయక పసిపాపను పొట్టనబెట్టుకున్న కసాయి తల్లి రాజేశ్వరికి అక్కడికక్కడే దేహశుద్ధి చేశారు. అనంతరం వెంటనే ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న తండ్రి రవీందర్రెడ్డి, నీటిలో శవమై తేలిన తన తొమ్మిది నెలల కుమార్తె అనురాధ మృతదేహాన్ని హత్తుకుని గుండెలు పగిలేలా కన్నీరుమున్నీరుగా రోదించిన తీరు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.
పోలీసులు నిందితురాలు రాజేశ్వరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పసిపాప మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మద్యం మత్తులోనే ఈ హత్యకు పాల్పడిందా లేదా దీని వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Hyderabad,Telangana














