Karnataka Politics: కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ.. సీఎం పదవికి సిద్ధ రామయ్య నేడు రాజీనామా చేయనున్నారా? | | ACTPnews

Karnataka Politics: కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ.. సీఎం పదవికి సిద్ధ రామయ్య నేడు రాజీనామా చేయనున్నారా? |


బుధవారం నుంచి కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు వేగంగా చోటుచేసుకోవడంతో రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. ముఖ్యంగా గురువారం ఉదయం సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన కీలక అల్పాహార సమావేశంపై అందరి దృష్టి నిలిచింది. ఈ సమావేశంలో సిద్ధరామయ్య తన భవిష్యత్ కార్యాచరణపై మంత్రులు, సీనియర్ నేతలకు స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇటీవల సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవడం రాజకీయ మార్పులపై ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, సిద్ధరామయ్యకు 2029 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన రాజ్యసభకు వెళ్లే అవకాశాలపై కూడా చర్చ సాగుతోంది.

అయితే నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం వస్తున్న సమాచారం అంతా పార్టీ వర్గాలు, రాజకీయ విశ్లేషకుల అంచనాల ఆధారంగానే ఉంది.

బుధవారం బెంగళూరులో సీఎం అధికార నివాసంలో కాంగ్రెస్ కర్ణాటక ఇన్‌చార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా, సిద్ధరామయ్యతో దాదాపు గంటపాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరోవైపు ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరే ముందు డీకే శివకుమార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు.

గురువారం ఉదయం 9 గంటలకు సీఎం అధికార నివాసం ‘కావೇರಿ’లో కీలక అల్పాహార సమావేశం జరగనుంది. రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, డీకే శివకుమార్ సహా పలువురు కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశముంది.

ఇక కాంగ్రెస్ చీఫ్ విప్ అశోక్ పట్టన్ మాట్లాడుతూ, గురువారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత సీఎం రాజీనామా చేసే అవకాశముందని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంపై అధికారిక సమాచారం అందలేదని తెలిపారు.

ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ కొత్త కేబినెట్ రూపకల్పనలో యువత, ప్రతిభావంతులు, కొత్త ముఖాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. అన్ని వర్గాలకు, ముఖ్యంగా దళితులు, ఓబీసీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పనితీరు సరిగా లేని మంత్రులను తప్పించే అవకాశమూ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ, అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, సీఎం మరియు డిప్యూటీ సీఎంకు తదుపరి చర్యలపై స్పష్టమైన సమాచారం ఇచ్చిందని తెలిపారు. సీఎం న్యాయ సలహాదారు ఏఎస్ పొన్నన్న కూడా రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వచ్చే సూచనలు ఉన్నాయని అంగీకరించారు.

అయితే ఈ పరిణామాలపై మీడియా, ప్రజలు ఊహాగానాలు చేయొద్దని రణదీప్ సూర్జేవాలా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే పార్టీ నిర్ణయాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

ఇక రాష్ట్ర మంత్రి సతీష్ జార్కిహొళి మాట్లాడుతూ, గురువారం ఉదయం జరిగే సమావేశం తర్వాతే అసలు పరిస్థితిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *