Last Updated:
ఆఫ్ఘనిస్తాన్తో జూన్ 6 నుంచి ప్రారంభమయ్యే ఏకైక టెస్టు కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులో అత్యంత హాట్ టాపిక్గా మారింది రిషబ్ పంత్ డిమోషన్. టీమ్ఇండియా భవిష్యత్ నాయకుల్లో ఒకడిగా భావించిన పంత్ను టెస్టు వైస్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ.. అనుభవజ్ఞుడు కేఎల్ రాహుల్కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయం ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.
Rishabh Pant: ఐపీఎల్ 2026 ముగియక ముందే భారత క్రికెట్లో మరో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్తో జూన్ 6 నుంచి ప్రారంభమయ్యే ఏకైక టెస్టు కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులో అత్యంత హాట్ టాపిక్గా మారింది రిషబ్ పంత్ డిమోషన్. టీమ్ఇండియా భవిష్యత్ నాయకుల్లో ఒకడిగా భావించిన పంత్ను టెస్టు వైస్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ.. అనుభవజ్ఞుడు కేఎల్ రాహుల్కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయం ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.
రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత భారత జట్టులో నాయకత్వ మార్పులు వేగంగా జరిగాయి. యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ను టెస్టు కెప్టెన్గా ఎంపిక చేసిన సెలెక్టర్లు.. అప్పట్లో రిషబ్ పంత్ను వైస్ కెప్టెన్గా నియమించారు. కానీ ఇప్పుడు కేవలం కొద్ది కాలంలోనే పంత్ నుంచి ఆ బాధ్యతలను తీసేసి, కేఎల్ రాహుల్కు అప్పగించడం గమనార్హం. జూన్ 6 నుంచి ముల్లన్పూర్ వేదికగా ప్రారంభమయ్యే ఈ టెస్టులో శుభ్మన్ గిల్ కెప్టెన్గా జట్టును నడిపించనున్నాడు. అతనికి డిప్యూటీగా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. ఈ మార్పుతో టీమ్ఇండియా మేనేజ్మెంట్ భవిష్యత్ నాయకత్వంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
రిషబ్ పంత్ను వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించడం ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదని తెలుస్తోంది. దీనికి పలు కారణాలు ఉన్నాయని బీసీసీఐ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కెప్టెన్సీ ఒత్తిడి అతని సహజమైన దూకుడు బ్యాటింగ్ను ప్రభావితం చేస్తోందనే అభిప్రాయం సెలెక్టర్లలో బలపడిందని సమాచారం. ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్గా పంత్ ప్రదర్శన తీవ్ర విమర్శలకు గురైంది. బ్యాటింగ్లోనూ అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. కీలక మ్యాచ్ల్లో తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రశ్నార్థకంగా మారాయి. దీంతో నాయకత్వ బాధ్యతల కంటే అతను పూర్తిగా బ్యాటింగ్పైనే దృష్టి పెట్టాలని బోర్డు భావించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. గతంలో దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్లో శుభ్మన్ గిల్ మైదానం వెలుపల ఉన్న సమయంలో పంత్ తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే ఆ సమయంలో అతని ఫీల్డ్ సెట్టింగ్స్, బౌలింగ్ మార్పులు టీమ్ మేనేజ్మెంట్ను పెద్దగా ఆకట్టుకోలేదని సమాచారం.
రిషబ్ పంత్ అంటే భారత అభిమానులకు వెంటనే గుర్తొచ్చేది గబ్బా హీరోయిక్స్. ఒంటరిగా మ్యాచ్ను తిప్పేసే దూకుడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడినప్పుడు పంత్ అత్యంత ప్రమాదకరమైన మ్యాచ్ విన్నర్గా మారతాడని బీసీసీఐ నమ్ముతోంది. అందుకే ఇప్పుడు అతనిపై ఉన్న నాయకత్వ భారం తగ్గించి, పూర్తిగా వికెట్ కీపర్-బ్యాటర్ పాత్రకే పరిమితం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ దిగ్గజాలు క్రమంగా టెస్టు జట్టుకు దూరమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు అనుభవజ్ఞుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో కేఎల్ రాహుల్ జట్టులో అత్యంత అనుభవం ఉన్న ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. రాహుల్ ఇప్పటికే భారత జట్టుకు మూడు టెస్టుల్లో కెప్టెన్గా వ్యవహరించాడు. 2022లో జోహన్నెస్బర్గ్లో దక్షిణాఫ్రికాపై భారత్ను నడిపించడంతో పాటు.. బంగ్లాదేశ్ పర్యటనలో కూడా నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. ప్రశాంత స్వభావం, క్లిష్ట పరిస్థితుల్లో స్థిరంగా ఆలోచించే తీరు అతనికి ప్లస్ పాయింట్గా మారాయి. అందుకే యువ కెప్టెన్ శుభ్మన్ గిల్కు సరైన సపోర్ట్గా రాహుల్ను సెలెక్టర్లు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
రిషబ్ పంత్కు ఎదురైన ఎదురుదెబ్బ కేవలం టెస్టులకే పరిమితం కాలేదు. అతను ఇప్పటికే టీ20 సెటప్కు దూరమయ్యాడు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న మూడు వన్డేల సిరీస్కు కూడా అతనికి చోటు దక్కలేదు. దీంతో మూడు ఫార్మాట్లలోనూ తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి పంత్ ఇప్పుడు భారీగా పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశీయ క్రికెట్, రాబోయే సిరీస్లలో తన బ్యాట్తోనే సమాధానం చెప్పాల్సిన ఒత్తిడి ఇప్పుడు పంత్పై స్పష్టంగా కనిపిస్తోంది.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













