Last Updated:
Trump Ultimatum to Iran: ట్రంప్ వార్నింగ్స్, ఇరాన్ కౌంటర్స్ కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాలు ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని చూస్తున్నారు. ఐతే.. మళ్లీ యుద్ధం జరిగితే, సంక్షోభం మరింత పెరిగే ప్రమాదం ఉంది.
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు కొత్త అల్టిమేటం జారీ చేశారు. రెండు మూడు రోజుల్లో శాంతి ఒప్పందానికి రాకపోతే కొత్త దాడులు తప్పవని హెచ్చరించారు. గల్ఫ్ దేశాల అభ్యర్థన మేరకు మంగళవారం జరగాల్సిన దాడిని వాయిదా వేశాననీ, ఇరాన్ దిగి రాకపోతే వారాంతంలో చర్యలు తప్పవని సంకేతాలిచ్చారు. ఈ అల్టిమేటంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఘాటుగా స్పందించారని సాక్షి రిపోర్ట్ చేసింది.
అరాగ్చి మాట్లాడుతూ, “మళ్లీ యుద్ధం జరిగితే అమెరికాను మామూలుగా దెబ్బతీయం. మరిన్ని సర్ప్రైజ్లు ఉంటాయి. అందుకు ఆ దేశం సిద్ధంగా ఉండాలి” అని హెచ్చరించారు. ఇరాన్ తొలిసారిగా అమెరికా F-35 జెట్ను కూల్చివేసిందని అరాగ్చి గుర్తుచేశారు. ఈ యుద్ధంలో అమెరికా కనీసం 42 సైనిక విమానాల్ని కోల్పోయిందని అన్నారు. ఈ యుద్ధం ద్వారా.. అమెరికాకి తీవ్ర నష్టం వాటిల్లిందని పెంటగాన్ అంచనాలు చెబుతున్నాయి. ఈ యుద్ధం అమెరికాకు ఇప్పటికే 29 బిలియన్ డాలర్ల ఖర్చు తెచ్చిందని నివేదికలు సూచిస్తున్నాయి.
ఫిబ్రవరి 28, 2026న “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ” పేరుతో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడులు ప్రారంభమయ్యాయి. బదులుగా ఇరాన్ మిత్రపక్షాల సాయంతో కౌంటర్ దాడులు చేసింది. ఏప్రిల్లో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరిగాయి. అయితే శాంతి చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఆ తర్వాత ఉద్రిక్తత కంటిన్యూ అవుతోంది.
ట్రంప్ ఇటీవల హర్ముజ్ జలసంధి పూర్తిగా తెరవాలనీ, లేదంటే ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలను ధ్వంసం చేస్తామని బెదిరించారు. “ఒక సంపూర్ణ నాగరికత ఈ రాత్రితో అంతమవుతుంది” అని కూడా హెచ్చరించినట్లు బీబీసీ, AP సంస్థల రిపోర్టులు తెలిపాయి. గల్ఫ్ దేశాల నాయకుల అభ్యర్థనతో దాడిని వాయిదా వేశానని ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. అయినా ఒప్పందం కుదరకపోతే పెద్ద ఎత్తున దాడులకు సిద్ధంగా ఉన్నట్లు సూచించారని యూరో న్యూస్ రిపోర్ట్ చేసింది.
ఇరాన్ స్పందనలో అధునాతన డ్రోన్ స్వార్మ్ దాడులు, దీర్ఘశ్రేణి మిసైల్ దాడులు, సైబర్ దాడులు, హర్ముజ్ జలసంధి అడ్డంకులు వంటి వ్యూహాలు ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్కి గతంలో అమెరికా MQ-9 డ్రోన్లపై, సౌదీలోని ఎయిర్బేస్పై క్షిపణి దాడులు చేసిన చరిత్ర ఉంది. సముద్ర మార్గాల అడ్డంకుల వల్ల ప్రపంచ చమురు మార్కెట్ తీవ్రంగా ప్రభావితమవుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ బెదిరింపులు.. యుద్ధ నేరాలకు దారి తీస్తాయని ఐక్య రాజ్య సమితి, పోప్ వంటి వారు విమర్శించినట్లు బీబీసీ రిపోర్టులు చెబుతున్నాయి.
ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ చెప్పినా, రెండు వైపులా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. హర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచంలోని 20% చమురు రవాణా జరుగుతుంది. ఇది మూసివేస్తే ప్రపంచ చమురు సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. ఇరాన్ నాయకులు అమెరికా శక్తి మూలాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ పరిస్థితులు పశ్చిమాసియాలో మరిన్ని సంక్షోభాలకు దారి తీయవచ్చని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ట్రంప్ బెదిరింపు వ్యూహం ఇరాన్ను మరింత బలంగా చేసే పరిస్థితి కనిపిస్తోంది.
ఈ ఘటనలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇరాన్ “సర్ప్రైజ్”లు ఏమిటో ఇంకా స్పష్టం కాకపోయినా, దాని సైనిక సామర్థ్యం, మిత్రపక్షాల నెట్వర్క్ దృష్ట్యా పరిస్థితి సంక్లిష్టంగా మారింది. రాబోయే రోజుల్లో చర్చల ఫలితాలు, దాడుల సాధ్యతలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తాయి.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
















