Last Updated:
ఆ సమయంలో కోహ్లీ ఈ యువ ఆటగాడి భుజంపై చేయి వేసి, కాసేపు ముచ్చటిస్తూ కొన్ని విలువైన సూచనలు ఇచ్చాడు. ఆ క్షణం తనకు ఒక కలలా అనిపించిందని, కోహ్లీ తనను ఒక చిన్న తమ్ముడిలా చూసుకున్నారని వైభవ్ గుర్తుచేసుకున్నాడు.
Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ స్టార్, ప్రస్తుతం భారత క్రికెట్లో సరికొత్త సంచలనంగా మారిన యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తాను ఒకప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీకి, అలాగే ఆ జట్టు రారాజు విరాట్ కోహ్లీకి ఎంత పెద్ద అభిమానినో వెల్లడించాడు. 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా ఒక మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీని కలిశాడు. ఆ సమయంలో కోహ్లీ ఈ యువ ఆటగాడి భుజంపై చేయి వేసి, కాసేపు ముచ్చటిస్తూ కొన్ని విలువైన సూచనలు ఇచ్చాడు. ఆ క్షణం తనకు ఒక కలలా అనిపించిందని, కోహ్లీ తనను ఒక చిన్న తమ్ముడిలా చూసుకున్నారని వైభవ్ గుర్తుచేసుకున్నాడు.
“నేను మీకు నిజం చెబుతాను. విరాట్ భయ్యా నా భుజంపై అలా చేయి వేసినప్పుడు.. నేను గతంలో ఆర్సీబీ అభిమానిని, ముఖ్యంగా విరాట్ కోహ్లీకి చాలా పెద్ద ఫ్యాన్ని. అలాంటిది ఆయన నా భుజంపై చేయి వేసి మాట్లాడుతుంటే, నిజంగా నాకు అదొక కలలా అనిపించింది. ఆయన నాతో మాట్లాడిన విధానం చూస్తే.. నిజంగానే విరాట్ కోహ్లీ నాతో మాట్లాడుతున్నారా అనిపించలేదు. ఒక పెద్ద అన్నయ్యలా ఆయన నాకు ఎన్నో విషయాలు అర్థమయ్యేలా చెప్పారు. నేను ఎక్కడ బాగా ఆడుతున్నానో, ఇంకా ఏ విషయాల్లో మెరుగుపడాలి, భవిష్యత్తులో దేనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి అనే విషయాలను ఎంతో చక్కగా వివరించారు” అని చెప్పుకొచ్చాడు.
ఈ సీజన్ సమయంలో వైభవ్ తన క్యాప్ (టోపీ) పై విరాట్ కోహ్లీతో ఆటోగ్రాఫ్ కూడా పెట్టించుకున్నాడు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకవేళ తన వద్ద ఆరెంజ్ క్యాప్ లేని సమయాల్లో, విరాట్ సంతకం చేసిన ఆ టోపీనే పెట్టుకునేవాడినని వైభవ్ తెలిపాడు.
ఐసీసీ ఛైర్మన్, బీసీసీఐ మాజీ సెక్రటరీ జై షాతో జరిగిన సంభాషణల గురించి కూడా వైభవ్ మాట్లాడాడు. జై షా ఎప్పుడు కలిసినా ఆటపైనే దృష్టి పెట్టాలని చెప్తారని అన్నాడు. “జై సర్ నన్ను ఎప్పుడు చూసినా పలకరిస్తారు, చాలా విషయాలు చెప్తారు. ఎప్పుడూ ఆటపైనే ఫోకస్ పెట్టాలని, ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని, ఎప్పుడూ ఒదిగి ఉంటూ (grounded) మన పనిని మనం చేసుకుంటూ పోవాలని సలహా ఇస్తారు” అని వైభవ్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ పరుగుల వరద పారించాడు. ఏకంగా 237.30 స్ట్రైక్ రేట్తో 776 పరుగులు చేసి ‘ఆరెంజ్ క్యాప్’తో పాటు ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ (MVP) అవార్డును కైవసం చేసుకున్నాడు. శనివారం ప్రకటించిన భారత సీనియర్ టి20 జట్టులో ఈ 15 ఏళ్ల కుర్రాడికి తొలిసారిగా చోటు దక్కింది. తద్వారా భారత జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













