Last Updated:
Warangal Politics: ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఉప్పు నిప్పుగా ఉండే సీనియర్ నేతలు ఆత్మీయంగా ఒకచోట చేరడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్ లో స్పెషల్ గా కొంతమంది నేతలకు డిన్నర్ ఏర్పాటు చేశారు. దీనికి మంత్రి కొండా సురేఖ కూడా అటెండ్ అయ్యారు.
Warangal Politics: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య నిన్నటి వరకు వర్గవిభేదాలు, ఆధిపత్యపోరుతో కుతకుతలాడుతూ ఉండేది. జిల్లాకు చెందిన మహిళా మంత్రి, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు సమన్వయ లోపం కారణంగా గత కొన్ని నెలలుగా ఒకరంటే మరొకరికి పడేది కాదు. గ్రూపు రాజకీయాల మాదిరిగానే బహిరంగంగానే నాయకులు, అనుచరులు ఘర్షణలకు దిగిన పరిస్థితులు ఉండేవి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య మధ్య తరచూ ఆధిపత్య పోరు పీక్స్లో ఉండేది.
అలాగే పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య వివాదం అప్పట్లో పార్టీలో తీవ్ర దుమారం లేపింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య ఆదిపత్య పోరు విభేదాలు తరచూ రాజకీయ వర్గాల్లో అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. ఈవిధంగా ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండ సురేఖ స్థానిక ఎమ్మెల్యేల మధ్య కొంతకాలంగా అంతర్గత విభేదాలు ఆధిపత్య పోరు కొనసాగుతుంది. గతంలో మంత్రిపై ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు.
అయితే ఇదంతా గతం ముచ్చట. ఇప్పుడు సీన్ మారిపోయింది. ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఉప్పు నిప్పుగా ఉండే సీనియర్ నేతలు ఆత్మీయంగా ఒకచోట చేరడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్ లో స్పెషల్గా కొంతమంది నేతలకు డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్ కు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మొదటిసారి నాయిని ఇంటికి రావడం ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యతను సంతించుకుంది.
మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, డిసిసి అధ్యక్షులు కూడ చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి,తాజా మాజీ మేయర్ గుండు సుధారాణితో పాటు తదితరులు ఈ విందులో పాల్గొన్నారు. ఇలా వీరంతా ఒక చోట చేరి ఆత్మీయంగా ఒకరినొకరు పలకరించుకుంటూ భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.
మంత్రి హోదాలో మొట్టమొదటిసారి కొండా సురేఖ నాయిని రాజేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే నేతలంతా ఈ సమావేశంలో ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ భేటీ అధికార కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకరంటే మరొకరికి గిట్టని వాళ్లంతా ఇలా ఒకచోట ఎందుకు కలిసి ఉంటారనే చర్చ జిల్లా ప్రజలతో పాటు నేతల అనుచరులకు కలుగుతోంది.
అయితే వీళ్ల సమావేశం, లంచ్ భేటీ వెనుక వ్యక్తిగత అవసరాలు ఏమి లేవని తెలుస్తోంది. రాబోయే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటేందుకు వుహాత్మకంగా ముందుకు వెళ్లాలని ఈ నేతలు భేటీ అయినట్లు తెలుస్తోంది. పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేసే భారీ విజయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని జిల్లా హస్తం నేతలు నిర్ణయించారు. ఈ భేటీపై మంత్రి కొండా సురేఖ వివరణ కూడా ఇచ్చారు. ఈ భేటీలో ఎలాంటి రాజకీయం లేదన్నారు. మా సోదరుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆహ్వానం మేరకు తన క్యాంపు కార్యాలయంలో కలిసామని చెప్పుకొచ్చారు. ఇందులో వరంగల్ జిల్లా అభివృద్ధిలో సమన్వయంతో ముందుకెళ్లాలని చర్చించినట్లు తెలిపారు.
అప్పట్లో నువ్వెంత అంటే నువ్వెంతా అనుకున్న నేతలు .. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద ఫ్యామిలీ అని అందులో నేతలంతా కుటుంబ సభ్యులమేనని మంత్రే స్వయంగా చెప్పారు. అంతే కాదు నేతల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను కుటుంబ సభ్యుల మధ్య వచ్చే చిన్నచిన్న మనస్పర్థలు, సమస్యలతో పోల్చారు. అలాంటివి ఫ్యామిలీలో సహజమని మ్యాటర్ని క్లోజ్ చేశారు. అంతే కాదు తమ పార్టీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు, భేషజాలు లేవని అంతా ఒకటేనని చెప్పారు కొండా సురేఖమ్మ. త్వరలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పార్టీ గెలుపే లక్ష్యంగా సమన్వయంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు.
పరస్పర విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలతో నిన్నటి వరకు కాకరేపిన కాంగ్రెస్ నాయకులు ఈవిధంగా కలిసిమెలిసి ఉండటం చూసి పార్టీ శ్రేణులు కూడా ఒకింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కొండ సురేఖ చెప్పిన మాటలో వరంగల్ కాంగ్రెస్ లో కలహాలకు శుభం కార్డు పడినట్లుగానే చూస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. త్వరలో జరగబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.
Warangal,Telangana












