Last Updated:
H1B Visa: అమెరికాలో స్థిరపడాలని లేదా అక్కడ ఉద్యోగ, విద్యా అవకాశాలు పొందాలని ఆశించే భారతీయులకు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
విదేశీ నిపుణులు, అంతర్జాతీయ విద్యార్థులు, వారిని నియమించుకునే కంపెనీలను లక్ష్యంగా చేసుకుని యూఎస్ వలస విధానంలో (US Immigration System) కీలక మార్పులను తీసుకురావడానికి ట్రంప్ పరిపాలనా యంత్రాంగం సరికొత్త నిబంధనలను సిద్ధం చేస్తోంది. అమెరికాలో అత్యధిక వలసదారుల సమూహాన్ని కలిగిన భారతీయులపై, ముఖ్యంగా హెచ్-1బీ (H-1B) వీసాదారులు, ఎల్-1 (L-1) వీసాలు, గ్రీన్ కార్డ్ ఆస్పిరెంట్లు, విద్యార్థులపై ఈ నిబంధనల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఆగస్టు 2026 నాటికి ఈ కొత్త ప్రతిపాదనలను డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) అధికారికంగా ప్రచురించవచ్చని తెలుస్తోంది. ఈ మార్పులలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి
భారతీయ ఐటీ మరియు కన్సల్టింగ్ కంపెనీలు ఎక్కువగా ఉపయోగించే థర్డ్-పార్టీ క్లయింట్ లొకేషన్ల (Third-party client sites) నమూనాపై నిఘా పెరగనుంది. కొత్త నిబంధనల ప్రకారం, సదరు ఉద్యోగి ఆ క్లయింట్ ప్లేస్లో అత్యంత నైపుణ్యంతో కూడిన ‘స్పెషలైజ్డ్’ పనులే చేస్తున్నారా లేదా అనేదానికి యాజమాన్యాలు బలమైన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, గతంలో ఎప్పుడైనా హెచ్-1బీ నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీల దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ (DOL) హెచ్-1బీ మరియు పీఈఆర్ఎమ్ (PERM) లేబర్ సర్టిఫికేషన్ ప్రక్రియలో కనీస వేతన శ్రేణిని మార్చాలని ప్రతిపాదించింది. దీని ప్రకారం, ఎంట్రీ-లెవెల్ ఉద్యోగుల కనీస వేతనాన్ని ప్రస్తుతమున్న 17వ పర్సంటైల్ నుండి ఏకంగా 34వ పర్సంటైల్కు పెంచనున్నారు. దీనివల్ల విదేశీ ఉద్యోగులను స్పాన్సర్ చేయాలనుకునే కంపెనీలపై ఆర్థిక భారం గణనీయంగా పెరుగుతుంది.
ఇప్పటివరకు పెద్ద కంపెనీలు ప్రాథమిక హెచ్-1బీ దరఖాస్తులు లేదా కంపెనీ మారే సమయంలో (Change of Employer) మాత్రమే సప్లిమెంటల్ ఫీజు చెల్లించాల్సి ఉండేది. కానీ ఇకపై వీసా ఎక్స్టెన్షన్ (పెంపు) దరఖాస్తులకు కూడా ఈ ఫీజు వర్తింపజేయనున్నారు. అమెరికాలో 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి, వారిలో సగం కంటే ఎక్కువ మంది హెచ్-1బీ లేదా ఎల్-1 వీసాలపై పనిచేస్తుంటే ఆ కంపెనీలకు ఈ అదనపు ఖర్చులు తప్పవు. ఇది ఔట్సోర్సింగ్ ఆధారిత భారతీయ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
హెచ్-1బీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు ఇచ్చే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ (EADs) ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ సిస్టమ్ను ఈ నెలలోనే ముగించాలని యోచిస్తున్నారు. ఒకవేళ వారి ఈఏడీ (EAD) ల్యాప్స్ లేదా రెన్యూవల్ ఆలస్యమైతే, వారు చట్టబద్ధంగా పనిచేసే అర్హతను తాత్కాలికంగా కోల్పోతారు. గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ కారణంగా ఏళ్ల తరబడి వేచి చూస్తున్న వేలాది మంది భారతీయ మహిళలపై దీని ప్రభావం పడనుంది.
అంతర్జాతీయ విద్యార్థులు తమ విద్యా కోర్సులు కొనసాగినంత కాలం అమెరికాలో ఉండేందుకు అనుమతించే ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ విధానాన్ని రద్దు చేయనున్నారు. దీని స్థానంలో విద్యార్థులు అమెరికాలో ఉండేందుకు నిర్దిష్ట కాల పరిమితిని (Fixed period of stay) మాత్రమే కేటాయించనున్నారు.
ఈ నిరంతర ఆంక్షలు, గ్రీన్ కార్డ్ లభించడంలో దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ మరియు ట్రంప్ ప్రభుత్వ కఠిన విధానాల కారణంగా విసుగు చెందిన చాలా మంది భారతీయ ప్రొఫెషనల్స్.. ఇప్పుడు స్థిరమైన, నమ్మకమైన వలస మార్గాలున్న బ్రిటన్ (UK) వంటి ప్రత్యామ్నాయ దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jul 10, 2026 12:46 PM IST














