Last Updated:
అమెరికాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతికి చెందిన పైలెట్ మృతి చెందాడు. పెళ్లయిన కాసేపటికే ఈ ఘటన జరగడం విషాదకరం.తన భార్య జెస్నీతో కలిసి హనీమూన్ ప్రయాణానికి బయలుదేరుతుండగా, వారు ప్రయాణిస్తున్న ‘రాబిన్సన్ ఆర్66’ (Robinson R66) హెలికాప్టర్ డాసన్విల్లేలోని వెడ్డింగ్ వెన్యూ సమీపంలోనే కూలిపోయింది.
Helicopter Crash: అమెరికాలో ఒకే రోజు జరిగిన పెళ్లి వేడుక అంతలోనే తీవ్రమైన అగ్నిప్రమాదం లాంటి విషాదం ఒక భారత సంతతి కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. కేరళ మూలాలున్న డెల్టా ఎయిర్ లైన్స్ (Delta Air Lines) పైలట్ ‘డేవ్ ఫిజీ’, తన వివాహం ముగిసిన కొన్ని గంటలకే జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. తన భార్య జెస్నీతో కలిసి హనీమూన్ ప్రయాణానికి బయలుదేరుతుండగా, వారు ప్రయాణిస్తున్న ‘రాబిన్సన్ ఆర్66’ (Robinson R66) హెలికాప్టర్ డాసన్విల్లేలోని వెడ్డింగ్ వెన్యూ సమీపంలోనే కూలిపోయింది.
ఈ ఘోర ప్రమాదంలో డేవ్ ఫిజీతో పాటు హెలికాప్టర్ నడుపుతున్న పైలట్ కూడా అక్కడికక్కడే మరణించారు. అయితే, డేవ్ భార్య జెస్నీ ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడింది. ‘అట్లాంటా న్యూస్ ఫస్ట్’ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
నివేదికల ప్రకారం.. డేవ్ తల్లిదండ్రులు జార్జ్, ఫీబా ఫిజీలు చాలా సంవత్సరాల క్రితమే కేరళలోని ఎర్నాకులం జిల్లా మూవాట్టుపుళా నుండి అమెరికాకు వలస వెళ్లారు. అలాగే జెస్నీ కుటుంబానికి కూడా కేరళలోని ఆలప్పుజ జిల్లాతో బలమైన మూలాలు ఉన్నాయి. వీరిద్దరి వివాహం డాసన్విల్లేలోని ‘ది రివేర్’ వేదికగా వందలాది మంది బంధుమిత్రుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగింది. “నా కుమారుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు” అంటూ డేవ్ తండ్రి జార్జ్ ఫిజీ కన్నీరుమున్నీరయ్యారు.
“నేను అక్కడ నిలబడి నా కొడుకును చూస్తూ మురిసిపోయాను. పెళ్లి దుస్తుల్లో వాడు ఎంతో అందంగా ఉన్నాడు” అని జార్జ్ గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సౌత్ కరోలినా మరియు జార్జియాలోని చర్చి కనెక్షన్ల ద్వారా డేవ్, జెస్నీలకు పరిచయం ఏర్పడిందని.. మొదట స్నేహితులుగా మారిన వీరు ఆ తర్వాత జీవిత భాగస్వాములు కావాలని నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు.
వివాహ వేడుకలు ముగిసిన తర్వాత, కొత్త జంట అట్లాంటా డౌన్టౌన్లోని ఒక హోటల్లో రాత్రి గడపడానికి ప్రత్యేక వీడ్కోలు (సెండ్ఆఫ్) లో భాగంగా హెలికాప్టర్ ఎక్కారు. అయితే, వారు బయలుదేరిన కొద్దిసేపటికే వాతావరణం దారుణంగా క్షీణించింది. దట్టమైన పొగమంచు మరియు వర్షం కారణంగా అట్లాంటా నగరానికి చెందిన 10,000 ఎకరాల దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ హెలికాప్టర్ కూలిపోయింది.
అడవి దట్టంగా ఉండటం వల్ల కూలిపోయిన హెలికాప్టర్ను గుర్తించడానికి రెస్క్యూ టీమ్కు చాలా సమయం పట్టింది. జెస్నీ దాదాపు ఆరు గంటల పాటు ఆ హెలికాప్టర్ శిథిలాల మధ్యే చిక్కుకుపోయింది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ, కళ్ల ముందే భర్తను కోల్పోయింది.
“ఆమె స్పృహలోకి వచ్చేసరికి నా కొడుకు డేవ్ తల ఆమె రొమ్ముపైనే ఉంది. అతని ఒంటిపై రక్తం చూసి, తాకినప్పుడు శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. జెస్నీ వృత్తిరీత్యా నర్స్ కావడంతో, డేవ్ అప్పటికే శ్వాస విడిచి చనిపోయాడని ఆమెకు అర్థమైంది” అని తండ్రి జార్జ్ అత్యంత బాధాతప్త హృదయంతో చెప్పారు. వాతావరణం బాలేనందున తాము ఎగరడం లేదని డేవ్ ముందే చెప్పినప్పటికీ, పై ఎత్తులో ప్రయాణిద్దామని హెలికాప్టర్ పైలట్ నచ్చజెప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా ఏవియేషన్ అధికారులు ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jun 01, 2026 12:51 PM IST













