Last Updated:
కాలం చెల్లిన పదార్థాలు, కుళ్లిన కోడిగుడ్లు డెలివరీ చేస్తున్న స్విగ్గీ ఇన్స్టామార్ట్పై భారత ఆహార భద్రతా నియంత్రణ సంస్థ (FSSAI) కొరడా ఝుళిపించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఏకంగా 9 నోటీసులు జారీ చేసి, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ స్విగ్గీ ఇన్స్టామార్ట్కు (Swiggy Instamart) ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) భారీ షాక్ ఇచ్చింది. కాలం చెల్లిన, కుళ్లిపోయిన, కలుషితమైన ఆహార పదార్థాలను వినియోగదారులకు డెలివరీ చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆ సంస్థకు ఏకంగా 9 నోటీసులు జారీ చేసింది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువులు పూర్తిగా పాడైపోయి వస్తున్నాయని, పురుగుల పట్టిన ఆహారాన్ని పంపుతున్నారని వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ముఖ్యంగా ఎక్స్పైరీ డేట్ దాటిపోయిన ప్రోటీన్ పౌడర్లు, తినడానికి ఏమాత్రం పనికిరాని దుర్వాసన వస్తున్న ‘కక్కే దా పరాఠా’, పసిపిల్లలకు పట్టే పాలపొడి సైతం కలుషితమై వస్తోందని వినియోగదారులు ఆధారాలతో సహా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తీవ్రంగా స్పందించిన FSSAI వెంటనే సరైన వివరణ ఇవ్వకపోతే ఫుడ్ సేఫ్టీ చట్టం 2006 కింద కఠిన చర్యలు తీసుకుంటామని స్విగ్గీ ఇన్స్టామార్ట్ను తీవ్రంగా హెచ్చరించింది.
వినియోగదారులు చేసిన ఫిర్యాదుల్లో అక్షయకల్ప ఆర్గానిక్ కోడిగుడ్లు పూర్తిగా కుళ్లిపోయి దారుణమైన వాసన వస్తున్నాయని అధికారులు గుర్తించారు. పిల్లలకు ఇచ్చే ఆహారం సైతం డ్యామేజ్ అయ్యి, నాణ్యతా లోపాలతో ఉందని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. నాసిరకం వస్తువులను వెనక్కి పంపినా మళ్లీ అవే వస్తువులను డెలివరీ చేశారని అసహనం వ్యక్తం చేసింది.
FSSAI has issued 9 notices to Swiggy Instamart following multiple consumer complaints alleging violations under the FSS Act 2006.
The FBO has been directed to submit a detailed explanation & compliance report failing which appropriate legal action will be initiated #FSSAINotice pic.twitter.com/wxejz38L7T— FSSAI (@fssaiindia) July 11, 2026
హెల్తీఫై 100% వే ప్రోటీన్, నాయిస్ హోమ్స్టైల్ మద్రాస్ మిక్చర్ లాంటి ఉత్పత్తులను గడువు ముగిసిన తర్వాత కూడా విక్రయిస్తున్నట్లు అధికారులు తేల్చారు. కొన్ని ఉత్పత్తులను సరైన ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేకుండానే అమ్ముతున్నారని నోటీసుల్లో స్పష్టం చేశారు. లైసెన్స్ వివరాలు తప్పుగా నమోదు చేసిన వ్యాపారులపై కూడా అధికారులు దృష్టి సారించారు.
నోటీసులపై స్విగ్గీ స్పందిస్తూ తమ నాణ్యతా నియంత్రణ, ఆహార భద్రతా చర్యలు, గిడ్డంగుల నిర్వహణపై పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులు ఆదేశించారు. లోపాలను సరిదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో డాక్యుమెంట్ల ఆధారంగా వివరించాలని స్పష్టం చేశారు. తప్పులు పునరావృతం కాకుండా తీసుకునే జాగ్రత్తలపై తక్షణమే స్పందించాలని అధికారులు స్విగ్గీ యాజమాన్యానికి సూచించారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














