Today Top 10 News: నేడు దేశంలో జరిగిన టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు | ACTPnews

Today Top 10 News: నేడు దేశంలో జరిగిన టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు


రామచందర్ రావు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లతో మోసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే మార్గంలో నడుస్తోందన్నారు. హైదరాబాద్‌లో తాగునీరు, కాలుష్య నియంత్రణ, వర్షాల సమస్యలపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

——–

2.అరెస్ట్‌కు నేను సిద్ధం

ప్రొఫెసర్ నాగేశ్వర్ తనపై నమోదైన కేసుల విషయంలో తాను అరెస్ట్‌కు సిద్ధమని, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించబోనని ప్రకటించారు. పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యల కారణంగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. జైలు జీవితం మాత్రమే తనకు అనుభవం కాలేదని, అది కూడా ఎదురైతే తన ఆత్మకథలో భాగమవుతుందని వ్యాఖ్యానించారు. అనంతరం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోగా, జనసేన కూడా వివాదానికి ముగింపు పలికినట్లు ప్రకటించింది.

———–

3.గోదావరి, కృష్ణమ్మ వెలవెల అని పాడుకోవాలా?

పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో గోదావరి కాలుష్యాన్ని పరిశీలించి నదుల దుస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా తెలుగు తల్లి’ గేయంలో.. గోదావరి, కృష్ణమ్మల ‘గలగల’లు అని గర్వంగా పాడుకుంటాం. నేడు పరిశ్రమల వ్యర్థాలతో నదులు మురికికూపాలుగా మారుతున్న తీరు చూస్తుంటే.. గోదావరి, కృష్ణమ్మ ‘వెలవెల’ అని పాడుకోవాల్సివస్తుందేమోనని అన్నారు”. కాలుష్య నీటి నమూనాలను పరీక్షలకు పంపించి, నిబంధనలు ఉల్లంఘించిన ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోదావరి కాలుష్య నియంత్రణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.

———

4.ఏఐతో భారత్‌కు పెద్ద సవాల్‌!

ప్రముఖ టెక్‌ సంస్థ ఐబీఎం ఇండియా సందీప్ పటేల్ భారత్‌ ఏఐ రంగంలో అగ్రగామిగా ఎదగాలంటే నైపుణ్యాభివృద్ధి, శిక్షణపై ప్రభుత్వం, కంపెనీలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని సూచించారు. యువతే భారతదేశానికి అతిపెద్ద బలం అని, ఏఐకు తగ్గట్టు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని అన్నారు. ఏఐ ఉద్యోగాలను పూర్తిగా తొలగించకపోయినా, పనుల స్వరూపాన్ని మాత్రం మార్చేస్తుందని హెచ్చరించారు. ఉద్యోగులను తిరిగి శిక్షణ ఇచ్చి భవిష్యత్తు అవసరాలకు సిద్ధం చేయడం ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారిందన్నారు.

———-

5.వెళ్లగొట్టకముందే పారిపోండి

పశ్చిమ బెంగా సీఎం సువేందు అధికారి బెంగాల్‌లో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బంగ్లాదేశీయులు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సరైన పత్రాలు లేని వారికోసం నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మాల్దాలో తొలి కేంద్రాన్ని ప్రారంభించగా, త్వరలో మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

——–

6.చిరంజీవి వాటిని పరిష్కారిస్తారు

దిల్ రాజు పర్సంటేజీ విధానం కేవలం ‘పెద్ది’ సినిమాకే కాకుండా మొత్తం పరిశ్రమకు సంబంధించిన అంశమని తెలిపారు. ఈ సమస్యపై నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కలిసి చిరంజీవిను కలిసి చర్చించారు. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల సమస్యలపై చిరంజీవి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. రెండు రోజుల్లో పర్సంటేజీ విధాన సమస్యకు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం వస్తుందని దిల్ రాజు అన్నారు.

——–

7.రణ్‌వీర్‌ సింగ్‌పై బాలీవుడ్‌ నిషేధం

‘ధురంధర్‌’ విజయంతో బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన రణ్‌వీర్ సింగ్ ఇప్పుడు ‘డాన్‌3’ వివాదంతో వార్తల్లో నిలిచారు.’రణ్‌వీర్ సింగ్ ‘డాన్‌ 3’ ప్రాజెక్ట్‌ నుంచి షూటింగ్‌కు మూడు వారాల ముందే తప్పుకోవడంతో వివాదం ముదిరింది. నిర్మాత ఫర్హాన్ అక్తర్ ఫిర్యాదుతో ఎఫ్‌డబ్ల్యూఐసీఈ రంగంలోకి దిగింది. ప్రీ-ప్రొడక్షన్‌, విదేశాలలో షూటింగ్ బుకింగ్‌ల కారణంగా నిర్మాతలకు రూ.45 కోట్ల నష్టం వాటిల్లిందని ఫెడరేషన్ తెలిపింది. రణ్‌వీర్ స్పందించకపోవడంతో ఆయనతో ఎవరూ పనిచేయవద్దంటూ సహాయ నిరాకరణ ఆదేశాలు జారీ చేసినట్లు ఎఫ్‌డబ్ల్యూఐసీఈ వెల్లడించింది. రణ్‌వీర్‌పై మూడేళ్ల నిషేధం విధించినట్లు సమాచారం. దీంతో బాలీవుడ్‌లో ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

———-

8.నాపై వస్తున్న విమర్శల్లో న్యాయముంది

ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్ ఇటీవల తన ప్రదర్శన అంచనాలకు తగ్గట్లుగా లేదని అంగీకరించాడు. విమర్శకుల అభిప్రాయాల్లో నిజం ఉందని, మరిన్ని టోర్నీల్లో పాల్గొని మెరుగైన ఆట చూపాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ప్రపంచ టైటిల్‌ గెలవడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం కష్టమని, ఒత్తిడి మధ్య తన శాయశక్తులా పోరాడతానని పేర్కొన్నాడు. గత ఏడాది నార్వే చెస్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్ కార్ల్‌సన్పై గుకేశ్‌ సాధించిన విజయం ప్రశంసనీయమైనది.

——-

9.ఇరాన్‌ యురేనియం నాశనం చేయండి

అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి చర్చల్లో యురేనియం అంశం కీలకంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించాలని, లేకపోతే అంతర్జాతీయ సంస్థల సమక్షంలో నాశనం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు మసౌద్ పెజెష్కియాన్ తమకు అణ్వాయుధాల లక్ష్యం లేదని ప్రపంచానికి భరోసా ఇచ్చేందుకు సిద్ధమన్నారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌ లెబనాన్‌లో హెజ్‌బొల్లా స్థావరాలపై భారీ దాడులు చేసి పలుచోట్ల ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది.

——-

10.’అబ్రహాం అకార్డ్స్’..ఇరకాటంలో పాకిస్థాన్!

పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అబ్రహాం ఒప్పందాల్లో చేరాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపును తీవ్రంగా తిరస్కరించారు. పాలస్తీనా దేశం ఏర్పడే వరకు ఇజ్రాయెల్‌ను గుర్తించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమెరికాతో సంబంధాలు మెరుగుపర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ విషయంలో తమ సంప్రదాయ వైఖరి మారదని పాక్ తెలిపింది. పాలస్తీనాకు పాకిస్థాన్‌లో బలమైన ప్రజా మద్దతు ఉండటంతో ఈ అంశంపై వెనక్కి తగ్గే అవకాశం లేదని ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed