Last Updated:
ఏడుకొండల వాడి సన్నిధిలో వీళ్ల ఆగడాలు మామూలుగా లేవుగా.. ఈ కిలాడీ లేడీ వేసిన మాస్టర్ ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!
కలియుగ వైకుంఠం తిరుమల కొండపైకి నిత్యం లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం వస్తుంటారు. అయితే, ఆ భక్తిభావాన్ని, యాత్రికుల రద్దీని క్యాష్ చేసుకునేందుకు కొందరు కేటుగాళ్లు పన్నిన వలకట్లను పోలీసులు తాజాగా ఛేదించారు. భక్తులే లక్ష్యంగా జేబు దొంగతనాలు చేస్తూ, నకిలీ గుర్తింపు కార్డులతో మోసాలకు పాల్పడుతున్న ఓ భారీ అంతర్రాష్ట్ర ముఠా గుట్టును తిరుమల టూ టౌన్ పోలీసులు రట్టు చేశారు. రాంభగీచ కార్ పార్కింగ్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి ముగ్గురు పక్కా ప్రొఫెషనల్ దొంగలను అదుపులోకి తీసుకోవడంతో ఒక పెద్ద క్రైమ్ సిండికేట్ బట్టబయలైంది.
పోలీసులు అదుపులోకి తీసుకున్న ఈ ముఠాలో బాలాజీ అకాడే (33), కీర్తి రెడ్డి (31), అప్పాషా మానే (65) ఉన్నారు. వీరు సాధారణ యాత్రికుల్లా తిరుమలలో సంచరిస్తూ, రద్దీగా ఉండే ప్రాంతాలను తమ అడ్డాలుగా మార్చుకున్నారు. ముఖ్యంగా బస్ స్టాండ్లు, ధర్మరథాలు (ఉచిత బస్సులు), క్యూలైన్ల వద్ద భక్తులు ఏమరపాటుగా ఉన్న సమయంలో తమ చేతివాటం ప్రదర్శించేవారు. పక్కా స్కెచ్తో బ్లేడ్లు, కట్టర్లతో వారి బ్యాగులు, పర్సులను అత్యంత చాకచక్యంగా కత్తిరించి చోరీలకు పాల్పడటం వీరి ప్రధాన వృత్తి. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టి వీరిని అడ్డంగా బుక్ చేశారు.
ఈ ముఠా విచారణలో పోలీసులకే మైండ్బ్లాక్ అయ్యే ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఠాలోని ప్రధాన నిందితురాలు కీర్తి రెడ్డి ఏకంగా నకిలీ టీటీడీ ఉద్యోగి గుర్తింపు కార్డును సృష్టించి భక్తులకు వల వేసేది. మెడలో ఆ ఐడీ కార్డు వేసుకుని, తాను టీటీడీలో కీలక ఉద్యోగినంటూ అమాయక యాత్రికులను నమ్మించేది. వీఐపీ బ్రేక్ దర్శనం, రూమ్స్, ఇతర ప్రత్యేక దర్శన టికెట్లు సులభంగా ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి వారి నుంచి ఫోన్పే ద్వారా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠా నుంచి పోలీసులు పలు కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద రూ.5,100 నగదు, దొంగిలించిన పర్సు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డుతో పాటు భక్తులను బురిడీ కొట్టించేందుకు వాడిన నకిలీ టీటీడీ ఐడీ కార్డు లభ్యమయ్యాయి. అలాగే రెండు పోకో స్మార్ట్ఫోన్లు, ఒక లావా కీప్యాడ్ ఫోన్, బ్యాగులు కత్తిరించేందుకు వాడే కట్టర్, చిన్న కత్తి, బ్లేడ్లు, భక్తుల దృష్టి మరల్చేందుకు ఉపయోగించే గిల్ట్ నగలను సీజ్ చేశారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టంలోని సంబంధిత కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దొరికిన వస్తువులను జప్తు చేసి నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ భారీ మోసం వెలుగుచూసిన నేపథ్యంలో తిరుమల పోలీసులు స్వామివారి భక్తులకు కీలక సూచనలు జారీ చేశారు. కొండపైకి వచ్చే యాత్రికులు దళారులు, అపరిచితులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. దర్శనం, గదులు ఇప్పిస్తామని ఎవరైనా ఆశచూపితే ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి నగదు ఇవ్వడం గానీ, ఆన్లైన్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం గానీ చేయవద్దని స్పష్టం చేశారు. కేవలం టీటీడీ అధికారిక కౌంటర్లు, వెబ్సైట్ సేవలను మాత్రమే వినియోగించుకోవాలని కోరారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Tirumala,Chittoor,Andhra Pradesh














