DMK: డీఎంకే యూ-టర్న్? మోదీ ప్రభుత్వ ‘నియోజకవర్గాల పునర్విభజన’ బిల్లుకు మద్దతు! | | ACTPnews

ఎంకే స్టాలిన్ (ఫైల్ ఫోటో)


Last Updated:

DMK: ఆదివారం జరిగిన సర్వపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘నియోజకవర్గాల పునర్విభజన బిల్లు’ (Delimitation Bill)పై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే (DMK) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎంకే స్టాలిన్ (ఫైల్ ఫోటో)
ఎంకే స్టాలిన్ (ఫైల్ ఫోటో)

ఈ బిల్లుకు ఎన్డీయే (NDA) ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అంగీకరించిందని ఆర్‌ఎస్‌పీ (RSP) లోక్‌సభ ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్ సంచలన ప్రకటన చేశారు. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ప్రతిపాదన రాలేదని డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ పేర్కొనడం గమనార్హం.

నేతల మాటల్లో భిన్నాభిప్రాయాలు

అఖిల పక్ష సమావేశం అనంతరం ఎంపీ ప్రేమచంద్రన్ మీడియాతో మాట్లాడుతూ, “దురదృష్టవశాత్తూ, డీఎంకే ఈ పునర్విభజన బిల్లుకు మద్దతు ఇచ్చింది” అని చెప్పారు. దీనిపై డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ స్పందిస్తూ.. “ప్రభుత్వం పునర్విభజనపై ఎలాంటి స్పష్టమైన ప్రతిపాదనను ముందుకు తీసుకురాలేదు. దక్షిణ రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగకూడదు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రస్తుతమున్న స్థానాల ఆధారంగానే వెంటనే అమలు చేయాలి. పునర్విభజనపై ప్రభుత్వం తన వైఖరిని మరింత స్పష్టం చేయాలి” అని అన్నారు.

హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో మౌఖికంగా చెప్పినట్లు.. నియోజకవర్గాల స్థానాలను 50% పెంచుతామని బిల్లులో అధికారికంగా చేరిస్తే, దీనిపై సానుకూలంగా ఆలోచించడానికి డీఎంకే సిద్ధంగా ఉందని పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుత వర్షాకాల సమావేశాలలో ఈ బిల్లును ఆమోదించడానికి ప్రభుత్వం ఇంకా జాబితా చేయనప్పటికీ, తమకు అవసరమైన సంఖ్యాబలం లభిస్తుందనే ధీమాతో ఎన్డీయే ఉంది.

కాంగ్రెస్‌కు హ్యాండ్.. మెత్తబడ్డ డీఎంకే వైఖరి

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ‘ఇండియా’ (INDIA) కూటమి నుంచి వైదొలిగిన డీఎంకే, కాంగ్రెస్‌తో బంధాన్ని తెంచుకుంది. అప్పటినుంచి కాంగ్రెస్‌తో కలిసి కాకుండా, కేవలం తమిళనాడు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఈ బిల్లును అంచనా వేస్తామని డీఎంకే సంకేతాలిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను సమానంగా 50% పెంచాలనే ఎన్డీయే కొత్త ప్రతిపాదన కారణంగానే డీఎంకే తన పట్టును సడలించినట్లు తెలుస్తోంది. దీనివల్ల జనాభా నియంత్రణ పాటించిన దక్షిణ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళన తప్పుతుందని భావిస్తున్నారు.

పార్లమెంట్‌లో నంబర్ గేమ్

రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ పునర్విభజన బిల్లు పాస్ కావాలంటే ఎన్డీయే ప్రభుత్వానికి మూడింట రెండొంతుల మెజారిటీ (360 ఓట్లు) అవసరం. ప్రస్తుతం ఎన్డీయేకు 319 మంది ఎంపీల బలం ఉంది, అంటే టార్గెట్‌కు ఇంకా 41 ఓట్లు తక్కువగా ఉన్నాయి. ఈ తరుణంలో డీఎంకేకు ఉన్న 22 మంది లోక్‌సభ ఎంపీల బలం అత్యంత కీలకంగా మారింది. డీఎంకే మద్దతు ఇచ్చినా లేదా ఓటింగ్‌కు దూరంగా ఉండి (Abstain) మేజిక్ ఫిగర్‌ను తగ్గించినా ఎన్డీయేకు బిల్లు పాస్ చేసుకోవడం నల్లేరుపై నడకే అవుతుంది.

ఏమిటీ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు-2026?

రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026 ముఖ్య ఉద్దేశం.. 2029 సార్వత్రిక ఎన్నికల కంటే ముందే దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చడం. దీనిలోని 3 ముఖ్యాంశాలు.

పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను 543 నుండి 850కి పెంచడం.

స్థానాల కేటాయింపుపై ఉన్న పాత నిబంధనలను తొలగించి, తాజా జనాభా లెక్కల ఆధారంగా సరిహద్దులను మార్చడానికి కొత్త పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేయడం.

పార్లమెంట్‌లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడం (గతంలో దీనిని జనాభా లెక్కల ప్రక్రియతో ముడిపెట్టారు, అయితే ఈ కొత్త బిల్లు ఆ అడ్డంకిని తొలగించి 2029 కల్లా రిజర్వేషన్లు అమలయ్యేలా చూస్తుంది).

గత ఏప్రిల్ 2026లో దక్షిణ రాష్ట్రాల తీవ్ర నిరసనల కారణంగా ఈ బిల్లు వీగిపోయింది. జనాభాను నియంత్రించిన తమకు అన్యాయం జరుగుతుందని, జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తర రాష్ట్రాలకే సీట్లు పెరిగి దక్షిణాది రాజకీయ ప్రాధాన్యత తగ్గుతుందని తమిళనాడు వంటి రాష్ట్రాలు భయపడ్డాయి. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు సమాన శాతంలో సీట్లు పెంచాలనే ప్రతిపాదనతో కేంద్రం ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *